త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS NRIs USA | దేవాదులకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి.. తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాలి

BRS NRIs USA | దేవాదుల ప్రాజెక్టుకు న‌ర్సంపేట‌ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి పేరు పెట్టాల‌ని అమెరికాలోని బాల్టిమోర్‌లో బీఆర్ఎస్‌, ఎన్నారై నాయ‌కులు కోరారు. స్వ‌రాష్ట్ర సాధన కోసం పెద్ది చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. అమెరికాలో జ‌రుగుతున్న‌ ఆటా మహాసభల్లో ఆదివారం బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ఏ ఆధ్వర్యంలో పెద్ది సంతాప స‌భ నిర్వ‌హించి పెద్ది చిత్ర‌ప‌టానికి ఘ‌న నివాళుల‌ర్పించారు.

S

Telangana | Published On Aug 2, 2026, 4.51 pm IST

BRS NRIs USA | దేవాదులకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి.. తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాలి
Advertisement
  • అమెరికాలో పెద్ది సంస్మ‌ర‌ణ స‌భ‌లో బీఆర్ఎస్ ఎన్నారై నాయ‌కుల డిమాండ్‌

BRS NRIs USA | త్రినేత్ర‌.న్యూస్‌: దేవాదుల ప్రాజెక్టుకు న‌ర్సంపేట‌ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి పేరు పెట్టాల‌ని అమెరికాలోని బాల్టిమోర్‌లో బీఆర్ఎస్‌, ఎన్నారై నాయ‌కులు కోరారు. స్వ‌రాష్ట్ర సాధన కోసం పెద్ది చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఉద్యమ సమయంలో తీవ్ర గాయాల పాలై ఒక కాలు, ఒక కన్నును కోల్పోయినప్పటికీ, ప్రజల కోసం, తెలంగాణ కోసం చివరి శ్వాస‌ వరకు అంకితభావంతో పోరాడారని గుర్తు చేశారు. అలాంటి త్యాగధనులను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువదన్నారు. అమెరికాలో జ‌రుగుతున్న‌ ఆటా మహాసభల్లో ఆదివారం బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ఏ ఆధ్వర్యంలో పెద్ది సంతాప స‌భ నిర్వ‌హించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంత‌రం పెద్ది చిత్ర‌ప‌టానికి ఘ‌న నివాళుల‌ర్పించారు.

లేదంటే బీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పేరు పెడ‌తాం..

ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, నాయ‌కులు మాట్లాడారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలకు, ఉద్యమ త్యాగాలకు శాశ్వత గుర్తింపుగా దేవాదుల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాల‌ని మహేష్ తన్నీరు ప్రతిపాదించారు. న‌ర్సంపేట‌లో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పెద్ది పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోని పక్షంలో, భవిష్యత్తులో బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేలా చర్యలు తీసుకుంటామని నాయకులు పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం పనిచేయడమే నిజమైన నివాళి అని స్ప‌ష్టం చేశారు. నాయకులు, ఎన్నారైలు, జర్నలిస్టులు పెద్దితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు. కాగా ఈ ఆటా కన్వెన్షన్ సెంటర్ వేలాది మంది సంస్మరణ సభకు హాజరయ్యారు.

బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ఏ ఇన్‌చార్జ్ మహేష్ తన్నీరు ఆధ్వర్యంలో తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి, చందు తాళ్లా, నరసింహ నాగులవంచ, రజనీకాంత్ కోసనం ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన‌ట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్ణే ప్రభాకర్, బాలమల్లు, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గ్యాద‌రి కిషోర్, పుట్ట మధు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కర్నాటి విద్యాసాగర్, మాజీ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, నల్లగొండ నాయకుడు నంద్యాల దయాకర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ ఛైర్మన్ రఘువీర్ సింగ్, రేగట్టె మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement