త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్

నల్గొండ ప్రజల చిరకాల కల అయిన ఎస్ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ పనులను జూన్ 2028 నాటికి పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

J

Telangana | Published On Jul 6, 2026, 8.35 pm IST

SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
Advertisement
  • శ్రీశైలం నుంచి 40 టీఎంసీల నీటిని తరలించే SLBC టన్నెల్ ప్రాజెక్టును జూన్ 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యం
  • దీని ద్వారా 4.01 లక్షల ఎకరాలకు సాగునీరు, 618 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీరు
  • పనుల్లో వేగం పెంచడంతో పాటు కార్మికుల భద్రతకు (Safety) అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
  • డిండి ప్రాజెక్టు, కాలువల నిర్మాణాలు, భూసేకరణ పనులను ఏకకాలంలో పూర్తి చేసేలా ప్రణాళికలు

SLBC tunnel project | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోని దక్షిణ ప్రాంతం.. ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (AMR-SLBC) ప్రాజెక్టుపై నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ టన్నెల్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 2028 నాటికి పూర్తి చేయాలని అధికారులకు డెడ్‌లైన్ విధించారు.

40 టీఎంసీలు.. 4 లక్షల ఎకరాలు

శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 40 టీఎంసీల నీటిని తరలించేలా ఈ SLBC టన్నెల్‌ను డిజైన్ చేసినట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 4.01 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే, ఏళ్లుగా ఫ్లోరైడ్ మహమ్మారితో తీవ్రంగా నష్టపోయిన 618 గ్రామాలకు శాశ్వతంగా తాగునీటి కష్టాలు తీరుతాయన్నారు. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 12,718 కోట్లుగా ఉందని, ప్రాజెక్టుకు అవసరమైన ఫండ్స్, అనుమతులు, భూసేకరణ సమస్యలను త్వరగానే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

SLBC Tunnel to be Completed by June 2028 Minister Uttam Kumar Reddy

పనుల్లో స్పీడ్.. భద్రతే ముఖ్యం

ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు అధునాతన సాంకేతికతను వాడుతున్నట్లు మంత్రి వివరించారు. ఇప్పటికే వర్కర్ల సంఖ్యను మూడు రెట్లు పెంచామని, ముంబై పోర్ట్ నుంచి మరో మూడు 'ఆర్మ్ బూమర్' (arm boomers) యంత్రాలు నెలాఖరుకల్లా ప్రాజెక్టు సైట్‌కు చేరుకుంటాయని, దీంతో పనులు మరింత వేగవంతం అవుతాయని చెప్పారు. అయితే, పనుల వేగం కోసం కార్మికుల భద్రతను (Safety protocols) ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. టన్నెల్‌లో తగినంత లైటింగ్, వెంటిలేషన్ ఏర్పాటు చేయాలని, సీనియర్ జియాలజిస్టులు, ఇండిపెండెంట్ ఇంజనీర్లు, టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ పర్యవేక్షణలోనే ప్రతిరోజూ పనులు జరగాలని ఆదేశించారు.

డిండి ప్రాజెక్టుతో అనుసంధానం

ఎస్ఎల్‌బీసీతో పాటు డిండి ప్రాజెక్టు (Dindi Project), నక్కలగండి రిజర్వాయర్, పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ప్రధాన కాలువల నిర్మాణాలను ఏకకాలంలో పూర్తి చేయాలని ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. అప్పుడే ఈ ప్రాజెక్టుల పూర్తి ప్రయోజనాలు రైతులకు, గ్రామీణ ప్రజలకు అందుతాయన్నారు. భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే ఎలాంటి జాప్యం లేకుండా వేయాలని సూచించారు.

SLBC Tunnel to be Completed by June 2028 Minister Uttam Kumar Reddy

ఈ కీలక సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ సెక్రటరీ ఈ. శ్రీధర్, టన్నెల్ ఎక్స్‌పర్ట్ కల్నల్ పరిక్షిత్ మెహ్రా, ఈఎన్సీ (జనరల్) వి. రమేశ్ బాబు, ఇతర సీనియర్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement