త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anti Paper Leak Bill | ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాల‌కు ఇక చెక్‌.. పేప‌ర్ లీక్ బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

Anti Paper Leak Bill | నీట్‌, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలు (Paper leaks), అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026' (యాంటీ పేపర్ లీక్ బిల్లు)కు లోక్‌స‌భ ఆమోదం తెలిపింది.

D

National | Published On Jul 29, 2026, 3.43 pm IST

Anti Paper Leak Bill | ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాల‌కు ఇక చెక్‌.. పేప‌ర్ లీక్ బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం
Advertisement

Anti Paper Leak Bill | దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను, నిరుద్యోగ యువతను వేధిస్తున్న ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాల‌కు ఇక చెక్ ప‌డ‌నుంది. నీట్‌, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలు (Paper leaks), అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026' (యాంటీ పేపర్ లీక్ బిల్లు)కు లోక్‌స‌భ ఆమోదం తెలిపింది. విప‌క్షాల ఆందోళ‌న‌ల మ‌ధ్యే ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అనంత‌రం స‌భ‌ను స్పీక‌ర్ ఓం బిర్లా రేప‌టికి వాయిదా వేశారు.

ఈ బిల్లును కేంద్రం సోమ‌వారం పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే సీజేపీ ఆందోళ‌న‌ల సంద‌ర్భంగా విద్యార్థుల‌పై లాఠీఛార్జ్ ఘ‌ట‌న‌ల‌ను నిర‌సిస్తూ విప‌క్షాల ఆందోళ‌న‌తో ఈ బిల్లుపై తొలిరోజు చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ఈ బిల్లుపై సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. స‌భ్యులు త‌మ అభ్యంత‌రాల‌ను వ్య‌క్తం చేశారు. అనంత‌రం ఇవాళ ఈ బిల్లుపై ప్ర‌భుత్వం స‌మాధాన‌మిచ్చింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. 2024లో పేపర్ లీక్ నిరోధక చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 52 ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదయ్యాయని ఆయన తెలిపారు.అంతేకాదు ఎన్డీయే హ‌యాంలో ఎయిమ్స్ (AIIMS) స‌హా ఉన్న‌త విద్యా సంస్థ‌ల సంఖ్య పెరిగింద‌ని చెప్పారు.

రాహుల్‌కు అవ‌గాహ‌నే లేదు..

విద్యార్థి ఆందోళ‌న‌కారుల‌పై కాల్పులు జ‌ర‌పాల్సిందిగా హోం మంత్రి అమిత్‌షా ఆదేశించారంటూ రాహుల్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై కూడా కేంద్ర మంత్రి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల‌పై ఆయ‌న‌కు అస‌లు అవ‌గాహ‌నే లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌భుత్వం ఎలా న‌డుస్తుందో ఆయ‌న‌కు తెలియ‌ద‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాహుల్ ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చారు. అలాంటి ఆదేశాలు కేవ‌లం మెజిస్ట్రేట్, ఎస్‌డీఎమ్ మాత్ర‌మే ఇవ్వ‌గ‌ల‌ర‌ని స్ప‌ష్టం చేశారు. "ప్ర‌భుత్వం ఎలా పనిచేస్తుందో ప్రతిపక్ష నాయకుడికి అసలు అవగాహన లేదు. ఏ పరిస్థితిలోనైనా కాల్పులు జరపాలని కేవలం మేజిస్ట్రేట్ మాత్రమే ఆదేశాలు ఇవ్వగలరు. ఏ మంత్రి కూడా ఇవ్వలేరు" అని లోక్‌సభలో జితేంద్ర సింగ్ స్ప‌ష్టం చేశారు.

ఆయ‌న ఆశ నెర‌వేర‌లేదు

ప్ర‌ధాని నివాసం ఎదుట ఆందోళ‌న‌పై కూడా జితేంద్ర సింగ్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష నేత ఏదో బ‌ల‌మైన ఆలోచ‌న‌తోనే ప్ర‌ధాని నివాసం బ‌య‌ట ధ‌ర్నాకు కూర్చున్నార‌న్నారు. దేశం త‌న‌ని ప్ర‌ధానిగా ఎన్నుకుని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్ర‌ధాని అధికారిక నివాసంలో కూర్చొబెట్టాల‌ని ఆయ‌న బ‌లంగా కోరుకుంటున్న‌ట్లు అనిపించింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆ ఆశ నెర‌వేర‌క‌పోవ‌డంతో నిరాశ‌, అస‌హ‌నానికి గురైన ఆయ‌న 7 LKM గేట్ల వద్దకు వెళ్లి కూర్చున్నార‌ని ఎద్దేవా చేశారు. అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌ని ఎంతో మ‌ర్యాద‌గా ఆయ‌న్ని అభ్య‌ర్థించామ‌ని చెప్పారు. చివ‌రికి బ‌ల‌వంతంగా అక్క‌డి నుంచి తొల‌గించిన‌ట్లు వివ‌రించారు.

చ‌ట్టంలోని కీల‌క స‌వ‌ర‌ణ‌లు ఇవే..

దేశవ్యాప్తంగా జ‌రిగే నీట్‌, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026' (యాంటీ పేపర్ లీక్ బిల్లు)ను సోమ‌వారం పార్లమెంటు ముందుకు తెచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే అమల్లో ఉన్న 2024 చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ ఈ ముసాయిదాను రూపొందించారు. ఈ బిల్లులో కేంద్రం కీల‌క మార్పులకు ప్ర‌తిపాదించింది. ఈ తరహా కేసులను వేగంగా విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

లీకేజీలు, అవకతవకలకు పాల్పడే వ్యక్తులకు విధించే గరిష్ఠ జైలు శిక్షను ఐదేళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచారు. నిందితులకు విధించే గరిష్ఠ జరిమానాను రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచారు. వ్య‌వ‌స్థీకృత నేరాల‌కు క‌నీసం ఏడేళ్ల జైలు శిక్ష‌, రూ.10 కోట్ల జ‌రిమానా ప‌డుతుంది. అక్రమాలకు పాల్పడే సర్వీస్ ప్రొవైడర్లు లేదా ప్రైవేట్ పరీక్షా ఏజెన్సీలకు రూ. 5 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు ఎనిమిదేళ్ల పాటూ పరీక్షలు నిర్వహించకుండా నిషేధం విధిస్తారు. ఆయా కేసుల్లో ఛార్జిషీట్ దాఖ‌లు చేసిన మూడు నెల‌ల్లోనే విచార‌ణ పూర్తి చేయాల‌ని ప్ర‌తిపాదించారు. ఈ కేసుల విచారణ కోసం అవ‌స‌ర‌మైతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ప్రత్యేక దర్యాప్తు చేపట్టనుంది.

Also Read..

లోక్‌స‌భ‌లో రాహుల్ Vs కేంద్రం.. ప్ర‌తిప‌క్ష నేత వ్యాఖ్య‌ల‌పై స‌భ‌లో ర‌గ‌డ‌

నువ్వో ప‌నికిరానివాడివి.. కాక్రోచ్ పార్టీ ప్రతినిధిపై కంగ‌న వివాదాస్ప‌ద‌ వ్యాఖ్య‌లు

కావ్య థాపర్‌కు మరో ఛాన్స్‌.. ‘నేను రెడీ’తోనైనా అదృష్టం కలిసొచ్చేనా?

Advertisement
Advertisement