త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalyan Banerjee | అభిషేక్‌ నాకు కొడుకు లాంటివాడు.. క్ష‌మించ‌డం తండ్రిగా నా బాధ్య‌త.. క‌ళ్యాణ్ బెన‌ర్జీ యూటర్న్‌

Kalyan Banerjee | ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ (Abhishek Banerjee)పై చేసిన వ్యాఖ్య‌ల విష‌యంలో ఆ పార్టీ సీనియర్ నేత కళ్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) యూట‌ర్న్ తీసుకున్నారు. "అభిషేక్ నాకు కొడుకులాంటివాడు. కొడుకు చేసే త‌ప్పుల‌ను క్ష‌మించ‌డం తండ్రి బాధ్య‌త" అని వ్యాఖ్యానించారు.

D

National | Published On Jun 13, 2026, 4.52 pm IST

Kalyan Banerjee | అభిషేక్‌ నాకు కొడుకు లాంటివాడు.. క్ష‌మించ‌డం తండ్రిగా నా బాధ్య‌త.. క‌ళ్యాణ్ బెన‌ర్జీ యూటర్న్‌
Advertisement

Kalyan Banerjee | టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee) మేన‌ల్లుడు, ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ (Abhishek Banerjee)పై చేసిన వ్యాఖ్య‌ల విష‌యంలో ఆ పార్టీ సీనియర్ నేత కళ్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) యూట‌ర్న్ తీసుకున్నారు. అభిషేక్ తనకు కొడుకు లాంటివాడని, కొడుకు చేసే తప్పులను క్షమించడం తండ్రి బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఇదే స‌మ‌యంలో సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

ప్ర‌ముఖ వార్తా సంస్థ ఏఎన్ఐతో క‌ళ్యాన్ బెన‌ర్జీ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా బెంగాల్‌లో రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దేశంలో ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డింద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌తిప‌క్షం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప‌రిస్థితిని ప‌శ్చిమ బెంగాల్ ఎప్పుడూ చూడ‌లేద‌న్నారు. ముఖ్య‌మంత్రి క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఇది ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాద‌క‌ర‌మ‌ని క‌ళ్యాణ్ బెన‌ర్జీ పేర్కొన్నారు.

ఏ ప్ర‌తిప‌క్ష పార్టీ కూడా ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కోలేదు..

ఇక రెబ‌ల్ ఎంపీలు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాను క‌లిసేందుకు సిద్ధ‌మ‌వుతున్నట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై కూడా ఆయ‌న స్పందించారు. వాళ్లకు నచ్చింది వాళ్లను చేసుకోనివ్వండి అని పేర్కొన్నారు. ఇదంతా ఒక నాటకమ‌ని.. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే అని వారు కారణాలు చెబుతున్నార‌ని మండిప‌డ్డారు. కనీసం నియోజకవర్గాలను సందర్శించలేని వారు ఏం అభివృద్ధి పనులు చేస్తారు..? అంటూ ప్ర‌శ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం అంతమైపోయింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. బీజేపీ, పోలీసులు త‌మ‌ను వేధిస్తున్నార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ప్ర‌తిప‌క్ష పార్టీ కూడా తాము ఇప్పుడు ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల‌ను ఎదుర్కోలేద‌ని చెప్పారు. ఎన్డీయేకి మ‌ద్ద‌తిస్తామ‌ని ప్ర‌క‌టించిన ఆ 19 మంది ఎంపీల‌ను బీజేపీ అంగీక‌రించ‌ద‌ని వ్యాఖ్యానించారు.

విలీనం.. ఊహాగానాలు మాత్ర‌మే

ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీలో తృణ‌మూల్ కాంగ్రెస్ విలీనం కాబోతోందంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై కూడా క‌ళ్యాణ్ బెన‌ర్జీ స్పందించారు. అవ‌న్నీ కేవ‌లం ఊహాగానాలేన‌ని కొట్టిపారేశారు. "మేము కాంగ్రెస్‌లో విలీనం కావడం లేదు" అని క‌ళ్యాణ్ బెన‌ర్జీ స్పష్టం చేశారు.

రెండు రోజుల క్రితం ఇలా..

కాగా, రెండు రోజుల క్రితం ఇండియా టుడేతో మాట్లాడిన క‌ళ్యాణ్ బెన‌ర్జీ.. అభిషేక్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. అతని అహంకారం వల్లే పార్టీ ఇబ్బందుల్లో పడిందని ఆరోపించారు. "అభిషేక్ బెనర్జీకి పొగ‌రు ఎక్కువ. అతని ప్రవర్తన వల్లే ఈరోజు పార్టీ మొత్తం నాశనమైంది. ఈ విషయాన్ని అతడు గ్రహించాలి. మనం చాలా నష్టపోయాం. ప్రతి ఒక్కరూ ఇదే మాట చెప్తున్నారు" అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు "మేము కావాలో.. అభిషేక్ కావాలో మీరే తేల్చుకోండి" అంటూ మ‌మ‌తా బెన‌ర్జీకి అల్టిమేటం జారీ చేశారు. "ముందు మమతా దీదీ ఒక నిర్ణయం తీసుకోవాలి. అభిషేక్ లేకుండా పార్టీని ముందుకు నడపలేనని ఆమె అనుకుంటే, ఇక నేను పార్టీలో ఉండను" అని తేల్చి చెప్పారు. ఇంత‌లోనే ఆయ‌న యూట‌ర్న్ తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇక ఇవాళ ఉద‌యం ద‌క్షిణ కోల్‌క‌తాలో గ‌ల‌ కాళీఘాట్‌లోని అభిషేక్ బెన‌ర్జీ నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఇంటి గేటు తాళం ప‌గుల‌గొట్టి మరీ త‌నిఖీలు చేశారు. ఈ సోదాలు జ‌రిగిన కాసేప‌టికే క‌ళ్యాణ్ బెన‌ర్జీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Also Read..

బాలిస్టిక్ మిస్సైల్ దాడుల‌కు భార‌త్ చెక్‌.. స‌రికొత్త వ్య‌వ‌స్థ‌ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన డీఆర్‌డీవో

శాంసంగ్ ఫోన్లలో ఎట్టకేలకు ఈ ఫీచర్.. స్టేటస్ బార్‌లోనే ఇంటర్నెట్ స్పీడ్ కనిపిస్తుంది..

వానపాములు కూడా నాగుపాముల్లా బుస కొడుతాయి.. రేవంత్ పాల‌న‌పై కేటీఆర్ విమ‌ర్శ‌

Advertisement
Advertisement