త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay-Stalin Junior War | స‌మ‌స్య ప‌రిష్కారం కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్తే త‌ప్పేంటి..? సీఎం విజ‌య్ Vs జూనియ‌ర్ స్టాలిన్‌

Vijay-Stalin Junior War | కావేరీ జ‌లాల విష‌యంపై (Cauvery issue) త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ (CM Vijay), ప్ర‌తిప‌క్ష నేత ఉద‌య‌నిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) మ‌ధ్య మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ మేకెదాటు ఆన‌క‌ట్ట నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఏం చ‌ర్య‌లు తీసుకుంటున్నారు..? అంటూ విజ‌య్ ప్ర‌భుత్వాన్ని జూనియ‌ర్ స్టాలిన్ ప్ర‌శ్నించారు. ప్ర‌తిప‌క్ష నేత విమ‌ర్శ‌ల‌పై సీఎం విజ‌య్ ధీటుగా స‌మాధాన‌మిచ్చారు. మేకెదాటు ఆన‌క‌ట్ట‌కు వ్య‌తిరేకంగా త‌మ ప్ర‌భుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింద‌ని గుర్తు చేశారు.

D

National | Published On Aug 7, 2026, 1.05 pm IST

Vijay-Stalin Junior War | స‌మ‌స్య ప‌రిష్కారం కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్తే త‌ప్పేంటి..? సీఎం విజ‌య్ Vs జూనియ‌ర్ స్టాలిన్‌
Advertisement
  • కావేరి విష‌యంలో చౌక‌బారు రాజ‌కీయాలు వ‌ద్దు : సీఎం విజ‌య్‌
  • మేకెదాటుపై ఏం చ‌ర్య‌లు తీసుకున్నారు..? : ఉద‌య‌నిధి
  • త‌మిళ‌నాడు అసెంబ్లీలో సీఎం విజ‌య్ Vs జూనియ‌ర్ స్టాలిన్‌

Vijay-Stalin Junior War | త్రినేత్ర‌.న్యూస్ : కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ జలాల వివాదం (Cauvery Water Dispute) తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై త‌మిళ‌నాడు అసెంబ్లీలో వాడీవేడీ చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి విజ‌య్ (CM Vijay), ప్ర‌తిప‌క్ష‌నేత ఉద‌య‌నిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) మ‌ధ్య మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. ఈ అంశంపై చ‌ర్చించేందుకు అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు డిమాండ్ చేయ‌గా.. అవ‌స‌రం లేద‌ని సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు.

మేకెదాటుపై ఏం చ‌ర్య‌లు తీసుకున్నారు..?

అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా ఉద‌య‌నిధి మాట్లాడుతూ.. టీవీకే ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కావేరీ జలాల సమస్యపై ప్రభుత్వ వైఖరిని స్ప‌ష్టం చేయాల‌ని డిమాండ్ చేశారు. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ మేకెదాటు ఆన‌క‌ట్ట నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఏం చ‌ర్య‌లు తీసుకుంటున్నారు..? అంటూ ప్ర‌శ్నించారు. ఈ అంశంపై పొరుగు రాష్ట్రం అఖిల‌ప‌క్షం ఏర్పాటు చేసిన త‌మ ఐక్య‌త‌ను చాటింద‌న్నారు. కానీ టీవీకే ప్ర‌భుత్వం మాత్రం అఖిల‌ప‌క్ష స‌మావేశానికి నిరాక‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు. మేకెదాటుపై చ‌ర్చించేందుకు మ‌న సీఎం బెంగ‌ళూరు వెళ్లాల్సిన అవ‌స‌రం ఏముంది..? అంటూ ప్ర‌శ్నించారు.

అసెంబ్లీలో తీర్మానం చేశాం.. ప్ర‌ధానికి లేఖ రాశాం

ప్ర‌తిప‌క్ష నేత విమ‌ర్శ‌ల‌పై సీఎం విజ‌య్ ధీటుగా స‌మాధాన‌మిచ్చారు. మేకెదాటు ఆన‌క‌ట్ట‌కు వ్య‌తిరేకంగా త‌మ ప్ర‌భుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింద‌ని గుర్తు చేశారు. అంతేకాదు, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ ప్రాజెక్టును వ్య‌తిరేకిస్తూ తాను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి లేఖ కూడా రాసిన‌ట్లు గుర్తు చేశారు. త‌మిళ‌నాడు రైతుల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు ఎలాంటి చ‌ర్యలు తీసుకునేందుకైనా త‌మ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని సీఎం విజ‌య్ స్ప‌ష్టం చేశారు. కావేరీ అంశంపై తాము చీప్ పాలిటిక్స్‌కు పాల్పడదలుచుకోలేదని సీఎం వ్యాఖ్యానించారు.

