త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pramod Mahajan | త‌మిళ‌నాట రాజ‌కీయ గంద‌రగోళం.. వెలుగులోకి ప్రమోద్ మహాజన్ 30 ఏళ్ల నాటి స్పీచ్‌.. అందులో ఏముందంటే..?

Pramod Mahajan | త‌మిళ‌నాడులో కొన‌సాగుత‌న్న రాజ‌కీయ అనిశ్చితి వేళ‌.. 30 ఏళ్ల కింద‌ట పార్లమెంట్‌లో బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్ చేసిన ప్ర‌సంగం వైర‌ల్ అవుతోంది. అప్ప‌ట్లో కూటమి రాజకీయాల్లోని వైరుధ్యాలపై చమత్కారభరితమైన, చురకలతో కూడిన ఆయ‌న ప్రసంగం.. ఇప్పుడు త‌మిళ రాజకీయ‌ పరిస్థితులకు అద్దం ప‌డుతోంది.

D

National | Published On May 9, 2026, 12.58 pm IST

Pramod Mahajan | త‌మిళ‌నాట రాజ‌కీయ గంద‌రగోళం.. వెలుగులోకి ప్రమోద్ మహాజన్ 30 ఏళ్ల నాటి స్పీచ్‌.. అందులో ఏముందంటే..?
Advertisement

Pramod Mahajan | త‌మిళ‌నాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడ‌టంతో అక్క‌డ రాజ‌కీయ (Tamil Nadu Political) అనిశ్చితి కొన‌సాగుతోంది. నూత‌న ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంలో స్ప‌ష్ట‌త‌రావ‌డం లేదు. తాజా ఎన్నిక‌ల్లో 108 స్థానాల్లో గెలిచిన అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన విజ‌య్ నేతృత్వంలోని టీవీకే ప్ర‌భుత్వ ఏర్పాటుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. చిన్న పార్టీల మ‌ద్ద‌తుతో విజ‌య్ మూడుసార్లు గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశారు. మెజారిటీకి అవ‌స‌ర‌మైన 118 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంద‌ని గ‌వ‌ర్న‌ర్‌కు తెలిపారు. అయినా, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గ‌వ‌ర్న‌ర్ నుంచి విజ‌య్‌కి ఆహ్వానం అంద‌డం లేదు. దీంతో ప్ర‌స్తుతం త‌మిళ రాజ‌కీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది.

ఇదే స‌మ‌యంలో సుమారు మూడు దశాబ్దాల క్రితం పార్లమెంట్‌లో బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్ (Pramod Mahajan) చేసిన‌ ప్రసంగం ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. 1997లో లోక్‌సభలో జరిగిన విశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా కూటమి రాజకీయాల్లోని వైరుధ్యాలపై ప్రమోద్ మహాజన్ చేసిన ప్ర‌సంగం అప్పట్లో సంచలనం సృష్టించింది. చమత్కారభరితమైన, చురకలతో కూడిన ఆయ‌న ప్రసంగం.. ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిస్థితులకు అద్దం ప‌డుతోంది.

మహాజన్ ఏం మాట్లాడారు..?

1997, ఏప్రిల్ 11న అప్పటి ప్రధాని హెచ్.డి. దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంపై జరిగిన విశ్వాస పరీక్ష చర్చలో మహాజన్ ఈ ప్రసంగం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలోని వైరుధ్యాలను ఆయన ఉదాహరణతో వివరించారు. గ‌తంలో ర‌మాకాంత్ ఖ‌లాప్ నేతృత్వంలో పార్లమెంటరీ బృందం చైనా పర్యటన విషయాలను గుర్తుచేసుకున్నారు. భార‌త ప్రజాస్వామ్యం ఎలా ప‌నిచేస్తుంద‌నే విష‌యాన్ని తెలుసుకునేందుకు చైనా ప్ర‌తినిధులు అమితాస‌క్తి చూపించార‌ని తెలిపారు. వారికి ఆ విష‌యాల‌ను తాను ఎలా వివ‌రించానో ప్రమోద్‌ స‌భ‌కు వివ‌రించిన తీరు ఆక‌ట్టుకుంది.

