త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tribunal Reforms | ఖాళీల కారణంగా ట్రిబ్యునల్స్ మూతపడకూడదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీల‌క సూచ‌న‌

Tribunal Reforms | ట్రిబ్యునల్స్‌లో ఖాళీల భర్తీ, సభ్యుల పదవీకాల పొడిగింపునకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వానికి దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీల‌క సూచ‌న‌లు చేసింది.

D

National | Published On Sep 15, 2026, 4.52 pm IST

Tribunal Reforms | ఖాళీల కారణంగా ట్రిబ్యునల్స్ మూతపడకూడదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీల‌క సూచ‌న‌
Advertisement

Tribunal Reforms | త్రినేత్ర‌.న్యూస్ : ట్రిబ్యునల్స్‌లో ఖాళీల భర్తీ, సభ్యుల పదవీకాల పొడిగింపునకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వానికి దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీల‌క సూచ‌న‌లు చేసింది. ఖాళీల కార‌ణంగా ట్రిబ్యున‌ళ్లు ప‌నిచేయ‌ని స్థితికి చేర‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. కొత్త నియామ‌కాలు జ‌రిగి, ఖాళీలు భ‌ర్తీ అయ్యే వ‌ర‌కూ ప‌దవీ విర‌మ‌ణ చేస్తున్న ప్రిసైడింగ్ అధికారులు, స‌భ్యుల ప‌ద‌వీకాలాన్ని నెల లేదా అంత‌కంటే ఎక్కువ‌ రోజులు పొడిగించే అంశాన్ని ప‌రిశీలించాల‌ని కేంద్రానికి సూచించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం (Tribunal Reforms Act) రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ, అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT), డెట్ రికవరీ అప్పీలేట్ ట్రిబ్యునల్ (DRAT) వంటి పలు ట్రిబ్యునళ్లలో సభ్యుల పదవీకాలం ముగిసిపోతుండటంతో తలెత్తిన ఖాళీలపై దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగ‌ళ‌వారం విచారించింది. కొత్తగా తీసుకొచ్చిన ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం, 2026 (Tribunal Reforms Act, 2026) ప్రకారం కొత్త నియామకాల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని కేంద్రం తరఫున విచార‌ణ‌కు హాజరైన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ధ‌ర్మాస‌నానికి తెలిపారు. అందువల్ల ఇలాంటి తాత్కాలిక పొడిగింపుల కోసం చేసే అభ్య‌ర్థ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోన‌వ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు. ఒకటి రెండు నెలల సమయం పెద్ద తేడాను చూపించబోదని వాదించారు. కొత్త చట్టం ప్రకారం అర్హులైన 248 మంది వివిధ ట్రిబ్యున‌ల్ స‌భ్యుల ప‌ద‌వీకాల పొడిగింపు ప్ర‌క్రియ కూడా ప‌రిశీల‌న‌లో ఉంద‌ని ధ‌ర్మాస‌నానికి వివ‌రించారు.

వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం.. శాశ్వత నియామకాలు జరిగే వరకు ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ఏర్పాట్లను మరో నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పొడిగించగలరా..? అని అటార్నీ జ‌న‌ర‌ల్‌ను ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. అంతేకాదు ఖాళీగా ఉన్న పోస్టుల‌ను ఎప్ప‌టిలోగా భ‌ర్తీ చేస్తారో స్పష్టమైన కాలపరిమితిని తెయ‌లిజేయాల‌ని ఆదేశించింది. ఈ పిటిష‌న్ల‌ను ముగించిన త‌ర్వాత కూడా కొత్త నియామ‌కాలు జ‌ర‌గ‌క‌పోతే బాధితులు మ‌ళ్లీ కోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. అలా జ‌ర‌గ‌కుండా శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల‌ని పేర్కొంది. కొత్త నియామకాలు జరిగే వరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) విధులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ముగ్గురు సభ్యుల పదవీకాలాన్ని ధ‌ర్మాస‌నం తాత్కాలికంగా పొడిగించింది. ఇతర ట్రిబ్యునళ్లకు సంబంధించి కొత్త‌ చట్టానికి అనుగుణంగా ఎటువంటి ఆలస్యం లేకుండా నియామకాలను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశంపై రెండు వారాల్లోగా స్టేట‌స్ రిపోర్టును దాఖ‌లు చేయాల‌ని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుప‌రి విచార‌ణ‌ను రెండు వారాల‌కు వాయిదా వేసింది.

Also Read..

ట్రంప్ కూడా కాంగ్రెస్ ప‌థ‌కాల‌నే కాపీ కొడుతున్నారు.. డీకే శివ‌కుమార్ ఆసక్తిక‌ర‌ వ్యాఖ్య‌లు

బ్రిక్స్‌లో భారత్ బ్యాలెన్సింగ్ గేమ్.. న్యూఢిల్లీకి దక్కిన దౌత్య విజయం ఇదే!

రేవంత్! నిన్ను ఏ భాషలో ప్రశ్నించమంట‌వ్‌

Advertisement
Advertisement