త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Train Accidents | రైళ్ల‌లో వ‌రుస అగ్నిప్ర‌మాదాల వెనుక‌ అసాంఘిక శ‌క్తుల ప్ర‌మేయం : రైల్వే శాఖ‌

Train Accidents | రైళ్ల‌లో వ‌రుస అగ్నిప్ర‌మాదాల వెనుక అసాంఘిక శ‌క్తుల ప్ర‌మేయం (Anti Social Elements) ఉన్న‌ట్లు ద‌ర్యాప్తులో తేలింది. ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించడానికి, రైల్వే వ్యవస్థలో భయాందోళనలను, గందరగోళాన్ని సృష్టించేందుకు అసాంఘిక శ‌క్తులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు రైల్వే శాఖ‌ తెలిపింది.

D

National | Published On May 20, 2026, 2.15 pm IST

Train Accidents | రైళ్ల‌లో వ‌రుస అగ్నిప్ర‌మాదాల వెనుక‌ అసాంఘిక శ‌క్తుల ప్ర‌మేయం : రైల్వే శాఖ‌
Advertisement

Train Accidents | రైళ్ల‌లో వ‌రుస అగ్నిప్ర‌మాదాలు (Train Accidents) ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. తిరువ‌నంత‌పురం-ఢిల్లీ రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌, స‌సారామ్‌-పాట్నా ఫాస్ట్ ప్యాసింజ‌ర్ రైలులో మంట‌లు చెల‌రేగిన విష‌యం తెలిసిందే. అయితే, అదృష్ట‌వ‌శాత్తూ రెండు ప్ర‌మాదాల్లో ప్రాణ న‌ష్టం త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌ల‌పై దేశ‌వ్యాప్తంగా తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. ముఖ్యంగా ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌పై ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి.

దీంతో రంగంలోకి దిగిన ఇండియ‌న్ రైల్వేస్ విచార‌ణ చేప‌ట్టింది. ఈ విచార‌ణ‌లో రైళ్ల‌లో అగ్నిప్ర‌మాదాల వెనుక అసాంఘిక శ‌క్తుల ప్ర‌మేయం (Anti Social Elements) ఉన్న‌ట్లు గుర్తించింది.  ఈ మేర‌కు బుధ‌వారం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇవి ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనలు కావని పేర్కొంది. "ఈ రోజు హౌరా స్టేషన్‌లో నిలిపి ఉంచిన మిథిలా ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు స‌మాచారం అంద‌డంతో త‌నిఖీలు చేప‌ట్టాం. ఈ తనిఖీల్లో పెట్రోల్‌లో నానిన, సగం కాలిన ఒక గుడ్డ ముక్క ల‌భించింది. రైల్వే సిబ్బంది అప్ర‌మ‌త్త‌తతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పెను ప్ర‌మాదం త‌ప్పింది" అని రైల్వే శాఖ తెలిపింది.

ఈ ప్ర‌మాదాల వెనుక సామాజిక వ్య‌తిరేక శ‌క్తుల ప్ర‌మేయం ఉంద‌ని ద‌ర్యాప్తులో తేలిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించడానికి, రైల్వే వ్యవస్థలో భయాందోళనలను, గందరగోళాన్ని సృష్టించేందుకు అసాంఘిక శ‌క్తులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిపింది. ప్ర‌మాదాల వెనుక ఎవ‌రున్నార‌న్న‌ది తెలుసుకునేందుకు లోతైన ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించింది. రైళ్లలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే రైల్వే హెల్ప్‌లైన్‌ 139కి ఫోన్‌ చేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, వారి భద్రతకు రైల్వేశాఖ కట్టుబడి ఉందని తెలిపింది.

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు..

దేశంలో అత్యంత ర‌ద్దీగా ఉండే రైళ్ల‌లో ఒక‌టైన తిరువ‌నంత‌పురం-హ‌జ్ర‌త్ నిజాముద్దీన్ (Trivandrum-Hazrat Nizamuddin) రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌లో (Rajdhani Express) భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆదివారం తెల్ల‌వారుజామున 5.15 గంట‌ల స‌మ‌యంలో రాజ‌స్థాన్‌లోని కోటా వ‌ద్ద‌ తిరువ‌నంత‌పురం నుంచి వెళ్తున్న ఢిల్లీ వెళ్తున్న రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌లోని బీ-1 ఏసీ కోచ్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. క్ర‌మంగా అవి బోగీ మొత్తానికి వ్యాపించ‌డంతో పెద్దఎత్తున అగ్నికీల‌లు ఎగ‌సిప‌డ్డాయి. అయితే అప్ర‌మ‌త్త‌మైన రైల్వే సిబ్బంది ప్ర‌యాణికుల‌ను అంద‌రిని దించేయ‌డంతో ప్రాణ న‌ష్టం త‌ప్పింది. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ని, అంతా క్షేమంగానే ఉన్నార‌ని అధికారులు చెప్పారు. ప్ర‌మాద స‌మ‌యంలో బోగీలో 68 మంది ప్రయాణికులు ఉన్నార‌ని తెలిపారు. షార్ట్ స‌ర్య్కూట్ వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

పాట్నా ప్యాసింజ‌ర్‌లో అగ్నిప్ర‌మాదం..

తిరువ‌నంత‌పురం-ఢిల్లీ రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్రిప్ర‌మాదం జ‌రిగి 24 గంట‌లు గ‌డువ‌క‌ముందే పాట్నా వెళ్తున్న ఫాస్ట్ ప్యాసింజ‌ర్ రైలు అగ్నికి ఆహుతైంది. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని స‌సారామ్ రైల్వే స్టేష‌న్‌లో జ‌రిగింది. స‌సారామ్‌-పాట్నా ఫాస్ట్ ప్యాసింజ‌ర్ రైలు స‌సారామ్ రైల్వే స్టేష‌న్ నుంచి బ‌య‌ల్దేరేందుకు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో ఒక్క‌సారిగా ఓ బోగీలో మంట‌లు అంటుకున్నాయి. క్ర‌మంగా అవి విస్త‌రించ‌డంతో బోగీ పూర్తిగా కాలిపోయింది. అయితే రైలు ఆగి ఉండ‌టంతో పెనుప్ర‌మాదం త‌ప్పింది. ప్ర‌యాణికులంతా క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. రైల్వే సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. ప్ర‌మాదానికి కార‌ణం షార్ట్ స‌ర్క్యూట్ (Short Circuit) అని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింది.

Also Read..

స్నేక్ చార్మర్‌గా ప్ర‌ధాని మోదీ.. వివాదాస్ప‌ద కార్టూన్ వేసిన నార్వే ప‌త్రిక‌

సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి : సుప్రీంకోర్టు

టెట్రా ప్యాక్‌లు, సాచెట్లలో మద్యం అమ్మకాలు.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

Advertisement
Advertisement