త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP Ramchandar Rao | తెలంగాణకు గొప్ప చేనేత వార‌సత్వం ఉంది.. కార్మికుల స‌మ‌స్య‌ల కోసం బీజేపీ పోరాడుతుంది

BJP Ramchandar Rao | తెలంగాణ‌కు ఘ‌న‌మైన చేనేత వార‌స‌త్వం ఉంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు పేర్కొన్నారు. మన నేతన్నలు తమ అసమాన కళా నైపుణ్యం, అంకితభావంతో రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని తరతరాలుగా పరిరక్షిస్తూ మరింత సుసంపన్నం చేస్తున్నార‌ని కొనియాడారు.

S

Telangana | Published On Aug 7, 2026, 1.01 pm IST

BJP Ramchandar Rao | తెలంగాణకు గొప్ప చేనేత వార‌సత్వం ఉంది.. కార్మికుల స‌మ‌స్య‌ల కోసం బీజేపీ పోరాడుతుంది
Advertisement
  • దేశంలో త‌యార‌య్యే వ‌స్తువుల‌నే ఉప‌యోగించాలి
  • చేనేత వ‌స్త్రాల్లో దేశ ఆత్మ ప్ర‌తిబింబిస్తుంది
  • బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు

BJP Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ‌కు ఘ‌న‌మైన చేనేత వార‌స‌త్వం ఉంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు పేర్కొన్నారు. మన నేతన్నలు తమ అసమాన కళా నైపుణ్యం, అంకితభావంతో రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని తరతరాలుగా పరిరక్షిస్తూ మరింత సుసంపన్నం చేస్తున్నార‌ని కొనియాడారు. గ‌ద్వాల, పోచంప‌ల్లి, సిరిసిల్ల‌, కొత్త‌కోట కేంద్రాల‌తో పాటు అనేక‌ చేనేత కేంద్రాలు ఎంతో విశిష్ట‌త‌ను క‌లిగి ఉన్నాయ‌న్నారు. చేనేత కార్మికుల స‌మ‌స్య‌ల కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. శుక్ర‌వారం జాతీయ‌ చేనేత దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఆయ‌న ఎక్స్ వేదిక‌గా మాట్లాడారు. ప్ర‌తి చేనేత వ‌స్త్రంలో భార‌త‌దేశ ఆత్మ ప్ర‌తిబింబిస్తుంద‌న్నారు.

భారత స్వాతంత్య్ర‌ సంగ్రామ చరిత్రలో ఆగస్టు 7 మహత్తరమైన రోజు. స్వదేశీ ఉద్యమం భారత స్వాతంత్య్ర‌ పోరాటానికి నూతన దిశను చూపి, స్వావలంబనను జాతీయ శక్తికి మూలమంత్రంగా నిలిపిన రోజు ఇది. అసాధారణ నైపుణ్యం, సుసంపన్నమైన సంప్రదాయం, తరతరాల అంకితభావంతో రూపుదిద్దుకున్న మన చేనేత భారతీయ సంస్కృతికి గర్వకారణం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక గుర్తింపును సుసంపన్నం చేస్తూ, దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న ప్రతిభావంతులైన నేతన్నలు, కళాకారులకు మనస్ఫూర్తిగా వందనం తెలుపుదాం అని రాంచంద‌ర్‌రావు పేర్కొన్నారు.

ఆత్మనిర్భర్ భారత్ సంకల్పంతో వికసిత భారత్ లక్ష్యసాధన దిశగా దేశం ముందుకు సాగుతోంది. ఈ సమయంలో స్వదేశీ స్ఫూర్తి మరింత ప్రాసంగికతను సంతరించుకుంది. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇచ్చి, చేనేతను ఆదరించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచి, జాతి ఆత్మవిశ్వాసాన్ని మరింత దృఢ ప‌ర్చాలి. స్వదేశీ వ‌స్తువుల‌నే ఉప‌యోగించాలి. ‘వోకల్ ఫర్ లోకల్’ను కార్యరూపంలోకి తీసుకురావాలి. ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రతిజ్ఞ చేద్దాం అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement