త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | లోక్‌స‌భ‌లో రాహుల్ Vs కేంద్రం.. ప్ర‌తిప‌క్ష నేత వ్యాఖ్య‌ల‌పై స‌భ‌లో ర‌గ‌డ‌

Rahul Gandhi | లోక్‌సభలో (Lok Sabha) యాంటీ పేపర్ లీక్ బిల్లుపై (anti paper leak bill) వాడీ వేడి చ‌ర్చ జ‌రిగింది. చర్చ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష నేత‌ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్ర‌సంగంపై స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది.

D

National | Published On Jul 29, 2026, 3.02 pm IST

Rahul Gandhi | లోక్‌స‌భ‌లో రాహుల్ Vs కేంద్రం.. ప్ర‌తిప‌క్ష నేత వ్యాఖ్య‌ల‌పై స‌భ‌లో ర‌గ‌డ‌
Advertisement
  • మూర్ఖులు ఎవ‌రి మాట‌లు విన‌రు..
  • విద్యార్థుల ఆందోళ‌న‌ల‌ను అంద‌రూ గౌర‌వించాలి : రాహుల్‌
  • రాహుల్ వ్యాఖ్య‌ల‌పై అధికార ప‌క్షం ఫైర్‌

Rahul Gandhi | త్రినేత్ర‌.న్యూస్ : లోక్‌సభలో (Lok Sabha) యాంటీ పేపర్ లీక్ బిల్లుపై (anti paper leak bill) వాడీ వేడి చ‌ర్చ జ‌రిగింది. చర్చ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష నేత‌ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్ర‌సంగంపై స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఆయ‌న ఇడియ‌ట్ వ్యాఖ్య‌లు వివాదానికి దారి తీశాయి. దీనిపై అధికార ప‌క్ష ఎంపీలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. రాహుల్ అన్‌పార్ల‌మెంట‌రీ వ్యాఖ్య‌ల‌ను రికార్డుల నుంచి తొల‌గించాలంటూ డిమాండ్ చేశారు.

లోక్‌స‌భ‌లో రాహుల్ ప్ర‌సంగిస్తూ.. కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. పేపర్ లీక్‌పై ఏం జరిగిందో తెలుసుకోవాలంటే బీజేపీ నేతలు, వారి పిల్లలను అడగాలంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీ వీధుల్లో జరిగింది నిరసన కాదని.. భావ వ్యక్తీకరణ అని పేర్కొన్నారు. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేశారని తెలిపారు. విద్యార్థుల ఆందోళనను అంద‌రూ గౌర‌వించాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌తో జ‌రిపిన సంభాష‌న‌ను రాహుల్ స‌భ‌లో ప్ర‌స్తావించారు.

దేశ యువ‌త ఆందోళ‌న‌ల‌ను ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నారు. వారి సెంటిమెంట్‌ను అంద‌రూ గౌర‌వించాలి. పేప‌ర్ లీక్ ఘ‌ట‌న‌ల‌తో విద్యార్థులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. తీవ్ర వేద‌న త‌ర్వాతే రోడ్ల‌పైకి వ‌చ్చిన నిర‌స‌న తెలిపారు. శాంతియుతంగా నిర‌స‌న చేస్తున్న యువ‌త‌పై పోలీసులు దాడులు చేశారు. ఆందోళ‌న చేసిన విద్యార్థుల‌తో నేను మాట్లాడాను. మూర్ఖులు ఎవ‌రి మాట‌లు విన‌రని.. ప్ర‌భుత్వంలో ఉన్న‌వారు త‌మ ఆవేద‌న‌ను ప‌ట్టించుకోర‌ని విద్యార్థులు నాతో చెప్పారు. వారి మాట‌లు క‌న్ను క‌దిలించాయి. అందుకే విద్యార్థుల ప‌క్షాన మాట్లాడుతున్నాను అని రాహుల్ చెప్పుకొచ్చారు.

రాహుల్ వ్యాఖ్య‌ల‌పై అధికార ప‌క్షం ఫైర్‌

రాహుల్ ఇడియ‌ట్ అని వాడ‌టం ప‌ట్ల అధికార ప‌క్ష స‌భ్యుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. స‌భ‌లో అన్‌పార్ల‌మెంట‌రీ లాంగ్వేజ్ వాడ‌కూడ‌ద‌ని అన్నారు. విద్యార్థుల పేరు చెప్పి ప్ర‌తిప‌క్షనేత ఎంపీల‌ను అవ‌మానిస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాహుల్ తన భాషను మార్చుకోవాలని కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజుజు అన్నారు. విద్యార్థుల పేరుతో అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. వెంట‌నే క‌లుగ‌జేసుకున్న ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. రాహుల్‌ను మాట్లాడ‌నివ్వాల‌ని అధికార‌ప‌క్ష ఎంపీల‌ను కోరారు. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత వ్యాఖ్య‌ల‌ను రికార్డుల నుంచి తొల‌గించాల‌ని స్పీక‌ర్‌ను అభ్య‌ర్థించారు. రాజ్‌నాథ్ అభ్య‌ర్థ‌న మేర‌కు రాహుల్ వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు.

నా ప్ర‌సంగాన్ని కావాల‌నే అడ్డుకున్నారు..

ఆ త‌ర్వాత రాహుల్ త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. కావాల‌నే త‌న ప్ర‌సంగాన్ని అధికార‌ప‌క్షం అడ్డుకుంద‌ని మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా త‌న వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించుకున్నారు. తాను ఆ పదాన్ని ఎవరినీ ఉద్దేశించి వాడ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. పార్ల‌మెంట్ స‌భ్యుడిని ఉద్దేశించి ఆ మాట అన్న‌ప్పుడు మాత్ర‌మే అది అన్‌పార్ల‌మెంట‌రీ అవుతుంద‌న్నారు.

విద్యాశాఖ‌ను న‌డుపుతోంది ఆర్‌ఎస్‌ఎస్

విద్యాశాఖ‌ను ఆర్‌ఎస్‌ఎస్ న‌డుపుతోందంటూ రాహుల్ ఆరోపించారు. ఈ సంస్థ‌ విద్యార్థుల‌ను అంధ‌భ‌క్తులు (andhbhakts)గా మార్చాల‌ని చూస్తోంద‌ని విమ‌ర్శించారు. "విద్యాశాఖ‌ను ఆర్‌ఎస్‌ఎస్ న‌డిపిస్తోంది. మాజీ విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ నిజానికి ఆ శాఖ‌ను ఎప్పుడూ న‌డ‌ప‌లేదు. ఆయ‌న ఆ శాఖ‌కు కేవ‌లం సింబ‌ల్ మాత్ర‌మే. కేంద్ర విశ్వ విద్యాల‌యాల్లో వైస్ ఛాన్స‌ల‌ర్లుగా ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్న వ్య‌క్తుల‌నే నియ‌మించారు. విద్యార్థులను అంధభక్తులుగా మార్చాలని ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తోంది. నిర‌స‌న తెలుపుతున్న విద్యార్థులు దీనికి వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

అమిత్ షా భ‌య‌ప‌డుతున్నారు

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై కూడా రాహుల్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. విద్యార్థి నిర‌స‌న‌కారుల‌పై కాల్పులు జ‌ర‌పాల‌ని అమిత్ షానే ఆదేశించారంటూ రాహుల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. విద్యార్థుల‌పై పెల్లెట్ల దాడికి అమిత్‌షానే కార‌ణ‌మ‌ని వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా బిల్లుపై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో షా స‌భ‌కు గైర్హాజర‌వ‌డంపై కూడా రాహుల్ ప్ర‌శ్నించారు. త‌న‌ను ఎదుర్కోవ‌డానికి అమిత్ షాకు ధైర్యం లేద‌ని, ఆయ‌న భ‌య‌ప‌డుతున్నారంటూ వ్యాఖ్యానించారు. విద్యార్థుల‌కు ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ఏం ఆధారాలున్నాయ్‌..? రిజుజు

అమిత్ షాపై రాహుల్ వ్యాఖ్య‌ల‌తో స‌భ‌లో తీవ్ర‌ గంద‌ర‌గోళం నెల‌కొంది. అధికార‌ప‌క్ష ఎంపీలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ప్ర‌తిప‌క్ష‌నేత వ్యాఖ్య‌ల‌ను కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజుజు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. రాహుల్‌వి త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ని చెప్పారు. రాహుల్ ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎలా చేస్తున్నారు..? అంటూ నిల‌దీశారు. హోంమంత్రిపై ప్ర‌తిప‌క్ష నేత చేసిన ఆరోప‌ణ‌ల‌కు ఏం ఆధారాలు ఉన్నాయ‌ని ప్ర‌శ్నించారు. రాహుల్ త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Also Read..

నువ్వో ప‌నికిరానివాడివి.. కాక్రోచ్ పార్టీ ప్రతినిధిపై కంగ‌న వివాదాస్ప‌ద‌ వ్యాఖ్య‌లు

న‌డ్డా Vs ఖ‌ర్గే.. సీజేపీ ఆందోళ‌న‌ల్లో పోలీసుల బ‌ల‌ప్ర‌యోగంపై భ‌గ్గుమ‌న్న రాజ్య‌స‌భ‌

ప్ర‌ధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు.. సోష‌ల్ మీడియా ఖాతాల‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు

Advertisement
Advertisement