త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలకు విరామం.. మార్కెట్లకు ఊరట..

Stock Markets | ముడి చమురు ధరలు తగ్గడం, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తాత్కాలికంగా సద్దుమణగడం, బ్యాంకింగ్ షేర్లలో బలమైన కొనుగోళ్లు నమోదవడం వంటి అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం రెండు రోజుల నష్టాల పరంపరకు ముగింపు పలికాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణి కూడా దేశీయ సూచీలకు మద్దతుగా నిలిచింది.

S

Business | Published On Jun 9, 2026, 3.50 pm IST

Stock Markets | ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలకు విరామం.. మార్కెట్లకు ఊరట..
Advertisement

Stock Markets | ముడి చమురు ధరలు తగ్గడం, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తాత్కాలికంగా సద్దుమణగడం, బ్యాంకింగ్ షేర్లలో బలమైన కొనుగోళ్లు నమోదవడం వంటి అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం రెండు రోజుల నష్టాల పరంపరకు ముగింపు పలికాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణి కూడా దేశీయ సూచీలకు మద్దతుగా నిలిచింది. రోజంతా హెచ్చుతగ్గులతో సాగిన ట్రేడింగ్ అనంతరం బీఎస్ఈ సెన్సెక్స్ 395 పాయింట్లు (0.54 శాతం) లాభంతో 73,919 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 119 పాయింట్లు (0.52 శాతం) పెరిగి 23,242 వద్ద స్థిరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విజ్ఞప్తి అనంతరం ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులను నిలిపివేయడానికి అంగీకరించాయి. అయితే లెబనాన్‌లో హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే తిరిగి ప్రతీకార చర్యలు చేపడతామని టెహ్రాన్ హెచ్చరించింది. ఈ పరిణామాలతో సోమవారం తీవ్ర పతనం చవిచూసిన ఆసియా మార్కెట్లు మళ్లీ కోలుకుని మంగ‌ళ‌వారం 2.5 శాతం వరకు లాభపడ్డాయి.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు, పెరిగిన రూపాయి విలువ‌..

అంతర్జాతీయ మార్కెట్లో చ‌మురు ధ‌రలు కూడా భారీగా త‌గ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.33 శాతం క్షీణించి బ్యారెల్‌కు 91.79 వ‌ద్ద నిల‌వ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.71 శాతం మేర త‌గ్గి బ్యారెల్‌కు 87.96 డాల‌ర్ల వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ కాస్త బ‌ల‌ప‌డింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 35 పైస‌లు పెరిగిన రూపాయి విలువ డాల‌ర్‌కు 95.34 వ‌ద్ద నిలిచింది. ఈ సంద‌ర్భంగా జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయ‌ర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన భారీ పతనం తర్వాత దేశీయ మార్కెట్లు స్వల్ప పునరుద్ధరణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల్లో విరామం, ముడి చమురు ధరల సడలింపు ఇందుకు ప్రధాన కారణాలని తెలిపారు. అయితే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) అమ్మకాలు కొనసాగుతుండటం, బాండ్ యీల్డ్‌లు అధిక స్థాయిలో ఉండటం వంటి అంశాలు ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయనే సంకేతాలు ఇస్తున్నాయని ఆయన హెచ్చరించారు.

అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే..

అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు త్వరలో విడుదల కానుండటంతో ప్రస్తుతం పెట్టుబడిదారుల దృష్టి వాటిపైనే ఉందని వినోద్ నాయర్ చెప్పారు. ఈ గణాంకాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ వడ్డీ రేట్ల విధానంపై అంచనాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ లిక్విడిటీ పరిస్థితులపై కూడా ఇవి ప్రభావం చూపే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. స్వల్పకాలంలో మార్కెట్లు హెచ్చుతగ్గులతో కూడిన పరిమిత పరిధిలోనే కదిలే అవకాశం ఉందని అన్నారు. నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాల కంటే కొంత మెరుగ్గా వచ్చినప్పటికీ, 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించిన అంచనాలు బలహీనంగానే ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో స్పష్టమైన సంకేతాలు వచ్చే వరకు పెట్టుబడిదారులు అప్రమత్తంగానే వ్యవహరించాలని సూచించారు.

Advertisement
Advertisement