త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sambashiva Rao | హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్‌పై తిరుగుబాటే

Sambashiva Rao | కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను త‌క్షణమే అమలు చేయాలని, లేదంటే ప్రభుత్వంపై తిరుగుబాటు త‌ప్ప‌ద‌ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు.

S

Telangana | Published On Jun 16, 2026, 7.26 pm IST

Sambashiva Rao | హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్‌పై తిరుగుబాటే
Advertisement
  • ప్రజల ప‌క్షాన నిల‌బ‌డేది కమ్యూనిస్టులే
  • గుడిసెలు వేసుకున్న పేదలకు వెంటనే పట్టాలివ్వాలి
  • అవ‌స‌ర‌మైతే సీఎంను క‌లిసి మాట్లాడుతా
  • కమ్యూనిస్టుల పోరాటాల‌తోనే తెలంగాణ విముక్తి
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్య‌లు

Sambashiva Rao | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను త‌క్షణమే అమలు చేయాలని, లేదంటే ప్రభుత్వంపై తిరుగుబాటు త‌ప్ప‌ద‌ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. హనుమకొండ జిల్లా గుండ్లసింగారం భూపోరాట కేంద్రంలో నిర్మించిన "సురవరం సుధాకర్ రెడ్డి నగర్ష సీపీఐ కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి అధ్యక్షతన నిర్వ‌హించిన సభలో కూనంనేని ప్రసంగించారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ భూములపై గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు జీవో 58 ప్రకారం పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుపేదలకు ఇప్పటికీ సొంత ఇండ్లు లేవు. సీపీఐ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో భూపోరాటాలు నిర్వహించి గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలందరికీ ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలి అని ఆయ‌న‌ డిమాండ్ చేశారు.

గుండ్ల‌సింగారం కాల‌నీవాసులకు అభినంద‌న‌లు..

ప్రజల ప‌క్షాన ఎల్ల‌ప్పుడూ నిల‌బ‌డేది కమ్యూనిస్టు పార్టీలే. పాలకులు పేదల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు అనుకూల విధానాలు అమలు చేస్తున్నారు. కమ్యూనిస్టుల పోరాటాల వల్లే తెలంగాణ విముక్తి సాధ్యమైంది. ప్రజా హక్కుల పరిరక్షణలో కమ్యూనిస్టుల పాత్ర చ‌రిత్రాత్మకం. గుండ్లసింగారం కాలనీవాసులు పట్టుదలతో కాలనీ నిర్మించుకుని ఆదర్శంగా నిలిచారు. కాలనీలో నివసిస్తున్న పేదలందరికీ ఇండ్ల పట్టాలు వచ్చేలా అధికారులతో, స్థానిక ఎమ్మెల్యేతో, అవసరమైతే ముఖ్యమంత్రితో కూడా మాట్లాడుతాను అని కూనంనేని హామీ ఇచ్చారు.

అనంత‌రం తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. గుడిసెవాసుల హక్కుల సాధన కోసం సీపీఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. కాలనీలో విద్యుత్, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలి అని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో కర్రె భిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, రాష్ట్ర సమితి సభ్యులు అదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా.సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి, హనుమకొండ మండల కార్యదర్శి ఎన్ఏ స్టాలిన్, జిల్లా నాయకులు, కాలనీ ప్రతినిధులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, వందలాది మంది కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement