త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

క్షుద్ర రాజకీయాలా? రాజకీయ వ్యూహాలా?: హరీశ్ రావు వర్సెస్ కాంగ్రెస్ ‘తాంత్రిక’ సమరం!

ఒకప్పుడు విధానాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి నమూనాలపై నడిచే తెలంగాణ రాజకీయం.. నేడు ‘క్షుద్ర పూజలు, తాంత్రిక క్రతువుల’ ఆరోపణలతో సరికొత్త మలుపు తిరిగింది! మాజీ మంత్రి హరీశ్ రావు ఆధ్యాత్మిక పర్యటనలను కాంగ్రెస్ నేతలు తీవ్రమైన రాజకీయ అస్త్రంగా మలుచుకుని కౌంటర్ ఇస్తుంటే.. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ మూఢనమ్మకాల డ్రామా అని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. ఒకవైపు ఓయూ పీఎస్‌లో పోలీస్ కేసులు, మరోవైపు లీగల్ నోటీసుల హెచ్చరికలతో ఇరుపార్టీల నడుమ 'తాంత్రిక సమరం' పరాకాష్టకు చేరింది. అసలు ఈ ఆరోపణల వెనుక ఉభయ పక్షాల అసలు రాజకీయ వ్యూహాలు ఏంటి? పదవుల పోటీయా లేక ప్రజాదృష్టిని మళ్లించే ప్రయత్నమా?

S

Flash news | Published On Aug 4, 2026, 6.08 pm IST

క్షుద్ర రాజకీయాలా? రాజకీయ వ్యూహాలా?: హరీశ్ రావు వర్సెస్ కాంగ్రెస్ ‘తాంత్రిక’ సమరం!

సంక్షిప్త సారాంశం

ఒకవైపు హరీశ్ రావు ఆధ్యాత్మిక సందర్శనలపై కాంగ్రెస్ నమోదు చేసిన పోలీస్ కేసులు.. మరోవైపు ఆ ఆరోపణలను తిప్పికొడుతూ కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు జారీ చేసిన పరువు నష్టం నోటీసులతో ఈ ‘తాంత్రిక’ పంచాయితీ కాస్తా చట్టపరమైన పోరుగా మారింది! ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై ఇరకాటంలో పెట్టేందుకు హరీశ్ రావు ప్రయత్నిస్తుంటే, ఆయన ఆరోపణల విశ్వసనీయతను దెబ్బతీసే వ్యూహంతో కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతోంది. మరి ఈ సవాళ్లు-కేసుల సమరంలో లీగల్‌గా పైచేయి సాధించేదెవరు? ఈ రాజకీయ మైండ్ గేమ్‌లో కాంగ్రెస్ అనుకున్నది సాధిస్తుందా లేక హరీశ్ రావు ఈ వివాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది!

Advertisement

                                                                చేతబడి రాజకీయం: కాంగ్రెస్ ‘తాంత్రిక’ దాడి.. హరీశ్ రావు లీగల్ కౌంటర్!

తెలంగాణ రాజకీయం ఒకప్పుడు విధానాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి నమూనాల చుట్టూ తిరిగేది. కానీ, ప్రధాన పార్టీల మధ్య వైరం ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఇటీవల రాష్ట్రంలో రేగిన ‘క్షుద్ర పూజల’ వివాదమే స్పష్టమైన ఉదాహరణ. బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును గురిపెట్టి కాంగ్రెస్ నేతలు చేసిన ‘తాంత్రిక పూజల’ ఆరోపణలు, దానికి ప్రతిగా హరీశ్ రావు విసిరిన చట్టపరమైన సవాళ్లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి.

పూజల వెనుక కుట్ర 

ఈ రచ్చకు బీజం పడింది కాంగ్రెస్ నాయకుల సంచలన ప్రకటనలతోనే. ఇటీవల హరీశ్ రావు తమిళనాడులోని తిరుచిరాపల్లి, కర్ణాటకలోని శివమొగ్గ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ఈ పర్యటనలను కాంగ్రెస్ నాయకత్వం తమకు అనుకూలమైన రాజకీయ అస్త్రంగా మలచుకుంది. రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, కరువు కాటకాలు అలముకోవాలని, ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచవచ్చనే ఉద్దేశంతోనే హరీశ్ రావు ఆ ఆలయాల్లో రహస్యంగా తాంత్రిక క్రతువులు చేయించారంటూ కాంగ్రెస్ పక్షం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆయన పర్యటనల వెనుక ఉన్న అసలు మర్మమేంటో ప్రజలకు సమాధానం చెప్పాలంటూ ఒత్తిడి పెంచింది.

