త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET Paper Leak | నీట్ పేప‌ర్ లీక్ చేసింది ఎన్టీఏ సబ్జెక్టు నిపుణులే.. గుట్టు విప్పిన సీబీఐ

NEET Paper Leak | దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన నీట్‌-యూజీ (NEET-UG) 2026 పేప‌ర్ లీక్ ఘ‌ట‌న‌పై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించింది. పేపర్ లీకేజీ వెనుక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నియమించిన సబ్జెక్టు నిపుణుల హస్తం ఉంద‌ని తేల్చింది.

D

National | Published On Aug 7, 2026, 12.19 pm IST

NEET Paper Leak | నీట్ పేప‌ర్ లీక్ చేసింది ఎన్టీఏ సబ్జెక్టు నిపుణులే.. గుట్టు విప్పిన సీబీఐ
Advertisement

NEET Paper Leak | త్రినేత్ర‌.న్యూస్ : దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన నీట్‌-యూజీ (NEET-UG) 2026 పేప‌ర్ లీక్ ఘ‌ట‌న‌పై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) త‌న ద‌ర్యాప్తును వేగ‌వంతం చేసింది. ఈ కుంభ‌కోణానికి సంబంధించి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో 94 పేజీల ఛార్జ్‌షీట్ దాఖ‌లు చేసింది. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితుల‌పై వివిధ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు తెలిపింది. ఈ ఛార్జ్‌షీట్ ద్వారా సీబీఐ సంచలన విషయాలను వెల్లడించింది. ప్ర‌శ్న‌ల రూప‌క‌ల్ప‌న‌లోనే పేప‌ర్‌లీక్ జ‌రిగింద‌ని వెల్ల‌డించింది. పేపర్ లీకేజీ వెనుక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నియమించిన సబ్జెక్టు నిపుణుల హస్తం ఉంద‌ని తేల్చింది.

సీబీఐ ఛార్జ్‌షీట్‌ ప్ర‌కారం.. ప్రశ్నపత్రాల రూపకల్పనలో భాగమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) బృందంలోని ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులే (Testing Agency Experts) లీకేజీకి పాల్ప‌డ్డార‌ని సీబీఐ ఆరోపించింది. వారిని కెమిస్ట్రీ సబ్జెక్ట్ నిపుణులు పీవీ కుల‌క‌ర్ణి, బాటనీ సబ్జెక్ట్ నిపుణులు మ‌నీషా మాంధారే, ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు మనీషా హవాల్దార్‌గా గుర్తించింది. డిజిట‌ల్ ఆధారాలు దొర‌క్కుండా నిందితులు అత్యంత చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ద‌ర్యాప్తు సంస్థ త‌న ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ ముగ్గురికి ఎన్టీఏలో క్వ‌శ్చ‌న్ సెట్టింగ్‌, ట్రాన్స్‌లేష‌న్ సెక్ష‌న్ల‌కు యాక్సెస్ ఉంద‌ని తెలిపింది.

ప్ర‌శ్న‌ల‌ను చీటీల‌పై రాసుకొని..

ఎన్టీఏ సెంట‌ర్‌లో ప్ర‌శ్నాప‌త్రాల‌ను త‌యారు చేస్తున్న స‌మ‌యంలో.. ఈ ముగ్గురు నిందితులు ప్ర‌శ్న‌ల‌ను కాపీ చేసి వాటిని చీటీల‌పై రాసుకున్నార‌ని తెలిపింది. ప్రశ్నలకు సంబంధించిన ఎన్‌సీఈఆర్టీ (NCERT) పాఠ్యపుస్తకాల్లోని పేరాగ్రాఫ్‌లను పెన్సిల్ లేదా పెన్‌తో మార్క్ చేసిన‌ట్లు వివ‌రించింది. ఇలా సేక‌రించిన స‌మాచారాన్ని మ‌ధ్య‌వ‌ర్తులు, కోచింగ్ నెట్‌వ‌ర్క్‌ల ద్వారా విద్యార్థుల‌కు చేర‌వేసిన‌ట్లు గుర్తించింది.

