త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | డ్ర‌గ్స్‌కు దూరంగా ఉండండి..

PM Modi | అభివృద్ధి చెందిన భారత్‌–2047 లక్ష్య సాధనలో యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ‘డ్రగ్‌-ఫ్రీ యూత్‌ ఫర్‌ ఎ డెవలప్డ్‌ ఇండియా సంకల్ప్‌ అభియాన్‌’ను ప్రారంభించిన ఆయ‌న‌.. దేశవ్యాప్తంగా 28 వేలకుపైగా కేంద్రాల్లో ఈ కార్యక్రమంతో అనుసంధానమైన కోటి మందికిపైగా యువతకు అభినందనలు తెలిపారు.

P

National | Published On Aug 2, 2026, 4.39 pm IST

PM Modi | డ్ర‌గ్స్‌కు దూరంగా ఉండండి..
Advertisement
  • యువ‌త ఆరోగ్యంగా ఉండాలి
  • అక్ర‌మ వ్యాపారం ఉగ్ర‌వాద ఎజెండాలో భాగమే
  • ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ
  • నశా ముక్త్ యూత్ ఫర్ వికసిత భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభం

PM Modi | అభివృద్ధి చెందిన భారత్‌–2047 లక్ష్య సాధనలో యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ‘డ్రగ్‌-ఫ్రీ యూత్‌ ఫర్‌ ఎ డెవలప్డ్‌ ఇండియా సంకల్ప్‌ అభియాన్‌’ను ప్రారంభించిన ఆయ‌న‌.. దేశవ్యాప్తంగా 28 వేలకుపైగా కేంద్రాల్లో ఈ కార్యక్రమంతో అనుసంధానమైన కోటి మందికిపైగా యువతకు అభినందనలు తెలిపారు. శత్రు దేశాలు భారత్‌ను బలహీనపర్చేందుకు మాదకద్రవ్యాలను దేశంలోకి అక్రమంగా తరలిస్తూ యువతను లక్ష్యంగా చేసుకుంటున్నాయని మోదీ తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం శత్రువుల ఉగ్రవాద ఎజెండాలో భాగమని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందిన భారత లక్ష్యంతో ముందుకు సాగుతున్న వేళ యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

వ్యసన నిర్మూలన వ్యక్తిగత ప్రయత్నంగా కాకుండా సామూహిక ఉద్యమంగా మారాలని ప్రధాని పిలుపునిచ్చారు. కోట్లాది మంది కలిసి నడిస్తే అసాధ్యమనుకున్న లక్ష్యాలూ సులభంగా సాధ్యమవుతాయని చెప్పారు. రాబోయే 100 ఆదివారాలు మాదకద్రవ్యాల రహిత భారత దిశగా 100 బలమైన అడుగులు కావాలని ఆకాంక్షించారు. ఈ ఉద్యమం ప్రతి యువ హృదయాల‌ను తాకాలని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని మోదీ తెలిపారు. డ్రగ్స్‌ అక్రమ రవాణాదారులపై భారీ స్థాయిలో అరెస్టులు జరిగాయని, వేల కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దేశానికి యువత శక్తి, సృజనాత్మకత, ప్రతిభ అత్యంత అవసరమని, అందుకే ప్రతి యువకుడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా యువకుడు వ్యసనానికి గురైతే.. వారి గురించి దాచిపెట్ట‌కుండా వైద్య సహాయంతో వాటి నుంచి బ‌య‌ట‌ప‌డేలా చేయాల‌ని మోదీ సూచించారు. పిల్లలతో కుటుంబాల్లో స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం ఉండాలని, అలా ఉంటే వారు వ్యసనాల బారిన పడకముందే కాపాడవచ్చన్నారు.

కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కోటి మందికిపైగా యువత మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ ప్రతిజ్ఞ చేశారు. ‘మై భారత్‌’ యువ వాలంటీర్ల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఉద్యమంలో ప్రతి ఆదివారం క్రీడా పోటీలు, వాక్‌థాన్‌లు, ధ్యాన శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు, వీధి నాటకాలు, చర్చా వేదికలు, చిత్రలేఖన పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 50, 75, 100వ వారాల్లో విశేష సేవలందించిన వ‌లంటీర్లు, సంస్థలను సత్కరించనున్నారు. ‘మాదకద్రవ్యాల రహిత యువతే అభివృద్ధి చెందిన భారతానికి అతిపెద్ద బలం’ అనే సందేశాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడమే ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

Advertisement
Advertisement