కేసులు వర్సెస్ లీగల్ నోటీసులు

కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం కాకుండా, ఈ వివాదం కాస్తా చట్టపరమైన పోరుగా రూపాంతరం చెందింది. టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఉస్మానియా యూనివర్సిటీ (OU) పోలీస్ స్టేషన్‌లో హరీశ్ రావుపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రానికి చేటు తెచ్చేలా క్షుద్ర పూజలు చేయిస్తూ ప్రభుత్వంపై కుట్ర పన్నుతున్నారంటూ, బిఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) చట్టాల ప్రకారం ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. మరోవైపు, ఈ తరహా ఆరోపణలను హరీశ్ రావు తేలికగా తీసుకోలేదు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అసత్యాలు ప్రచారం చేశారంటూ కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు ఆయన లీగల్ నోటీసులు పంపారు. 24 గంటల్లోగా మీడియా వేదికగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, సోషల్ మీడియా నుంచి ఆ వీడియోలను తొలగించాలని, లేనిపక్షంలో క్రిమినల్, సివిల్ పరువు నష్టం కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.  ఈ పరిణామాలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ఆ పార్టీ నేత బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ వైఖరిపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి అగ్రనేతలు కూడా గుళ్లకు వెళ్తుంటారని, మరి వారి పర్యటనలను కూడా క్షుద్ర పూజలుగానే పరిగణిస్తారా అని నిలదీశారు.

సెంటిమెంట్ దాడి వెనుక రాజకీయ వ్యూహం

హరీశ్ రావుపై ఈ స్థాయిలో తాంత్రిక ముద్ర వేయడం వెనుక కాంగ్రెస్‌కు పక్కా రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రైతు రుణమాఫీ, హామీల అమలు, విద్యుత్ కోతల వంటి పాలనాపరమైన విషయాల్లో హరీశ్ రావు నిత్యం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దాంతో, ఈ ప్రజా సమస్యల ఆధారిత చర్చ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ ఈ ‘ఆధ్యాత్మిక-సెంటిమెంట్’ వివాదాన్ని ముందుకు తెచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హరీశ్ రావును ఒక సమర్థుడైన పాలకుడిగా కాకుండా, ‘మూఢనమ్మకాలు ఉన్న వ్యక్తిగా’, ‘రాష్ట్రానికి కీడు కోరే నాయకుడిగా’ ప్రజల్లో చిత్రీకరించి ఆయన రాజకీయ విశ్వసనీయతను తగ్గించడమే ఈ వ్యూహంలో ప్రధాన భాగమని భావిస్తున్నారు.

పదవుల కోసమే ఈ టార్గెట్?

బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ ఆరోపణలను వేరే కోణంలో చూస్తున్నారు. తమ పార్టీలోని కీలక నేతలను, ముఖ్యంగా హరీశ్ రావును టార్గెట్ చేసే వారికి కాంగ్రెస్ అధిష్ఠానం తగిన ఆఫర్లు ఇస్తోందని వారు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట నరసింహారావులకు మంత్రి హోదా కల్పించడమే ఇందుకు నిదర్శనమని పాయింట్ అవుట్ చేస్తున్నారు. అధిష్ఠానం దృష్టిలో పడి పదవులు దక్కించుకోవడానికి, పార్టీలో తమ స్థానాన్ని పదిలం చేసుకోవడానికే కాంగ్రెస్ నేతలు హరీశ్ రావును ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నారని గులాబీ శ్రేణులు ప్రత్యారోపణలు చేస్తున్నాయి.

దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలు

ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థుల మధ్య సిద్ధాంతపరమైన విమర్శలు, పాలనాపరమైన దాడులు సర్వసాధారణం. కానీ, "వర్షాలు పడకుండా పూజలు చేశారు" అనే స్థాయికి చర్చను తీసుకురావడంపై సామాన్య ప్రజలతో పాటు మేధావుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ విసిరిన ఈ సెంటిమెంట్ విమర్శలను హరీశ్ రావు చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. అయితే, రాబోయే రోజుల్లో ప్రజలు కోరుకునే అభివృద్ధి, ప్రజా సంక్షేమ అంశాలు చర్చకు వస్తాయా లేక ఈ తాంత్రిక ఆరోపణల పరంపరే కొనసాగుతుందా అనేది వేచి చూడాలి.

Advertisement
Advertisement