త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Police | మా నాన్న యూనిఫామ్ ర‌క్తంతో త‌డిసిపోయింది.. మాకూ న్యాయం చేయండి.. మీడియా ముందుకొచ్చిన గాయ‌ప‌డ్డ పోలీసు కుటుంబాలు

Delhi Police | కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఆందోళ‌న‌ల‌ స‌మ‌యంలో అనేక మంది పోలీసులు (Delhi Police) కూడా గాయ‌ప‌డ్డారు. పోలీసుల చ‌ర్య‌ల‌పై ఆగ్ర‌హావేశాలు వెల్లువెత్తున్న స‌మ‌యంలో గాయ‌ప‌డ్డ పోలీసు కుటుంబాలు మీడియా ముందు త‌మ గోడును వెల్ల‌బోసుకున్నాయి. త‌మ‌కు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.

D

National | Published On Jul 31, 2026, 1.35 pm IST

Delhi Police | మా నాన్న యూనిఫామ్ ర‌క్తంతో త‌డిసిపోయింది.. మాకూ న్యాయం చేయండి.. మీడియా ముందుకొచ్చిన గాయ‌ప‌డ్డ పోలీసు కుటుంబాలు
Advertisement

Delhi Police | నీట్ పేప‌ర్ లీక్‌కు వ్య‌తిరేకంగా కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఆందోళ‌న‌ల‌ స‌మ‌యంలో విద్యార్థి నిర‌స‌న‌కారుల‌పై పోలీసులు (Delhi Police) లాఠీఛార్జ్‌, పెల్లెట్ గ‌న్స్ వాడారంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. పోలీసుల దాడిలో అనేక మంది విద్యార్థులు గాయ‌ప‌డిన‌ట్లు ప్ర‌తిప‌క్షాలు కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. అయితే, ఈ ఆందోళ‌న‌ల్లో అనేక మంది పోలీసులు కూడా గాయ‌ప‌డ్డారు. పోలీసుల చ‌ర్య‌ల‌పై ఆగ్ర‌హావేశాలు వెల్లువెత్తున్న స‌మ‌యంలో గాయ‌ప‌డ్డ పోలీసు కుటుంబాలు మీడియా ముందు త‌మ గోడును వెల్ల‌బోసుకున్నాయి. త‌మ‌కు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.

సీజేపీ నిర‌స‌న‌ల్లో గాయ‌ప‌డిన పోలీసుల కుటుంబాలు శుక్ర‌వారం మీడియా ముందుకు వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా నిర‌స‌న‌ల స‌మ‌యంలో పోలీసులు ఎదుర్కొన్న భ‌యాన‌క‌, బాధాక‌ర‌మైన అనుభ‌వాల‌ను పంచుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వార‌ని ఆరోపించారు. విద్యార్థుల ముసుగులో అసాంఘిక శ‌క్తులు చొర‌బ‌డి విధ్వంసానికి పాల్ప‌డ్డాయ‌ని ఆరోపించారు. పోలీసుల‌పై మూకుమ్మ‌డి దాడి చేసి.. తిరిగి వారినే నేర‌స్థులుగా చిత్రీక‌రించార‌ని వాపోయారు.

యూనిఫాం వెనుక ఓ కుటుంబం ఉంటుంది

ఆ యూనిఫాం వెనుక కేవలం పోలీసు మాత్రమే ఉండరు. వారి వెనుక ఒక త‌ల్లి, తండ్రి, భార్య‌, పిల్ల‌లు ఇలా మొత్తం కుటుంబం ఉంటుంది. అత‌ను విధులు పూర్తి చేసుకొని సుర‌క్షితంగా ఇంటికి వ‌చ్చే వ‌ర‌కూ కుటుంబం మొత్తం ఎదురుచూస్తుంటుంది అంటూ ఓ మ‌హిళ మీడియా ముందు వాపోయింది.

దాడి చేసిన వారే న్యాయం కోసం కోర్టుకెళ్లారు..

