త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kacheguda Railway Station | 110 ఏళ్లు పూర్తి చేసుకున్న కాచిగూడ రైల్వే స్టేషన్.. వారసత్వాన్ని కాపాడుకుంటూ ఆధునికీకరణలో ముందంజ

Kacheguda Railway Station | హైదరాబాద్ నగరంలోని అత్యంత చారిత్రక రైల్వే కట్టడాల్లో ఒకటైన కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రజలకు సేవలందిస్తూ 110 ఏళ్లు పూర్తి చేసుకుంది. హైదరాబాద్ రవాణా చరిత్రలో ఈ మైలురాయి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. 1916 జూన్ 10న అప్పటి నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో ఈ స్టేషన్‌ను ప్రారంభించారు.

P

Telangana | Published On Jul 2, 2026, 5.55 pm IST

Kacheguda Railway Station | 110 ఏళ్లు పూర్తి చేసుకున్న కాచిగూడ రైల్వే స్టేషన్.. వారసత్వాన్ని కాపాడుకుంటూ ఆధునికీకరణలో ముందంజ
Advertisement

Kacheguda Railway Station | హైదరాబాద్ నగరంలోని అత్యంత చారిత్రక రైల్వే కట్టడాల్లో ఒకటైన కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రజలకు సేవలందిస్తూ 110 ఏళ్లు పూర్తి చేసుకుంది. హైదరాబాద్ రవాణా చరిత్రలో ఈ మైలురాయి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. 1916 జూన్ 10న అప్పటి నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో ఈ స్టేషన్‌ను ప్రారంభించారు. నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే (NGSR) ప్రధాన కార్యాలయంగా దీన్ని నిర్మించారు. గోతిక్ శైలిలో నిర్మించిన ఈ భవనం ఎత్త‌యిన గుమ్మటాలు, మినార్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చారిత్రక వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించింది. కాలానుగుణంగా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు కల్పించినప్పటికీ, స్టేషన్ అసలు చారిత్రక రూపానికి ఎలాంటి భంగం కలగకుండా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నాలుగు ప్రధాన రైల్వే టెర్మినళ్లలో కాచిగూడ ఒకటిగా ఉండటంతో పాటు దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యాలయంగానూ కొనసాగుతోంది.

ప్రతిష్ఠాత్మక అవార్డులు..

కాచిగూడ నుంచి ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, తిరుపతి, మైసూరు, ఇండోర్, భోపాల్, మధురై, మంగళూరు, నాందేడ్ తదితర ప్రధాన నగరాలకు రైళ్లు రాక‌పోక‌లు సాగిస్తున్నాయి. పర్యావరణహిత మౌలిక వసతుల అభివృద్ధిలోనూ ఈ స్టేషన్ ఆదర్శంగా నిలిచింది. గ్రీన్ ప్లాటినం, సోలార్ ప‌వ‌ర్ వినియోగం, ఇంధన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు సైతం ఈ స్టేష‌న్‌కు ద‌క్క‌డం విశేషం. స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ వ్యవస్థతో గణనీయమైన విద్యుత్ ఆదా జరుగుతోంది. ప్రతిరోజూ సుమారు 50వేల మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ను వినియోగించుకుంటున్న‌ట్లుగా అధికారులు పేర్కొన్నారు. రోజుకు దాదాపు రూ.60 లక్షల ఆదాయం దక్షిణ మధ్య రైల్వేకు ఈ స్టేషన్ ద్వారా సమకూరుతున్నట్లు అంచనా. ఐదు ప్లాట్‌ఫారాలు, ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలు, రైలు మ్యూజియం, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలతో కాచిగూడ రైల్వే స్టేషన్ వారసత్వాన్ని కాపాడుకుంటూనే ఆధునిక రైల్వే సేవలను అందిస్తోంది.

ఆకట్టుకుంటున్న రైలు మ్యూజియం

కాచిగూడ రైల్వే స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన రైలు మ్యూజియం చిన్నారులు, రైల్వే అభిమానులు, చరిత్రపై ఆసక్తి ఉన్న సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. 2015లో ప్రారంభమైన ఈ మ్యూజియాన్ని 2024లో ఆధునికీకరించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ చరిత్ర, రైల్వే వారసత్వాన్ని ప్రతిబింబించేలా దీనిని తీర్చిదిద్దారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మ్యూజియంలో పాతకాలపు ఫొటోలు, పురాతన సిగ్నలింగ్ పరికరాలు, పాత రైల్వే టికెట్లు, లోకోమోటివ్ నమూనాలు, బ్రిటిష్ కాలం నాటి అరుదైన వస్తువులు ప్రదర్శనలో ఉంచారు. 1907లో నిర్మించిన ‘సర్ అలెక్’ స్టీమ్ ఇంజిన్ ప‌త్రేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రారంభ దశ రైల్వే ఇంజినీరింగ్ ప్రతిభకు దీన్ని ప్రతీకగా భావిస్తారు. అత్యాధునిక ఆడియో-విజువల్ గ్యాలరీలో భారతీయ రైల్వేల చరిత్ర, అభివృద్ధి, భద్రతా వ్యవస్థలపై సంద‌ర్శ‌కుల‌కు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, వారసత్వ మీటర్ గేజ్ కోచుల‌ను కూడా ప్రదర్శనకు ఉంచడం మ్యూజియం ప్రత్యేకతను మరింత పెంచింది.

Advertisement
Advertisement