త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP CV Anand | వర్షాకాలంలో ప్రజల భద్రతే ప్రాధాన్యం : డీజీపీ సీవీ ఆనంద్

DGP CV Anand | వర్షాకాలంలో పట్టణ వరదలు, నీటి నిల్వలు, ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అధికారులకు సూచించారు.

P

Hyderabad | Published On Jun 16, 2026, 6.54 pm IST

DGP CV Anand | వర్షాకాలంలో ప్రజల భద్రతే ప్రాధాన్యం : డీజీపీ సీవీ ఆనంద్
Advertisement

DGP CV Anand | వర్షాకాలంలో పట్టణ వరదలు, నీటి నిల్వలు, ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేర‌కు వర్షాకాలంలో తీసుకుంటున్న ముందస్తు చర్యలపై మంగళవారం మ‌ల్కం చెరువు వ‌ద్ద అత్యవసర సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డీజీపీతో పాటు ఆర్వీ క‌ర్ణ‌న్‌, సృజ‌న‌, రంగ‌నాథ్‌, ర‌మేశ్‌రెడ్డి, శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో పాటు ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని తెలిపారు.

నీరు నిల్వయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న జోన్లు, ప్రధాన కూడళ్లు, రద్దీ మార్గాల్లో పోలీసు సిబ్బంది నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే స్పందించేలా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. సమావేశం అనంతరం మల్కం చెరువు, ఖాజాగూడ సరస్సు, మండికుంట, గురునాథ్ చెరువు, మియాపూర్ పరిసరాలు, బైయోడైవర్సిటీ జంక్షన్, కొండాపూర్ ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. నీటి ప్రవాహ మార్గాలు, డ్రైనేజీ అనుసంధానాలు, ఆక్రమణలు, నీటి నిల్వలకు కారణమవుతున్న అంశాలను అధికారులు సమగ్రంగా అధ్యయనం చేశారు.

తక్షణ పరిష్కారం అవసరమైన సమస్యలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు, దీర్ఘకాలిక పరిష్కారాల కోసం నివేదికలు సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పోలీస్, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హైడ్రా సహా అన్ని శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని డీజీపీ పునరుద్ఘాటించారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఎక్కడా అలసత్వానికి తావు ఇవ్వకుండా ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని డీజీపీ స్పష్టం చేశారు. వర్షాకాలం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సహాయ చర్యల్లో ఎటువంటి లోటు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పట్టణ వరదలు, నీటి నిల్వలు, ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కట్టుబడి ఉన్నాయని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement
Advertisement