ఆర్థిక ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యం

నిందితులు కేవ‌లం ఆర్థిక ప్ర‌యోజ‌నాల కోస‌మే కాకుండా.. తాము నిర్వ‌హిస్తున్న ట్యూష‌న్‌ల స‌క్సెస్ రేట్‌ను పెంచుకునేందుకు నిందితులు ఇలా చేశార‌ని సీబీఐ ఆరోపించింది. ప్రైవేటు కోచింగ్ సెష‌న్స్ సంద‌ర్భాల్లో లీక్ చేసిన ప్ర‌శ్న‌ల‌ను విద్యార్థుల‌తో రాయించార‌ని తెలిపింది. సోదాల స‌మ‌యంలో చేతిరాతల‌కు సంబంధించిన ఆధారాల‌ను సేక‌రించిన‌ట్లు కూడా సీబీఐ త‌న ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. తేలికైన ప్ర‌శ్న‌ల‌ను కంఠ‌స్తం చేసి, ఆ త‌ర్వాత త‌మ హోట‌ల్ రూమ్‌లో వాటిని పేప‌ర్‌పై రాసుకునేవార‌ని వివ‌రించింది.

NTAలో భారీ భద్రతా లోపాలు

ఈ సంద‌ర్భంగా నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీలో భారీ భ‌ద్ర‌తా లోపాలు ఉన్న‌ట్లు సీబీఐ గుర్తించింది. ఎన్టీఏలోని కాన్ఫిడెన్షియ‌ల్ సెక్ష‌న్‌లోకి వ‌చ్చిపోయే నిపుణుల‌ను చెక్ చేసే, ఫ్రిస్కింగ్ చేసే విధాన‌మే లేద‌ని త‌న ఛార్జ్‌షీట్‌లో సీబీఐ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న కెమిస్ట్రీ నిపుణుడు పీవీ కుల‌క‌ర్ణి మూడు రోజుల్లోనే మూడు సెట్ల (మొత్తం 135 ప్రశ్నలు) ప్ర‌శ్న‌ల‌కు సంబంధించి ట్రాన్స్‌లేట్ చేశాడ‌ని తెలిపింది.

13 మంది నిందితులు అరెస్ట్..

ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కూ 13 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. వీరిలో ముగ్గురు ఎన్టీఏ స‌బ్జెక్ట్ నిపుణులు, కోచింగ్ సెంట‌ర్ల‌తో సంబంధం ఉన్న వ్య‌క్తులు, మ‌ధ్య‌వ‌ర్తులు, లాభ‌ప‌డిన విద్యార్థులు ఉన్నారు. ఎన్టీఏలో ప‌నిచేస్తున్న‌ కొంద‌రు త‌మ అధికారాన్ని వాడుకుని ర‌హ‌స్య స‌మాచారాన్ని సేక‌రించిన‌ట్లు సీబీఐ గుర్తించింది. ఈ కేసుతో లింకున్న‌ సుమారు 20 వేల పేజీల ఆధారాల‌ను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూకోర్టుకు సీబీఐ స‌మ‌ర్పించింది. ఈ కేసుకు సంబంధించి 360 మంది సాక్షులు, 422 ప‌త్రాలు, 43 మెటీరియ‌ల్ ఆబ్జెక్టులను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్లు తెలిపింది. ఇక ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న 13 మంది నిందితులు ప్ర‌స్తుతం జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్నారు.

ద‌ర్యాప్తు సాగిందిలా..

పేప‌ర్ లీక్ ఘ‌ట‌న‌పై మే 12న ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైన వెంట‌నే సీబీఐ రంగంలోకి దిగింది. 72 మంది అధికారులు, సిబ్బందితో పాటు 8 మంది సైబర్ ఫోరెన్సిక్ నిపుణులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్‌, హ‌ర్యానా, ఢిల్లీ త‌దిత‌ర రాష్ట్రాల్లోని 92 ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వ‌హించింది. డిజిట‌ల్‌, క‌మ్మూనికేష‌న్ డివైజ్‌ల‌తోపాటూ ప‌లు కీల‌క ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేష‌ణ చేప‌ట్టింది. మే 13వ తేదీన ఈ కేసులో తొలి నిందితుడిని అరెస్టు చేశారు. కోచింగ్ సెంట‌ర్ల‌కు చెందిన ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల ఆర్థిక లావాదేవీల‌పై దృష్టిసారించిన ద‌ర్యాప్తు బృందం.. ప‌లు బ్యాంకు ఖాతాలు, లాక‌ర్లు, ఒక డీమ్యాట్ ఖాతాను ఫ్రీజ్ చేసింది.

Also Read..

భారీ బ్యాట‌రీ, ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లేతో లాంచ్ అయిన వివో ఎస్2 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..

బావిలో నిరంత‌రం ఎగ‌సిప‌డుతున్న అల‌లు.. వీడియో వైర‌ల్‌

త‌న‌కు బ‌దులు విధుల‌కు మ‌రో వ్య‌క్తి.. జోగిపేట ఏరియా హాస్పిటల్ డాక్ట‌ర్‌పై స‌స్పెన్షన్ వేటు

Advertisement
Advertisement