"నేను ప్రమోద్ మహాజన్‌ను.. లోక్‌సభ సభ్యుడిని. అతిపెద్ద పార్టీకి చెందినవాడిని. కానీ ప్రతిపక్షంలో ఉన్నాను. ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీ పాణిగ్రాహిని చూపిస్తూ.. ఈయ‌న రెండో అతిపెద్ద పార్టీకి చెందిన‌వారు. బ‌య‌టి నుంచి ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తిస్తున్నారు. సీపీఎం నేత ఎంఏ బేబీని చూపిస్తూ.. ఈయ‌న మూడో అతిపెద్ద పార్టీకి చెందిన‌వారు. కూట‌మిలో ఉన్నారు. కానీ, ప్ర‌భుత్వంలో లేరు. రమాకాంత్‌ ఖలాప్‌.. త‌న పార్టీకి చెందిన ఏకైక నేత‌. ఆయ‌న ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు" అని ప్ర‌మోద్ మ‌హాజ‌న్ వివ‌రించిన తీరు స‌భ‌లో న‌వ్వులు పూయించింది.

దాదాపు 45 నిమిషాల పాటు సాగిన మ‌హాజ‌న్‌ ప్రసంగంలో మరికొన్ని పదునైన విమర్శలు కూడా ఉన్నాయి. దేవెగౌడ‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. "ప్రభుత్వం మనుగడ గురించి దేశమంతా ఆందోళన చెందుతుంటే.. ప్రధాని మాత్రం ఆ అనిశ్చితిని ఏమాత్రం పట్టించుకోకుండా నిద్రపోయేంత ప్రశాంతంగా ఉన్నారు" అని ఎద్దేవా చేశారు. దేవెగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి మధ్య ఉన్న‌ బంధాన్ని కూడా ఆయ‌న ఎత్తిచూపారు. "ఇది ఒక వింత పెళ్లి. ఇందులో పెళ్ళికొడుకు (దేవెగౌడ), పెళ్లికూతురు తండ్రి (కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి) మొదటి రోజు నుంచే గొడవపడుతున్నారు. అసలు హనీమూన్ కూడా మొదలవ్వకముందే విడాకుల దాకా వెళ్లారు" అని మహాజన్ అనడంతో సభలో నవ్వులు పూశాయి.

13 పార్టీల యునైటెడ్ ఫ్రంట్‌కు కాంగ్రెస్ బయటి నుంచి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపై కూడా మహాజన్ వ్యంగ్యంగా స్పందించారు. "బయటి నుంచి ఇచ్చే మద్దతు ఎలా ఉంటుందంటే.. ఎవరో ఒకరు మీరు ఎక్కుతున్న నిచ్చెనను పట్టుకున్నట్టే పట్టుకొని, మీరు చివరి మెట్టుకు చేరుకోగానే దానిని లాగేయడం లాంటిది. ఇది మద్దతులా లేదు.. ప్రభుత్వాన్ని కూల‌దోసేందుకు చేస్తున్న స‌న్నాహంలా అనిపిస్తోంది" అంటూ వ్యాఖ్యానించారు.

ఏ పార్టీకీ ల‌భించ‌ని మెజారిటీ..

1996 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ లభించలేదు. 161 స్థానాలతో భారతీయ జనతా పార్టీ (BJP) అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ.. అటల్ బిహారీ వాజ్‌పేయిని ఆహ్వానించారు. శివసేన వంటి తమ మిత్రపక్షాలతో కలిపి బీజేపీకి దాదాపు 194 సీట్ల మద్దతు ఉంది. దీంతో ఆయ‌న ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. టీడీపీ, డీఎంకే, ఏజీపీ వంటి ప్రాంతీయ పార్టీల నుంచి అద‌న‌పు మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌ని వాజ్‌పేయి ఆశించారు.

13 రోజుల‌కే రాజీనామా..

