త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lok Sabha | మ‌రోసారి లోక్‌స‌భ‌ ముందుకు డీలిమిటేషన్, మహిళా కోటా బిల్లు..?

Lok Sabha | బెంగాల్‌లో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిస్థితులు కేంద్ర ప్ర‌భుత్వానికి క‌లిసొచ్చేలా క‌నిపిస్తున్నాయి. టీఎంసీలో చీలిక‌తో లోక్‌స‌భ‌లో ఎన్డీయేకి (NDA) మూడింట రెండు వంతుల మెజారిటీ ల‌భించే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లులు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చాయి. ఇటీవ‌లే స‌భ‌లో వీగిపోయిన ఈ బిల్లుల‌ను కేంద్రం మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టొచ్చ‌న్న చ‌ర్చ ఊపందుకుంది.

D

National | Published On Jun 9, 2026, 4.35 pm IST

Lok Sabha | మ‌రోసారి లోక్‌స‌భ‌ ముందుకు డీలిమిటేషన్, మహిళా కోటా బిల్లు..?
Advertisement
  • వ‌ర్షాకాల స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్టే ఛాన్స్‌
  • స‌భ‌లో బ‌లం పెంచుకునేందుకు ఎన్డీయే పావులు
  • ఎన్డీయేకి మ‌ద్ద‌తుగా 20 మంది టీఎంసీ ఎంపీలు

Lok Sabha | ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్‌లో భారీ కుదుపు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. సుమారు 20 మంది లోక్‌స‌భ టీఎంసీ ఎంపీలు ఎన్డీయే ప్ర‌భుత్వంలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. వారంతా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తిస్తూ లోక్‌స‌భ‌ స్పీక‌ర్‌కు లేఖ రాశారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రాబోయే రోజుల్లో పార్ల‌మెంట్‌లో ఎన్డీయే సంఖ్యాబ‌లం 300 మార్క్‌ను దాటే అవ‌కాశం ఉంది. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గ పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాబోయే వ‌ర్షాకాల స‌మావేశాల్లో బీజేపీ నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఈ బిల్లుల‌ను మ‌ళ్లీ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉందంటూ జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఎన్డీయే బ‌లం ఇలా..

తృణ‌మూల్‌లో చీలికతో లోక్‌స‌భ‌లో (Lok Sabha) ఎన్డీయే త‌న బ‌లాన్ని పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు క‌దుపుతోంది. ఎన్డీయేకి లోక్‌సభలో ప్ర‌స్తుతం 293 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు 20 మంది టీఎంసీ ఎంపీల‌ మద్దతు కూడా లభిస్తే ఆ సంఖ్య 313కు పెరుగుతుంది. ఇక త‌మిళ‌నాడులో కాంగ్రెస్ పార్టీపై ఆగ్ర‌హంతో ఉన్న ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు చెందిన‌ 22 మంది ఎంపీల మద్దతు కూడా కూడ‌గ‌ట్ట‌గ‌లిగితే.. ఎంపీల బ‌లం 335కి పెరుగుతుంది. ఇదిలా ఉండ‌గా.. మహారాష్ట్ర నేత ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేనకు చెందిన 9 మంది ఎంపీల మద్దతును కూడా కూడగట్టేందుకూ బీజేపీ పెద్ద‌లు ప్రయత్నాలు ముమ్మ‌రం చేశారు. వీరిలో కొందరి మద్దతు లభించినా ఎన్డీయే బ‌లం 341కి పెరుగుతుంది. అప్పుడు స‌భ‌లో ప్ర‌భుత్వానికి మూడింట రెండు వంతుల మెజారిటీ ల‌భిస్తుంది. ఇదే జ‌రిగితే జులైలో జ‌రిగే వ‌ర్షాకాల స‌మావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ బిల్లును కేంద్రం ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉందంటూ జాతీయ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

వీగిపోయిన బిల్లులు..

మహిళా రిజర్వేషన్ల (Women's Reservation) అమలును వేగవంతం చేయడంతో పాటు, కొత్త జనాభా లెక్కల అవసరం లేకుండానే (2011 జనాభా లెక్కల ఆధారంగా) డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) చేపట్టేందుకు కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ బిల్లు ఆమోదం పొంద‌డానికి అవ‌స‌ర‌మైన మూడింట రెండు వంతుల మెజారిటీ ల‌భించ‌లేదు. దీంతో బిల్లు స‌భ‌లో వీగిపోయింది. బిల్లు ఆమోదం పొందాలంటే మొత్తం 326 ఓట్లు అవసరం. అయితే ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొనగా, బిల్లుకు అనుకూలంగా కేవలం 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. బిల్లుకు వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు. అవసరమైన సంఖ్యాబలం రాకపోవడంతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ బిల్లును లోక్‌సభ నుంచి ఉపసంహరించుకున్నారు.

Also Read..

ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాల‌ను త‌క్ష‌ణ‌మే భ‌ర్తీ చేయండి.. డీజీపీని కోరిన నిరుద్యోగులు

ఉజ్వ‌ల ల‌బ్ధిదారుల‌కు షాక్‌.. ఇక‌పై ఏడాదికి 4 స‌బ్సిడీ సిలిండ‌ర్లే..

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలకు విరామం.. మార్కెట్లకు ఊరట..

Advertisement
Advertisement