త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DRDO | బాలిస్టిక్ మిస్సైల్ దాడుల‌కు భార‌త్ చెక్‌.. స‌రికొత్త వ్య‌వ‌స్థ‌ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన డీఆర్‌డీవో

DRDO | ప్రపంచవ్యాప్తంగా భ‌ద్ర‌తా ముప్పు పెరుగుతున్న వేళ మిస్సైల్స్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనే దిశ‌లో భార‌త్ కీల‌క ముంద‌డుగు వేసింది. దేశీయ రక్షణ పరిశోధనా సంస్థ డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన బహుళస్థాయి బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ (బీఎండీ)తో పాటు కొత్త నావికాదళ యాంటీ-షిప్ క్షిపణి విజయవంతంగా ప‌రీక్షించింది.

P

News | Published On Jun 13, 2026, 4.16 pm IST

DRDO | బాలిస్టిక్ మిస్సైల్ దాడుల‌కు భార‌త్ చెక్‌.. స‌రికొత్త వ్య‌వ‌స్థ‌ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన డీఆర్‌డీవో
Advertisement

DRDO | ప్రపంచవ్యాప్తంగా భ‌ద్ర‌తా ముప్పు పెరుగుతున్న వేళ మిస్సైల్స్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనే దిశ‌లో భార‌త్ కీల‌క ముంద‌డుగు వేసింది. దేశీయ రక్షణ పరిశోధనా సంస్థ డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన బహుళస్థాయి బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ (బీఎండీ)తో పాటు కొత్త నావికాదళ యాంటీ-షిప్ క్షిపణి విజయవంతంగా ప‌రీక్షించింది. ఈ ప‌రీక్ష‌లు భారత రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనంగా నిలిచాయి. ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించిన మూడు వరుస ఫ్లైట్ టెస్టుల్లో ఈ వ్యవస్థలు నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పరీక్షల సందర్భంగా ప్రయోగించిన ఇంటర్‌సెప్టర్ మిస్సైల్స్ లక్ష్యాలను గుర్తించి గాల్లోనే ధ్వంసం చేశాయి. భవిష్యత్తులో ఎదురయ్యే క్లిష్టమైన ముప్పును సమర్థంగా ఎదుర్కొనేలా ఈ రక్షణ వ్యవస్థను రూపొందించినట్లు ర‌క్ష‌ణ‌ అధికారులు తెలిపారు.

ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ దేశ వ్యూహాత్మక భద్రతకు మరింత బలాన్ని చేకూర్చనుందని పేర్కొన్నారు. ఈ విజయంతో బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్రపంచంలోని కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల శ్రేణి వరకు ఉన్న ముప్పులను కూడా ఈ వ్యవస్థ ఎదుర్కోగలదని రక్షణ శాఖ వెల్లడించింది. లాంగ్‌రేంజ్ క్షిపణులను గాల్లోనే అడ్డుకునే సామర్థ్యం భారత్‌కు లభించడం రక్షణ రంగంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. మరోవైపు, నావికాదళ అవసరాల కోసం అభివృద్ధి చేసిన ఎన్‌ఏఎస్ఎం-ఎంఆర్ క్షిపణిని తొలిసారిగా విజయవంతంగా పరీక్షించారు. సముద్ర భద్రతకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ క్షిపణి భారత నౌకాదళ దాడి సామర్థ్యాన్ని మరింత పెంచనుంది. శత్రు యుద్ధనౌకలు, ఇతర సముద్ర లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే సామర్థ్యం దీనికి ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ వ్యూహాత్మక స్థానం మరింత బలపడనుందని రక్షణ నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ పరీక్షలను డీఆర్‌డీఓ, సాయుధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు నిశితంగా పరిశీలించారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగ కార్యదర్శి, డీఆర్‌డీఓ చైర్మన్ రాజేశ్ కుమార్ సింగ్ స్వయంగా పరీక్షలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, పరిశ్రమ భాగస్వాముల కృషిని ఆయన అభినందించారు. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, సాయుధ దళాల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. దేశ భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు రక్షణ రంగంలో స్వయం సమృద్ధి లక్ష్యాలకు కొత్త ఊతాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. రక్షణ రంగంలో విదేశాల‌పై ఆధార‌ప‌డ‌టాన్ని తగ్గించేందుకు భారత్ చేపడుతున్న ప్రయత్నాల్లో ఈ రెండు వ్యవస్థలు కీలకంగా నిలుస్తాయని అధికారులు తెలిపారు. స్వదేశీ సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఈ వ్యవస్థలు భవిష్యత్తులో మరింత అధునాతన రక్షణ ఆయుధాల అభివృద్ధికి దోహదపడనున్నాయి. లాంగ్‌రేంజ్ మిస్సైల్స్‌, ఆధునిక యుద్ధ సాంకేతికతలు, సముద్ర ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ తన రక్షణ సామర్థ్యాలను నిరంతరం ఆధునీకరిస్తోంది. తాజా విజయవంతమైన పరీక్షలు దేశ రక్షణ సిద్ధతను మరింత బలోపేతం చేయడంతో పాటు స్వదేశీ రక్షణ సాంకేతికతలో భారత్ సాధిస్తున్న పురోగతిని మరోసారి చాటిచెప్పాయి.

 

Advertisement
Advertisement