త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Tummala | సీతమ్మసాగర్‌కు సుప్రీం ‘లైన్‌ క్లియర్‌’.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఊరట

Minister Tummala | తెలంగాణ కీలక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయంలో ఉన్న అనిశ్చితికి తెరపడింది. పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మసాగర్‌, గౌరవెల్లి రిజర్వాయర్‌ వంటి ప్రాజెక్టులకు ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.

P

Telangana | Published On Jul 29, 2026, 9.01 pm IST

Minister Tummala | సీతమ్మసాగర్‌కు సుప్రీం ‘లైన్‌ క్లియర్‌’.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఊరట
Advertisement

Minister Tummala | తెలంగాణ కీలక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయంలో ఉన్న అనిశ్చితికి తెరపడింది. పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మసాగర్‌, గౌరవెల్లి రిజర్వాయర్‌ వంటి ప్రాజెక్టులకు ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు రాష్ట్ర సాగునీటి రంగానికి కీలక ఊరటనిచ్చిందని తెలిపారు. ప్రాజెక్టుల అనుమతుల కోసం ప్రత్యేక చొరవ చూపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సంబంధిత అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీం తీర్పుతో ఆయా ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి పనులకు ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోయాయని పేర్కొన్నారు.

సీతమ్మసాగర్‌తో బహుళ ప్రయోజనాలు

ఖమ్మం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న సీతమ్మసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టు తెలంగాణ జలవనరుల చరిత్రలో కీలక ప్రాజెక్టుగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 36.57 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చని, దీంతో రాష్ట్ర జలవనరుల భద్రత మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి భరోసా లభిస్తుందని వివరించారు. ఇందులో 3.28 లక్షల ఎకరాలకు కొత్తగా నీరు అందించడంతో పాటు.. నాగార్జునసాగర్‌ ఆయకట్టులో నీటి కొరత లేదా కరవు పరిస్థితుల్లో మరో 3.45 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.

282.80 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి

సీతమ్మసాగర్‌ ప్రాజెక్టు ద్వారా 282.80 మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలను తీర్చడంతో పాటు స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తికి ఇది దోహదపడుతుందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీటి లభ్యత మెరుగవుతుందని తెలిపారు. గోదావరి వెంట కరకట్టల నిర్మాణం ద్వారా అశ్వాపురం, మణుగూరు, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని గ్రామాలు, పంటలకు వరద ముప్పు తగ్గుతుందని వివరించారు. సీతమ్మసాగర్‌ ప్రాజెక్టు కేవలం సాగునీటి పథకం మాత్రమే కాదని, రైతులకు నీటి భరోసా, విద్యుత్‌ ఉత్పత్తి, భూగర్భ జలాల పెంపు, వరద నియంత్రణతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

Advertisement
Advertisement