నిరసన సమయంలో గాయపడిన ఢిల్లీ పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ కుమార్తె కుంజ‌ల్‌ మాట్లాడుతూ.. త‌న తండ్రిపై దాదాపుగా హ‌త్యాయ‌త్నం జ‌రిగింద‌ని వాపోయారు. ఆందోళ‌న‌ల స‌మ‌యంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించ‌డానికి బారికేడ్ల ద‌గ్గ‌ర ముందు వ‌రుస‌లో త‌న తండ్రి మోహ‌రించి ఉన్న‌ట్లు తెలిపారు. "మా నాన్న ప్రధాన నిరసన ప్రదేశంలో ఉన్నారు. బారికేడ్ల ద‌గ్గ‌ర ముందు వ‌రుస‌లో ఉన్నారు. రోజూ ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు నిర‌స‌న‌ల గురించి మాతో చెప్పేవారు. ఇవి విద్యార్థి నిర‌స‌న‌ల్లా క‌నిపించ‌డం లేద‌ని.. సంఘ వ్య‌తిరేక శ‌క్తులు ఆందోళ‌న గుంపులో చేరార‌ని చెప్పారు. జులై 25న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల ప్రాంతంలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద వేదిక స‌మీపంలో విధుల్లో ఉన్న మా నాన్న‌ను కొంద‌రు ఆందోళ‌న‌కారులు ఈడ్చుకెళ్లి మూక దాడి చేశారు.

దాదాపు ఆయ‌న‌పై హ‌త్యా ప్ర‌య‌త్నం చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన ఆయ‌న్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో దాదాపు నాలుగు గంట‌ల పాటూ స్పృహలో లేరు. ఆ రాత్రి 10 గంటల ప్రాంతంలో మా నాన్న సహచరులు ఆయన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఆ స‌మ‌యంలో మా నాన్న యూనిఫామ్ పూర్తిగా ర‌క్తంతో త‌డిసిపోయింది. ఆయన్ను ఆ స్థితిలో చూడటం మాకు చాలా బాధ కలిగించింది. అలాంటి రోజును మా జీవితంలో ఎన్న‌డూ చూడ‌లేదు. ఆ రాత్రి మా కుటుంబం ఎదుర్కొన్న అత్యంత కష్టమైన రాత్రుల్లో ఒకటి. ఆ త‌ర్వాత నేను సోష‌ల్ మీడియా తెరిచి చూడ‌గా.. మా నాన్న‌నే నేర‌స్థుడిగా చిత్రీక‌రించారు. దాడి చేసిన వారే సుప్రీంకోర్టును ఆశ్ర‌యించార‌ని తెలుసుకున్నాను. అప్పుడే నిర్ణ‌యించుకున్నా.. మాకూ న్యాయం జ‌ర‌గాల‌ని. అందుకే మేము కూడా న్యాయం కోసం సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశాం" అని స‌ద‌రు యువ‌తి చెప్పుకొచ్చింది. త‌న తండ్రి ఢిల్లీ పోలీసు విభాగంలో చేర‌డానికి ముందు 15 ఏళ్ల పాటు నేవీలో మెరైన్‌ కమాండోగా సేవలందించిన‌ట్లు స‌ద‌రు యువ‌తి తెలిపింది.

మా ఆవేద‌న‌ను కూడా వినండి..