పొరుగు రాష్ట్రానికి వెళ్తే త‌ప్పేంటి..?

1969 నుంచి తమిళనాడు ఈ సమస్యను ఎదుర్కొంటోంద‌ని చెప్పారు. ద‌శాబ్దాలుగా కావేరీ వివాదం విష‌యంలో త‌మిళ‌నాడు అనుస‌రించిన విధానాల‌ను విజ‌య్ ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. చ‌ర్చ‌ల ద్వారానే స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని చెప్పారు. శ‌త్రు దేశాలే స‌మ‌స‌ల్య ప‌రిష్కారానికి చ‌ర్చ‌ల మార్గాల‌ను అనుస‌రిస్తున్నాయ‌ని తెలిపారు. అలాంట‌ప్పుడు రాష్ట్ర స‌మ‌స్య ప‌రిష్కారం కోసం తాను పొరుగు రాష్ట్రానికి వెళ్తే త‌ప్పేంటి..? అని విజ‌య్ ప్ర‌శ్నించారు. గ‌త చ‌రిత్ర‌ను ప్ర‌స్తావించి చౌక‌బారు రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌టం త‌న‌కు ఇష్టం లేద‌న్నారు. కావేరీ విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం న్యాయ‌ప‌రంగా ముంద‌కు వెళ్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల విష‌యంలో రాజీప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం కావేరీపై చ‌ర్చ‌లు జ‌రిపే ప్ర‌య‌త్నంలో తాను అవ‌మానాల‌ను భ‌రించ‌డానికైనా సిద్ధ‌మేన‌ని ఈ సంద‌ర్భంగా సీఎం విజ‌య్ స్ప‌ష్టం చేశారు.

ఇదీ వివాదం..

కావేరీ న‌దిపై రామనగర జిల్లా కనకపుర సమీపంలోని మేకెదాటు వ‌ద్ద ఒక బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్ నిర్మించాల‌ని కర్ణాటక ప్రభుత్వం చాలా కాలంగా ప్లాన్ చేస్తోంది. అయితే ఈ రిజర్వాయర్ (Mekedatu Dam) నిర్మాణాన్ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం మొద‌ట్నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. దీనివ‌ల్ల త‌మ రాష్ట్రానికి రావాల్సిన కావేరి నీటి వాటా దెబ్బ‌తింటుంద‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం వాదిస్తోంది. ఈ విష‌యంపై ఇటీవ‌లే ప్ర‌ధాని మోదీకి సీఎం విజ‌య్ లేఖ కూడా రాసిన విష‌యం తెలిసిందే. ఇది సుప్రీంకోర్టు సమర్థించిన కావేరీ వాటర్ ట్రిబ్యునల్ (Cauvery Water Tribunal) నిర్ణయానికి పూర్తి విరుద్ధమని సీఎం విజయ్ తన లేఖలో ప్రధానంగా వాదించారు. మేకెదాటు ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయొద్ద‌ని, కావేరి ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం తమిళనాడు నీటి హక్కులను రక్షించాలని కోరారు. ఆ త‌ర్వాత ప్ర‌ధానితో ముఖాముఖి భేటీలో కూడా మేకెదాటు అంశంపై విజ‌య్ చ‌ర్చించారు. కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన 'మేకెదాటు రిజర్వాయర్' (Mekedatu Dam) నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్ర‌భుత్వం అసెంబ్లీలో ఈ ఏడాది జూన్‌లో తీర్మానాన్ని కూడా ప్ర‌వేశ‌పెట్టారు.

Also Read..

నీట్ పేప‌ర్ లీక్ చేసింది ఎన్టీఏ సబ్జెక్టు నిపుణులే.. గుట్టు విప్పిన సీబీఐ

బావిలో నిరంత‌రం ఎగ‌సిప‌డుతున్న అల‌లు.. వీడియో వైర‌ల్‌

తెలంగాణకు గొప్ప చేనేత వార‌సత్వం ఉంది.. కార్మికుల స‌మ‌స్య‌ల కోసం బీజేపీ పోరాడుతుంది

Advertisement
Advertisement