త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Barakah nuclear facility | ప్ర‌మాద‌క‌ర ప‌రిణామం.. యూఏఈలోని బ‌రాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భార‌త్‌

Barakah nuclear facility | యూఏఈ (UAE)లోని బ‌రాకా అణు విద్యుత్ కేంద్రం (Barakah nuclear facility) ల‌క్ష్యంగా జ‌రిగిన డ్రోన్ దాడిని (drone attack) భార‌త్ (India) తీవ్రంగా ఖండించింది. దీన్ని ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిణామంగా అభివ‌ర్ణించింది.

D

National | Published On May 18, 2026, 12.44 pm IST

Barakah nuclear facility | ప్ర‌మాద‌క‌ర ప‌రిణామం.. యూఏఈలోని బ‌రాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భార‌త్‌
Advertisement

Barakah nuclear facility | యూఏఈ (UAE)లోని బ‌రాకా అణు విద్యుత్ కేంద్రం (Barakah nuclear facility) ల‌క్ష్యంగా జ‌రిగిన డ్రోన్ దాడిని (drone attack) భార‌త్ (India) తీవ్రంగా ఖండించింది. దీన్ని ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిణామంగా అభివ‌ర్ణించింది. ఇలాంటి చ‌ర్య‌లు ఎంత‌మాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని పేర్కొంది. అంద‌రూ సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించింది. చ‌ర్చ‌లు, దౌత్య మార్గాల్లోనే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని పిలుపునిచ్చింది.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల‌తో ప‌శ్చిమాసియా మొత్తం ద‌ద్ద‌రిల్లుతోంది. ఇప్ప‌టికే అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఈ ఉద్రిక్త‌త‌ల‌ను మ‌రింత పెంచేలా.. యూఏఈలోని అల్ దఫ్రా ప్రాంతంలో ఉన్న‌ బ‌రాకా అణు విద్యుత్ కేంద్రం స‌మీపంలో డ్రోన్ దాడి జ‌ర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇది ఇరాన్ చ‌ర్యే అని భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో ప్లాంటు ప్రాంగ‌ణంలో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. యూఏఈకి దాదాపు 25 శాతం విద్యుత్‌ను అందించే ఈ కీలక కేంద్రంపై దాడి జరగడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేప‌థ్యంలో డ్రోన్ దాడిని భార‌త్ తీవ్రంగా ఖండించింది.

"యూఏఈలోని బరాకా అణు కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి పట్ల భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటువంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావు. ఇవి ప్రమాదకరమైన ఉద్రిక్తతలకు దారితీస్తాయి. అందరూ సంయమనం పాటించాలి. స‌మ‌స్య‌ల‌ను చర్చలు, దౌత్య మార్గాల్లోనే ప‌రిష్క‌రించుకోవాలి" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) ఒక ప్రకటనలో తెలిపింది.

ఇది ఉగ్ర‌దాడి.. యూఏఈ

మ‌రోవైపు ఈ దాడిని యూఏఈ సైతం తీవ్రంగా ఖండించింది. దీనిని ఒక ఉగ్ర‌దాడిగా అభివ‌ర్ణించింది. అయితే, ఈ దాడి వ‌ల్ల అణు విద్యుత్ కేంద్రానికి ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌లేద‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. ఈ దాడులు దేశ భ‌ద్ర‌త‌కు ముప్పుగా ఉన్నాయ‌ని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. శాంతియుత అణు ఇంధ‌న కేంద్రాల‌ను ల‌క్ష్యంగా చేసుకోవ‌డం అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌ను ఘోరంగా ఉల్లంఘించ‌డ‌మేన‌ని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. ఇటువంటి చర్యలు పౌరులకు, పర్యావరణానికి, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని యూఏఈ అధికారులు తెలిపారు. రేడియేషన్ లీకేజీ లేదని కూడా చెప్పారు. విద్యుత్ ప్లాంట్‌లో కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయని అన్నారు. తమ దేశానికి పశ్చిమాన ఉన్న సరిహద్దు అవతలివైపు నుంచి మూడు డ్రోన్స్ వచ్చాయని యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. రెండు డ్రోన్స్‌ను మాత్రమే అడ్డుకోగలిగామని పేర్కొంది. డ్రోన్స్‌ను ప్రయోగించింది ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.

దక్షిణ కొరియా సాయంతో బరాకా ప్లాంట్‌ను యూఏఈ నిర్మించింది. ఇది గల్ఫ్‌లో ఉన్న ఒకే ఒక అణువిద్యుత్ కేంద్రం. 2020 నుంచీ అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 20 బిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ విద్యుత్ కేంద్రం యూఏఈలో 25 శాతం విద్యుత్ అవసరాలను తీరుస్తోంది. దీంతో ఈ ప్లాంట్‌పై దాడి జ‌ర‌గ‌డం ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Also Read..

ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం

విజ‌య్ ప్ర‌భుత్వం నాలుగు నెల‌ల‌కంటే ఎక్కువ రోజులు అధికారంలో ఉండ‌దు.. డీఎంకే ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫ్రీ యూజ‌ర్ల‌కు షాకిచ్చిన ఎక్స్‌.. పోస్టుల‌పై లిమిట్స్ విధింపు..

Advertisement
Advertisement