త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gen Z | జెన్‌జీపై అంత‌ శ్ర‌ద్ధ ఉంటే.. అమిత్ షాచేత రాజీనామా చేయించండి.. మోహ‌న్ భ‌గ‌వ‌త్ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్‌

Gen Z | జెన్‌జీని (Gen Z) తాను గుడ్డిగా న‌మ్ముతానంటూ ఆర్ఎస్ఎస్ అధినేత మోహ‌న్ భ‌గ‌వ‌త్ (Mohan Bhagwat) చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. దేశంలోని యువతకు ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ నుంచి ఎలాంటి సర్టిఫికెట్​ అవసరం లేదని ఎంపీ ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. మ‌రోవైపు యువత పట్ల ఆయనకు నిజంగా నిజాయితీ ఉంటే.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చేత రాజీనామా చేయించాలని కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు.

D

National | Published On Aug 7, 2026, 1.57 pm IST

Gen Z | జెన్‌జీపై అంత‌ శ్ర‌ద్ధ ఉంటే.. అమిత్ షాచేత రాజీనామా చేయించండి.. మోహ‌న్ భ‌గ‌వ‌త్ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్‌
Advertisement

Gen Z | జెన్ జీ స‌మ‌స్య‌లు నిజ‌మైన‌వి, వారి నిజాయితీ ప‌ట్ల త‌న‌కు పూర్తి విశ్వాసం ఉందంటూ ఆర్ఎస్ఎస్ అధినేత మోహ‌న్ భ‌గ‌వ‌త్ చేసిన వ్యాఖ్యలు రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఆయ‌న‌ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) స్పందించారు. దేశంలోని యువతకు ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ నుంచి ఎలాంటి సర్టిఫికెట్​ అవసరం లేదని వ్యాఖ్యానించారు.

ప్ర‌భుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రిస్తోంది

ఇక జెన్‌జీని తాను గుడ్డిగా న‌మ్ముతానంటూ మోహ‌న్ భ‌గ‌వ‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal) తీవ్రంగా స్పందించారు. యువత పట్ల ఆయనకు నిజంగా నిజాయితీ ఉంటే.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చేత రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. "జెన్‌జీ పట్ల మీకు నిజంగా శ్రద్ధ ఉంటే.. హోం మంత్రిని రాజీనామా చేయమని అడగండి. కనీసం పార్లమెంటుకు వచ్చి విద్యార్థులకు క్షమాపణ చెప్పేలానైనా ఒప్పించండి" అని వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్ (RSS) నియంత్రిస్తోందని కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. నిర‌స‌న‌ల స‌మ‌యంలో విద్యార్థుల‌పై పెల్లెట్ గ‌న్‌ల వినియోగంపై ఎందుకు మాట్లాడ‌ట్లేద‌ని ప్ర‌శ్నించారు. విద్యార్థుల పట్ల ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెల్లెట్​ గన్స్​, లాఠీఛార్జ్ రూపంలో విద్యార్థులపై జరిగిన అణచివేతను ఖండించాల‌ని డిమాండ్ చేశారు.

ఆ తేడాను మోహ‌న్ భ‌గ‌వ‌త్ స‌రిగ్గా వివ‌రించారు : ఒమ‌ర్ అబ్దుల్లా

మ‌రోవైపు జెన్‌జీ నిర‌స‌న‌ల‌పై మోహ‌న్ భ‌గ‌వ‌త్ వ్యాఖ్య‌ల‌ను జ‌మ్ముక‌శ్మీర్ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా (Omar Abdullah) స్వాగ‌తించారు. వ్య‌తిరేక‌త‌కు, దేశ‌ద్రోహ కార్య‌క‌లాపాల‌కు మధ్య ఉన్న తేడాను ఆయ‌న స‌రిగ్గా వివ‌రించార‌ని వ్యాఖ్యానించారు. "జెన్-జెడ్ (Gen Z) తమ హక్కుల కోసం, డిమాండ్ల కోసం నిరసన తెలిపారు. ఆ నిరసన దేశానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగింది. ప్రభుత్వంపై నిరసన తెలపడం అంటే భారత్‌కు వ్యతిరేకం కాదని మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ సరిగ్గా చెప్పారు" అని అబ్దుల్లా పేర్కొన్నారు.

అదే స‌మ‌యంలో నీట్ ప‌రీక్షా విధానంలో అవ‌క‌త‌వ‌క‌ల‌పై కూడా ఆయ‌న స్పందించారు. ఇలాంటి ఉద్య‌మాలు అవ‌స‌ర‌మైన సంస్క‌ర‌ణ‌ల‌కు దారితీస్తాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. త‌ప్పులు జ‌రిగితే వాటిని స‌రిదిద్దుకోవాల‌ని చెప్పారు. జెన్‌జీ ఉద్య‌మం వ‌ల్లే నీట్‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని చెప్పారు. ప్రభుత్వంపై వ్యతిరేకత కొన్నిసార్లు తప్పులను సరిదిద్దుకోవడానికి, దేశాన్ని మెరుగైన మార్గంలో నడిపించడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

జెన్-జీ దేశ వ్యతిరేకులు కాదు: మోహ‌న్ భ‌గ‌వ‌త్‌

జెన్-జీ (Gen Z) యువత దేశ వ్యతిరేకులు కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు అనేవి సంభాషణకు, సమస్యల పరిష్కారానికి దోహదపడే మార్గాలని స్పష్టం చేశారు. జెన్‌జీ స‌మ‌స్య‌లు నిజ‌మైన‌వ‌ని, వారి నిజాయితీ ప‌ట్ల త‌న‌కు పూర్తి విశ్వాసం ఉంద‌న్నారు. చ‌ర్చ‌కు మ‌రో రూప‌మే నిర‌స‌న అని అభిప్రాయ‌ప‌డ్డారు. ముంబైలో జరిగిన 'ఐఐఎమ్‌యూఎన్' (IIMUN) సదస్సులో 2,000 మందికి పైగా విద్యార్థులతో ముఖాముఖిలో ఆయ‌న‌ మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యావ్యవస్థపై నిరసన తెలుపుతున్న "జెన్-జీ" (Gen Z) యువతను దేశద్రోహులుగా ముద్ర వేయడం తప్పు అని పేర్కొన్నారు. మెరుగైన వ్యవస్థ కోసం నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో ఒక భాగమని, నేటి యువత ఎంతో తార్కికంగా ఆలోచిస్తుందని చెప్పుకొచ్చారు.

Also Read..

స‌మ‌స్య ప‌రిష్కారం కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్తే త‌ప్పేంటి..? సీఎం విజ‌య్ Vs జూనియ‌ర్ స్టాలిన్‌

నీట్ పేప‌ర్ లీక్ చేసింది ఎన్టీఏ సబ్జెక్టు నిపుణులే.. గుట్టు విప్పిన సీబీఐ

దానిమ్మ కంటే మున‌గ కాయ‌లే బెట‌ర్.. ఆ మ‌గాడి ట‌ర్నోవ‌ర్ ఏడాదికి రూ. 1.15 కోట్లు..!

Advertisement

తాజావార్తలు

Advertisement