త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | మొద‌ట ఓటు చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ.. ఈసీపై రాహుల్ గాంధీ విమర్శలు

Rahul Gandhi | తృణ‌మూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తీసుకున్న నిర్ణయంపై ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. "మొద‌ట ఓట్ల చోరీ, ఆ త‌ర్వాత ప్ర‌భుత్వాల చోరీ, ఇప్పుడు ఏకంగా పార్టీల చోరీ. ఇవే మ‌న దేశ ప్ర‌జాస్వామ్య ప‌త‌నానికి చిహ్నాలుగా మారాయి" అంటూ ధ్వ‌జ‌మెత్తారు.

D

National | Published On Sep 18, 2026, 12.12 pm IST

Rahul Gandhi | మొద‌ట ఓటు చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ.. ఈసీపై రాహుల్ గాంధీ విమర్శలు
Advertisement

Rahul Gandhi | త్రినేత్ర‌.న్యూస్ : మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తీసుకున్న నిర్ణయం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. రాష్ట్రంలోని నందిగ్రామ్‌, రెజినగర్‌ అసెంబ్లీ స్థానాలకు అక్టోబరు 6న ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న వేళ ఈసీ నిర్ణ‌యం రాజ‌కీయ దుమారం రేపుతోంది. ఈ నేప‌థ్యంలో ఈసీపై ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

"మొద‌ట ఓట్ల చోరీ, ఆ త‌ర్వాత ప్ర‌భుత్వాల చోరీ, ఇప్పుడు ఏకంగా పార్టీల చోరీ. ఇవే మ‌న దేశ ప్ర‌జాస్వామ్య ప‌త‌నానికి చిహ్నాలుగా మారాయి" అంటూ ధ్వ‌జ‌మెత్తారు. రాజ‌కీయ పార్టీలను చీల్చి, ఆ త‌ర్వాత వారి ఎన్నిక‌ల గుర్తుల‌ను లాక్కోవ‌డానికి ఎన్నిక‌ల సంఘం, బీజేపీ క‌లిసి కుట్ర ప‌న్నుతున్నాయ‌ని రాహుల్ ఆరోపించారు. గ‌తంలో శివ‌సేన‌, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) విషయంలోనూ ఇదే తరహా వ్యూహం అమ‌లు చేశార‌ని గుర్తుచేశారు. "మొదట శివసేన, తర్వాత ఎన్సీపీ, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్... ప్రతిసారీ ఇదే తరహా వ్యూహం. బీజేపీ, ఈసీ కలిసి ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ పార్టీలను దొంగిలిస్తున్నాయి" అని ఆరోపించారు.

ఒక పార్టీ మొత్తాన్నే దొంగిలించగలిగినప్పుడు, కోట్లాది మంది భారతీయుల ఓట్లు చోరీ కావ‌డంలో ఎలాంటి ఆశ్చ‌ర్యం లేద‌ని రాహుల్ పేర్కొన్నారు. ప్ర‌జ‌ల తీర్పును ర‌క్షించాల్సిన బాధ్య‌త ఎన్నిక‌ల సంఘానిదేన‌ని గుర్తు చేశారు. కానీ ఈసీ మాత్రం ప్ర‌జా తీర్పును త‌ల‌కింద‌లు చేసే శ‌క్తుల‌కే కొమ్ముకాస్తోంద‌ని విమ‌ర్శించారు. ఈ పోరాటం కేవలం మమతా బెనర్జీది మాత్రమే కాద‌ని, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు కోరుకునే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ఓటరుద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

ఇదీ వివాదం..

కాగా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ నేతృత్వంలోని తృణ‌మూల్ పార్టీ ఓట‌మిపాలైన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత టీఎంసీలో విభేదాలు త‌లెత్తాయి. పార్టీ రెండుగా విడిపోయింది. ఓ వ‌ర్గానికి దీదీ నేతృత్వం వ‌హిస్తుండ‌గా.. మ‌రో వ‌ర్గానికి బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత రిటబ్రత బెనర్జీ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే, వ‌చ్చే నెల 6న జ‌గ‌ర‌నున్న నందిగ్రామ్‌, రెజిన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీ గుర్తు, పేరుపై వివాదం మొద‌లైంది. ఇరు వర్గాలు తామే అసలైన టీఎంసీ అని, పార్టీ గుర్తు తమకే చెందాలని ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. ఈ నేప‌థ్యంలో
ఈ వివాదంపై ఈసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఉప ఎన్నిక‌ల్లో ఇరు వ‌ర్గాలు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ పేరు, గుర్తును ఉప‌యోగించ‌కుండా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.

శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల గ‌డువులోగా ప్ర‌త్యామ్నాయ‌ పేర్లు, గుర్తుల‌ను స‌మ‌ర్పించాల‌ని ఇరు వ‌ర్గాల‌ను ఆదేశించింది. అయితే, ఈసీ నిర్ణ‌యాన్ని మ‌మ‌తా బెన‌ర్జీ వ‌ర్గం తీవ్రంగా వ్య‌తిరేకిస్తూనే ప్ర‌త్యామ్నాయ పేరు, గుర్తును ఎన్నికల సంఘానికి అంద‌జేసింది. ఇక ఈసీ నిర్ణ‌యంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఇది ప్ర‌ధాని మోదీకి ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ ఇచ్చిన అర్ధ‌రాత్రి పుట్టిన‌రోజు కానుక అంటూ ఎద్దేవా చేసింది.

Also Read..

మానవ అక్రమ రవాణా కేసులో 9 మందికి జీవిత ఖైదు.. హైద‌రాబాద్ ఎన్ఐఏ కోర్టు సంచ‌ల‌న తీర్పు

6 నెల‌ల ప‌సికందుపై పిట్‌బుల్ దాడి.. షాకింగ్ వీడియో

మైన‌ర్‌పై గ్యాంగ్‌రేప్‌.. ఆపై హ‌త్య‌.. శ‌వాన్ని పీక్కుతిన్న కుక్క‌లు

Advertisement
Advertisement