త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPG Cylinders | ఉజ్వ‌ల ల‌బ్ధిదారుల‌కు షాక్‌.. ఇక‌పై ఏడాదికి 4 స‌బ్సిడీ సిలిండ‌ర్లే..

LPG Cylinders | ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉజ్వల యోజన కింద సబ్సిడీపై లభించే గ్యాస్ సిలిండర్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటివరకు ఏడాదికి 9 సబ్సిడీ సిలిండర్లు అందుబాటులో ఉండగా, ఇకపై కేవలం 4 సిలిండర్లకే సబ్సిడీ వర్తించనుంది.

S

Business | Published On Jun 9, 2026, 4.05 pm IST

LPG Cylinders | ఉజ్వ‌ల ల‌బ్ధిదారుల‌కు షాక్‌.. ఇక‌పై ఏడాదికి 4 స‌బ్సిడీ సిలిండ‌ర్లే..
Advertisement

LPG Cylinders | ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉజ్వల యోజన కింద సబ్సిడీపై లభించే గ్యాస్ సిలిండర్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటివరకు ఏడాదికి 9 సబ్సిడీ సిలిండర్లు అందుబాటులో ఉండగా, ఇకపై కేవలం 4 సిలిండర్లకే సబ్సిడీ వర్తించనుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను 2016 మేలో ప్రారంభించారు. ఆ సమయంలో లబ్ధిదారులకు ఏడాదికి 14.2 కిలోల బరువున్న 12 ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీ లభించేది. అనంతరం ఆ సంఖ్యను 9కు తగ్గించారు. ఇప్పుడు మరింతగా తగ్గించి 4 సిలిండర్లకే పరిమితం చేశారు. ఉజ్వల పథకం కింద ఇకపై ఏడాదిలో మొదటి నాలుగు సిలిండర్లపైనే సబ్సిడీ అందుతుంది. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ మల్ ఖనుజా మాట్లాడుతూ ప్రజల సగటు వార్షిక గ్యాస్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉజ్వల పథకం లబ్ధిదారుల్లో చాలా మంది సగటున ఏడాదికి అంతే సంఖ్యలో సిలిండర్ల‌ను వినియోగిస్తున్నారని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు.

మొద‌టి 4 సిలిండ‌ర్ల‌కే స‌బ్సిడీ..

స్వ‌చ్ఛ‌మైన‌ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంతోపాటు గ్యాస్ ధరల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2022 మేలో ప్రత్యేక సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ప్రతి 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ.200 సబ్సిడీ అందించేవారు. ప్రతి రీఫిల్ అనంతరం ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేది. తర్వాత 2023 అక్టోబర్‌లో ఈ సబ్సిడీని సిలిండర్‌కు రూ.300కు పెంచారు. అలాగే 5 కిలోల చిన్న సిలిండర్లపై కూడా అనుపాతంగా ప్రయోజనం కల్పించారు. అయితే ప్రస్తుతం ఎల్పీజీ ధరలు వరుసగా పెరుగుతున్న సమయంలోనే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గించే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఉజ్వల లబ్ధిదారులకు మొదటి నాలుగు సిలిండర్లపై సిలిండర్‌కు రూ.300 సబ్సిడీ కొనసాగుతుంది. ఈ మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.942గా ఉంది. దీనిపై రూ.300 సబ్సిడీ వర్తించడంతో లబ్ధిదారులు మొదటి నాలుగు సిలిండర్లకు రూ.642 చెల్లిస్తే సరిపోతుంది.

5వ సిలిండ‌ర్ నుంచి స‌బ్సిడీ ఉండ‌దు..

అయితే ఏడాదిలో ఐదో సిలిండర్ నుంచి బుకింగ్ చేసుకునే ప్రతి సిలిండర్‌కు ఎలాంటి సబ్సిడీ ఉండదు. పూర్తి మార్కెట్ ధరనే చెల్లించాల్సి ఉంటుంది. గత మూడు నెలల్లో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రెండు సార్లు పెరిగి మొత్తం రూ.89 మేర భారమైంది. జూన్ 7న జరిగిన తాజా ధరల పెంపు తర్వాత సిలిండర్ ధర రూ.942కు చేరుకుంది. అయినప్పటికీ రూ.300 సబ్సిడీ కారణంగా ఉజ్వల యోజన లబ్ధిదారులు ఈ సిలిండర్‌ను రూ.642కే పొందుతున్నారు. ప్రభుత్వం ప్రకారం ఒక ఎల్పీజీ సిలిండర్ సరఫరా వ్యయం సుమారు రూ.1,600 ఉంటుంది. అయితే లబ్ధిదారులకు మొత్తం కలిపి సుమారు రూ.1వేయి వరకు సహాయం అందుతున్నట్లు పేర్కొంది. జూన్ 7న సిలిండర్ ధరను రూ.29 పెంచిన విషయాన్ని ప్రస్తావించిన ఖనుజా, ఈ పెరుగుదల రోజుకు కేవలం రూ.1 అదనపు భారం మాత్రమే అవుతుందని వివరించారు. ఐదుగురు సభ్యుల కుటుంబానికి ఇది ఒక్కో వ్యక్తిపై రోజుకు సుమారు 20 పైసల వ్యయం మాత్రమేనని తెలిపారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో చోటుచేసుకున్న పరిణామాల కారణంగా అంతర్జాతీయ గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ, దేశంలో గృహ వినియోగ గ్యాస్ ధరలు ఇంకా అనేక ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement