త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | వానపాములు కూడా నాగుపాముల్లా బుస కొడుతాయి.. రేవంత్ పాల‌న‌పై కేటీఆర్ విమ‌ర్శ‌

KTR | తుపాకీ తీసుకొని ఉద్య‌మకారుల‌పై వ‌చ్చిన రేవంత్ రెడ్డి.. ఆయ‌నే తెలంగాణ సాధించిన‌ట్లు మాట్లాడుతున్నాడ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. సమయం బాలేనప్పుడు వానపాములు కూడా నాగుపాముల లాగా బుసలు కొడుతాయ‌ని రేవంత్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

S

Telangana | Published On Jun 13, 2026, 3.56 pm IST

KTR | వానపాములు కూడా నాగుపాముల్లా బుస కొడుతాయి.. రేవంత్ పాల‌న‌పై కేటీఆర్ విమ‌ర్శ‌
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : తుపాకీ తీసుకొని ఉద్య‌మకారుల‌పై వ‌చ్చిన రేవంత్ రెడ్డి.. ఆయ‌నే తెలంగాణ సాధించిన‌ట్లు మాట్లాడుతున్నాడ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. సమయం బాలేనప్పుడు వానపాములు కూడా నాగుపాముల లాగా బుసలు కొడుతాయ‌ని రేవంత్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

కేసీఆర్ నాయ‌క‌త్వంలో క‌ష్ట‌ప‌డి ప‌ని చేసి తెలంగాణ‌ను సాధించింది మీరు. కానీ ఇవాళ ఎవ‌ని పాలైందిరా తెలంగాణ అనే పాడుకునే దుస్థితి వచ్చింది. అమ్మ విలువ, అన్నం విలువ.. ఉన్న‌ప్పుడు తెల్వ‌ది.. లేనప్పుడే తెలుస్తది. ఇవాళ తెలంగాణ‌లో అదే ప‌రిస్థితి ఉంది. రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రూ కుత‌కుత ఉడికిపోతున్న‌రు. కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం మ్యానిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం.. 420 హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అందరిని బురిడీ కొట్టించింది. సొంత పార్టీ నాయకులకే న్యాయం చేయలేని రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తడు? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని ఏం చేయలేకపోతున్నడు

కాంగ్రెస్ పార్టీలో పైసలకు పోస్టులు అమ్ముకుంటున్నరని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ నిజాయితీగా చెప్పిండు. రూ.50 కోట్లకు టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి అమ్ముకున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అన్నాడు. డబ్బులు తీసుకొని సీఎం పోస్ట్ ఇచ్చిండు కాబట్టే, రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని ఏం చేయలేకపోతున్నడు. రేవంత్ రెడ్డి చేసిన కూల్చివేతలు మీనాక్షి నటరాజన్‌కు నచ్చక వద్దు అన్నందుకు, ఆమె రాజ్యసభ నామినేషన్ రద్దు అయ్యేట్లు కేసు వివరాలు లీక్ చేశాడు. మీనాక్షి నటరాజన్ మీద కోపంతోనే రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులకు ఒక దొంగ కేసు గురించి ఉప్పు అందించి, నామినేషన్ ఎగిరిపోయేలా చేసిండు అని కేటీఆర్ పేర్కొన్నారు.

స‌ర్ తీసుకొస్తున్నారు.. జాగ్ర‌త్త‌గా ఉండాలి..

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) తెచ్చి వెస్ట్ బెంగాల్‌లో 95 లక్షల ఓట్లు, బీహార్‌లో 65 లక్షల ఓట్లు తీసేశారు. తమిళనాడులో మాజీ సీఎం స్టాలిన్ సొంత నియోజకవర్గంలో 80 వేల ఓట్లు తొలగించారు.. ఆయన 10 వేల ఓట్లతో ఓడిపోయాడు. తెలంగాణలో జూన్ 25 నుండి SIRను తీసుకొస్తున్నారు.. మనం జాగ్రత్తగా ఉండాలి అని కేటీఆర్ సూచించారు.

Advertisement
Advertisement