త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bombay High Court | రెండు పురుగులు క‌నిపించినంత మాత్రాన లైసెన్స్ ర‌ద్దు చేస్తారా..? ఎఫ్‌డీఏ చ‌ర్య‌ల‌ను తప్పుబ‌ట్టిన‌ బాంబే హైకోర్టు

Bombay High Court | న‌వీ ముంబై (Navi Mumbai)లోని ఓ హోట‌ల్ కిచెన్‌లో రెండు కీట‌కాలు కినిపించాయ‌న్న సాకుతో స‌ద‌రు హోట‌ల్ లైసెన్స్ ర‌ద్దు చేయ‌డాన్ని బాంబే హైకోర్టు (Bombay High Court) తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. "మనం భారతదేశంలో ఉన్నాం. వాస్తవ పరిస్థితులను గ్రహించి ఆచరణాత్మకంగా వ్యవహరించాలి" అని ఎఫ్‌డీఏ (FDA) అధికారులను కోర్టు హెచ్చరించింది. 

D

National | Published On Jul 30, 2026, 4.09 pm IST

Bombay High Court | రెండు పురుగులు క‌నిపించినంత మాత్రాన లైసెన్స్ ర‌ద్దు చేస్తారా..? ఎఫ్‌డీఏ చ‌ర్య‌ల‌ను తప్పుబ‌ట్టిన‌ బాంబే హైకోర్టు
Advertisement

Bombay High Court | త్రినేత్ర‌.న్యూస్ : న‌వీ ముంబై (Navi Mumbai)లోని ఓ హోట‌ల్ కిచెన్‌లో రెండు కీట‌కాలు కినిపించాయ‌న్న సాకుతో స‌ద‌రు హోట‌ల్ లైసెన్స్ ర‌ద్దు చేయ‌డాన్ని బాంబే హైకోర్టు (Bombay High Court) తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. స‌ద‌రు హోట‌ల్‌పై సస్పెన్ష‌న్ విధిస్తూ ఫుడ్ అండ్ డ్ర‌గ్స్ అడ్మినిస్టేష‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని తోసిపుచ్చింది. "మనం భారతదేశంలో ఉన్నాం. వాస్తవ పరిస్థితులను గ్రహించి ఆచరణాత్మకంగా వ్యవహరించాలి" అని ఎఫ్‌డీఏ (FDA) అధికారులను కోర్టు హెచ్చరించింది.

భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను ఉల్లంఘించే హోట‌ళ్ల‌పై మ‌హారాష్ట్ర‌ ఫుడ్ అండ్ డ్ర‌గ్స్ అడ్మినిస్టేష‌న్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇటీవ‌లే రాష్ట్ర‌వ్యాప్తంగా విస్తృతంగా త‌నిఖీలు చేప‌ట్టి.. దాదాపు 100కుపైగా హెట‌ళ్ల లైసెన్స్‌ల‌ను ర‌ద్దు చేసింది. లైసెన్స్ ర‌ద్దైన హోట‌ళ్ల‌లో పార్క్ ఇన్ బై రాడిసన్ హోటల్ కూడా ఉంది. ఆ హోట‌ల్‌లో నిర్వ‌హించిన త‌నిఖీల్లో వంటగది అంతా 95% నిబంధనల ప్రకారం పరిశుభ్రంగా ఉన్నప్ప‌టికీ ఆ ప్రాంతంలో కేవ‌లం రెండు కీటకాలు క‌నిపించాయ‌ని ఆ హోట‌ల్‌పై అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. ఎఫ్‌డీఏ చ‌ర్య‌ల‌పై స‌ద‌రు హోట‌ల్ యాజ‌మాన్యం న్యాయ‌పోరాటానికి దిగింది. త‌గిన కార‌ణాలు చెప్ప‌కుండా లైసెన్స్ ర‌ద్దు చేయ‌డాన్ని హైకోర్టులో స‌వాల్ చేసింది.

దీనిపై విచార‌ణ జ‌రిపిన చీఫ్ జస్టిస్ (ACJ) రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖద్‌లతో కూడిన ధర్మాసనం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పరిశుభ్రత, నిర్వహణపై సంతృప్తికరమైన నివేదిక వ‌చ్చిన‌ప్పుడు కేవ‌లం రెండు కీట‌కాలు క‌నిపించినంత మాత్రాన హోట‌ల్ లైసెన్స్ ర‌ద్దు చేయ‌డం స‌రికాద‌ని పేర్కొంది. గ‌త వారం త‌మ టేబుల్ మీద‌కు ఓ పెద్ద బొద్దింక వ‌చ్చింద‌ని.. ఇప్పుడు ఈగ వ‌చ్చింద‌ని విచార‌ణ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. ఇలాంటి స‌మ‌యంలో మ‌నం వాస్త‌వికంగా ఆలోచించాల‌ని అధికారుల‌కు సూచించింది.

ప్రజా భద్రత ముఖ్య‌మే అయినప్పటికీ.. అధికారుల తీరులో సాధారణ స్పృహ (Common sense) ఉండాలని కోర్టు హితవు పలికింది. ఈ మేర‌కు హోట‌ల్‌పై విధించిన స‌స్పెన్ష‌న్‌ను కోర్టు ర‌ద్దు చేసింది. ఆ హోటల్‌కు సంబంధించిన FSSAI లైసెన్స్‌ను వెంటనే పునరుద్ధరించాలని, వ్యాపార కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి అనుమతించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డిచే హోట‌ళ్లు, క్యాంటీన్ల‌లో త‌నిఖీలు చేప‌ట్టారా..? అని ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాదిని కోర్టు ప్ర‌శ్నించింది. గురువారం హైకోర్టు క్యాంటీన్‌లోనూ త‌నిఖీలు చేప‌ట్టి శుక్ర‌వారం నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది.

Also Read..

ప్ర‌ధాని రాజీనామా చేసి ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌గా మారాలి : అభిజీత్ దిప్కే

రాజ్య‌స‌భ ముందుకు పేప‌ర్ లీక్ బిల్లు

నేను హీరోయిన్ కావ‌డం మా అమ్మ‌కు ఇష్టం లేదు - భాగ్య‌శ్రీ బోర్సే కామెంట్స్

Advertisement
Advertisement