మ‌రో అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ భార్య సీమా మాట్లాడుతూ.. 33 ఏళ్లుగా త‌న భ‌ర్త పోలీసు విభాగంలో ఉన్నార‌ని తెలిపారు. జంత‌ర్ మంత‌ర్ నిర‌స‌న స‌మ‌యంలో ఆయ‌న‌కు కూడా డ్యూటీ ప‌డింద‌ని చెప్పారు. "జులై 20న ఉద‌యం రోజూలానే డ్యూటీకి వెళ్లారు. ఉద‌యం 11 గంట‌ల ప్రాంతంలో త‌న‌తో ఫోన్‌లో మాట్లాడా. అప్పుడు ఆయ‌న జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద జ‌న‌స‌మూహం ఎక్కువ‌గా ఉంద‌ని.. ఆందోళ‌న‌కారులు పార్ల‌మెంట్ వైపు క‌దిలార‌ని చెప్పారు. ఆయ‌న మాట‌లు విన్నాక నాకు చాలా ఆందోళ‌న వేసింది. జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని చెప్పాను. ఆ త‌ర్వాత నేను ఆయ‌న‌తో మాట్లాడ‌లేదు. సాయంత్రం 7 గంట‌ల‌కు ఫోన్ చేస్తే అప్పుడు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు తెలిసింది.

విద్యార్థుల నిర‌స‌న‌ల మాటున అల్ల‌రిమూక‌లు విధ్వంసం సృష్టించారు. రాళ్లు, చెప్పులు ఇలా చేతికి ఏవి దొరికితే వాటితో పోలీసు సిబ్బందిపై దాడి చేసి గాయ‌ప‌రిచారు. ఆయ‌న పెట్టుకున్న హెల్మెట్ కూడా ధ్వంస‌మైంది. ఆయ‌న‌కు ఏదైనా అయ్యి ఉంటే.. ఆ ఊహే న‌న్ను ఉలిక్కిప‌డేలా చేస్తోంది. విద్యార్థులపై పోలీసులు క్రూరంగా దాడి చేశార‌ని మాత్ర‌మే ప్ర‌చారం చేస్తున్నారు. అది నిజం కాదు. నాణేనికి మ‌రోవైపు కూడా ఉంది. దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. రాజ‌కీయ నాయ‌కులు మా ఆవేద‌న‌ను కూడా వినాలి. ఈ విష‌యాల‌పై పార్ల‌మెంట్‌లో గ‌ళం వినిపించాల‌ని నేను ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను కోరుతున్నాను" అంటూ సీమా భావోద్వేగానికి గుర‌య్యారు.

నా నాన్న త‌ల‌కు నాలుగు కుట్లు ప‌డ్డాయ్‌..

గాయపడిన ఓ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్ (ఏసీపీ) కుమారుడు మాట్లాడుతూ తన తండ్రి ఎదుర్కొన్న పరిస్థితిని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆందోళ‌న స‌మ‌యంలో త‌న తండ్రి త‌ల‌పై తీవ్రంగా గాయ‌మైంద‌ని చెప్పారు. నాలుగు కుట్లు ప‌డ్డాయ‌ని చెప్పుకొచ్చారు. ఆయ‌న్ని ఆ ప‌రిస్థితుల్లో చూసి తాను, త‌న కుటుంబం తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. డ్యూటీ చేస్తున్న స‌మ‌యంలో ఈ నిర‌స‌న‌ల్లో సంఘ విద్రోహ శ‌క్తులు ఉన్న‌ట్లు త‌న తండ్రి చెప్పేవాడ‌ని గుర్తు చేశారు. త‌మ‌కు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా నిర‌స‌న‌ల్లో పోలీసుల‌పై దాడుల‌కు సంబంధించిన వీడియోల‌ను బాధిత కుటుంబాల‌కు ప్ర‌ద‌ర్శించారు.

Also Read..

రూ.50వేలకు పైగా విలువైన వ‌స్తువును లేదా డ‌బ్బును గిఫ్ట్‌గా అందుకున్నారా.. ఇలా చేస్తే ప‌న్ను ఉండ‌దు..

బంకర్ బెడ్ల కుంభకోణంపై రేవంత్ ప్ర‌భుత్వానికి నోటీసులు.. ‘పెద్ది’ పోరాట ఫ‌లిత‌మే

ఎల్లంపల్లికి పోటెత్తిన వ‌ర‌ద‌.. 15 గేట్లు ఎత్తి నీటి విడుదల

Advertisement
Advertisement