అయితే, ఆ పార్టీలు వాజ్‌పేయికి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు నిరాక‌రించ‌డంతో ఆ ప్ర‌భుత్వం కూలిపోయింది. బాధ్య‌త‌లు చేప‌ట్టిన 13 రోజుల‌కే వాజ్‌పేయి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత బీజేపీ, కాంగ్రెస్‌యేత‌ర పార్టీలు యునైటెడ్ ఫ్రంట్‌గా ఏర్ప‌డి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ప్ర‌భుత్వానికి 140 స్థానాలు కలిగిన కాంగ్రెస్ బ‌య‌టి నుంచి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో హెచ్‌డీ దేవెగౌడ మెజారిటీని నిరూపించుకుని జూన్ 1, 1996న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొన్నాళ్లకే ఆ ప్రభుత్వం కూడా కూలిపోయింది.

దేవెగౌడ ప్ర‌భుత్వం కూలిపోడానికి కార‌ణం ఇదే..

అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సీతారాం కేసరి, దేవెగౌడ మ‌ధ్య వివాదం త‌లెత్తింది. దేవెగౌడ తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని సీతారాం కేస‌రి భావించారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన పాత అవినీతి కేసుల దర్యాప్తు కూడా ముమ్మరమైంది. ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని కేసరి కోరినప్పటికీ.. గౌడ అందుకు అంగీకరించలేదు.

దీంతో మార్చి 30, 1997న కేసరి నేరుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత విశ్వాస తీర్మానం ప్రవేశట్టారు. ఏప్రిల్ 11, 1997న జరిగిన ఓటింగ్‌లో యునైటెడ్ ఫ్రంట్‌కు 190 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 292 ఓట్లు వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఆ సమయంలో జరిగిన చర్చలోనే ప్రమోద్ మహాజన్ తన ప్రసంగంతో ఆక‌ట్టుకున్నారు.

అప్పుడు కూడా హ‌స్తంపార్టీ అలానే చేసింది..

దేవెగౌడ ప్ర‌భుత్వం కూలిపోయిన త‌ర్వాత ఐకె గుజ్రాల్‌కు (Inder Kumar Gujral) కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. కానీ మ‌ళ్లీ ఉప‌సంహ‌రించుకుంది. ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నికల్లో కూడా ఏ పార్టీకీ స్ప‌ష్ట‌మైన మెజారిటీ రాలేదు. హంగ్ ఏర్ప‌డింది. వాజ్‌పేయి కూట‌మి నేత‌గా ప్ర‌ధాన‌మంత్రి అయ్యారు. అయితే, జ‌య‌ల‌లిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకే మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకోవ‌డంతో ఆ ప్ర‌భుత్వం కూడా కూలిపోయింది. ఈ ప‌రిణామాల అనంత‌రం వాజ్‌పేయి మ‌రింత స్థిర‌మైన ఎన్డీయే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది 2004 వ‌ర‌కూ కొన‌సాగింది.

ఇక 2004-14 వ‌ర‌కూ మ‌న్మోహ‌న్ సింగ్ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూట‌మి పాలించింది. ఇక 2014లో తొలిసారిగా బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించి కేంద్రంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్ర‌స్తుతం మిత్ర‌ప‌క్షాల మ‌ద్ద‌తుతో బీజేపీ కేంద్రంలో వ‌రుస‌గా మూడోసారి అధికారంలో కొన‌సాగుతోంది.

Also Read..

క‌రీంన‌గ‌ర్ నిషేధిత ప్రాంత‌మా? కేటీఆర్ ఎందుకు రావొద్దు: గంగుల

వేస‌విలో చ‌ల్ల‌ద‌నం కోసం సోడాలు, కూల్‌డ్రింక్స్ అధికంగా తాగుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌.. వైద్యుల హెచ్చ‌రిక‌..

క్యూఆర్ కోడ్‌ల‌ను స్కాన్ చేసే స‌రికొత్త స్మార్ట్ వాచ్‌.. ఫోన్‌ను బ‌య‌ట‌కు తీయాల్సిన ప‌నిలేదు.. ధ‌ర చాలా త‌క్కువ‌..

Advertisement
Advertisement