త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

President Droupadi Murmu | ప్ర‌జ‌లు మీపై ఉంచిన న‌మ్మ‌కానికి ఈ మైలురాయి నిద‌ర్శ‌నం.. ప్ర‌ధాని మోదీకి ముర్ము కంగ్రాట్స్‌

President Droupadi Murmu | సుదీర్ఘ‌కాలం పాటూ నిరంత‌రాయంగా సేవ‌లు అందించిన భార‌త ప్ర‌ధానిగా రికార్డు సృష్టించిన ప్ర‌ధాని మోదీ (PM Modi)కి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము (President Droupadi Murmu) కంగ్రాట్స్ చెప్పారు. భార‌త ప్ర‌జ‌లు మీ నాయ‌క‌త్వంపై ఉంచిన అచంచ‌ల‌మైన న‌మ్మ‌కానికి, నిరంత‌ర విశ్వాసానికి ఈ చారిత్రాత్మక మైలురాయి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు.

D

National | Published On Jun 10, 2026, 1.21 pm IST

President Droupadi Murmu | ప్ర‌జ‌లు మీపై ఉంచిన న‌మ్మ‌కానికి ఈ మైలురాయి నిద‌ర్శ‌నం.. ప్ర‌ధాని మోదీకి ముర్ము కంగ్రాట్స్‌
Advertisement

President Droupadi Murmu | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరో అరుదైన మైలురాయిని అందుకున్న విష‌యం తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా సేవలు అందించిన భార‌త ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీకి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము (President Droupadi Murmu) సైతం ప్ర‌ధానికి కంగ్రాట్స్ చెప్పారు. ఈ మేర‌కు మోదీకి లేఖ రాశారు.

ఈ చారిత్రాత్మక మైలురాయి కేవ‌లం ప్ర‌భుత్వ ప‌ద‌విలో అత్యంత సుదీర్ఘ‌కాలం కొన‌సాగ‌డానికి సంబంధించిన విష‌యం మాత్ర‌మే కాద‌ని.. భార‌త ప్ర‌జ‌లు మీ నాయ‌క‌త్వంపై ఉంచిన అచంచ‌ల‌మైన న‌మ్మ‌కానికి, నిరంత‌ర విశ్వాసానికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. సుప‌రిపాల‌న‌, ఆధునీక‌ర‌ణ‌, ఆర్థిక స్థిర‌త్వం, సామాజిక ప‌రివ‌ర్త‌న‌లో విప్ల‌వాత్మ‌క పురోగ‌తికి మీ పాల‌న సాక్ష్యంగా నిలిచింద‌ని ప్ర‌శంసించారు.

ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి ఫ‌లాలను సామాన్యుడికి సైతం అందిస్తూ.. మ‌రింత స‌మ‌గ్ర‌మైన, స‌మాన‌మైన స‌మాజ నిర్మాణానికి దోహ‌ప‌డ్డార‌ని పేర్కొన్నారు. మీరు చేరుకున్న ఈ మైలురాయి.. బ‌ల‌మైన భార‌త ప్ర‌జాస్వామ్య సంప్ర‌దాయంలో కొత్త ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని నింపుతోందని ముర్ము కొనియాడారు. ప్ర‌ధాని మోదీ ఆయురారోగ్యాల‌తో సుదీర్ఘ‌కాలం జీవించాల‌ని, దేశానికి నిరంత‌రం సేవ చేస్తూ.. 'ఆత్మనిర్భర్ భారత్', 'వికసిత్ భారత్' ల‌క్ష్యాల‌ను సాకారం చేసే దిశ‌గా దేశాన్ని మరింత ముందుకు నడిపించాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్రపతి ముర్ము త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

2014లో తొలిసారి మోదీ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అప్ప‌టి నుంచి ఎలాంటి విరామం లేకుండా 4,399 రోజులు (నేటితో) ప్ర‌ధానిగా కొన‌సాగుతున్నారు. త‌ద్వారా దేశ తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) పేరిట ఉన్న రికార్డును అధిగ‌మించి అత్యంత సుదీర్ఘ‌కాలం ప‌నిచేసిన ప్ర‌ధానిగా నిలిచారు. 1952లో స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆ ఏడాది మే 13న ప్ర‌మాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు (మొత్తం 4,398 రోజులు) ఆ పదవిలో కొనసాగారు. నెహ్రూ రికార్డును ప్ర‌ధాని మోదీ నేడు అధిగ‌మించారు.

అంతేకాదు, మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం ఏర్ప‌డి నేటికి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప్రముఖులు ప్ర‌ధాని మోదీకి ప్ర‌త్యేకంగా గ్రీటింగ్స్ తెలియ‌జేస్తున్నారు. ప‌లువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఎంపీలు ప్ర‌ధానికి ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

Also Read..

సుపరిపాలనకు అదే అసలైన పరీక్ష : ప్ర‌ధాని మోదీ

టీఎంసీకి మ‌రో షాక్‌.. మ‌రో ఎంపీ రాజీనామా

ప్ర‌ధాని మోదీ అరుదైన ఘ‌న‌త‌.. నెహ్రూ రికార్డు బ‌ద్ద‌లు.. ఎన్డీయే పాల‌న‌కు 12 ఏళ్లు

Advertisement
Advertisement