త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arvind Kejriwal | ప్ర‌ధానికి తెలియ‌కుండా ఇది అసాధ్యం.. రామాల‌య విరాళాల దుర్వినియోగంపై కేజ్రీవాల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Arvind Kejriwal | అయోధ్య రామాల‌య విరాళాల దుర్వినియోగం ఆరోప‌ణ‌ల‌పై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. వెలుగులోకి వస్తున్న విషయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయ‌న్నారు. శ్రీరాముని హారం, పాదుకలు, భక్తులు ఎంతో భక్తిభావంతో సమర్పించుకున్న‌ వజ్రాభరణాలు, 200 కిలోల వెండి ఇటుకలు, వెండి దీపాలు చోరీకి గురయ్యాయని చెప్పారు.

D

National | Published On Jul 3, 2026, 4.50 pm IST

Arvind Kejriwal | ప్ర‌ధానికి తెలియ‌కుండా ఇది అసాధ్యం.. రామాల‌య విరాళాల దుర్వినియోగంపై కేజ్రీవాల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
Advertisement
  • పైకి క‌నిపిస్తున్న‌ది గోరంత మాత్ర‌మే
  • శ్రీ‌రాముని హారం, పాదుక‌లు, వ‌జ్రాభ‌ర‌ణాలు చోరీ
  • స్కామ్ వెనుక ఉన్న వారిని ర‌క్షించే ప్ర‌య‌త్నం

Arvind Kejriwal | త్రినేత్ర‌.న్యూస్ : అయోధ్య రామాల‌య విరాళాల దుర్వినియోగం ఆరోప‌ణ‌ల‌పై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. ఈ కుంభ‌కోణంలో పైకి క‌నిపిస్తున్న‌ది గోరంత మాత్ర‌మేన‌ని.. దీని వెనుక చాలా పెద్ద క‌థే ఉంద‌ని వ్యాఖ్యానించారు. ఈ స్కామ్‌లో ఉన్న‌త స్థాయిలో ఉన్న వ్య‌క్తుల‌ను ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు.

2021 నుంచే ఈ చోరీలు మొద‌ల‌య్యాయి..

శుక్ర‌వారం విలేక‌రుల‌తో కేజ్రీ మాట్లాడుతూ.. "వెలుగులోకి వస్తున్న విషయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. శ్రీరాముని హారం చోరీకి గురైంది. పాదుకలు (పవిత్రమైన పాదరక్షలు) అపహరణకు గురయ్యాయి. భక్తులు ఎంతో భక్తిభావంతో సమర్పించుకున్న‌ వజ్రాభరణాలు, 200 కిలోల వెండి ఇటుకలు, వెండి దీపాలు చోరీకి గురయ్యాయి. కోట్ల రూపాయల నగదు అపహరణకు గురైంది. ఈ చోరీలు ఇటీవ‌లే కాలంలో మొదలైనవి కావు. అక్కడ భారీ భూ కుంభకోణం జరిగిన 2021లోనే ఇవి ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ప్రజల నుండి వందల కోట్ల రూపాయల విరాళాలు సేకరించారు" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

వాళ్లెవ‌రో దేశం మొత్తం తెలుసుకోవాల‌నుకుంటోంది..

ఈ చోరీకి బాధ్యులైన వారికి శిక్ష ప‌డుతుందా..? లేదా..? అనేది భగవాన్ రాముని ప్రతి భక్తుడి మనస్సులో ఇప్పుడు ఉన్న‌ అతిపెద్ద ప్ర‌శ్న అని కేజ్రీ అన్నారు. ఈ స్కామ్‌లో ఉన్న శ‌క్తివంత‌మైన వ్య‌క్తుల‌ను ర‌క్షించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని.. వాళ్లు ఎవ‌రో దేశం మొత్తం తెలుసుకోవాల‌నుకుంటోంద‌ని అన్నారు. ఈ వ్యవహారాన్ని అణచివేసే ప్రయత్నంలో భాగంగా కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేస్తున్నారని, సాక్షులను బెదిరిస్తున్నారని కేజ్రీవాల్‌ ఆరోపించారు.

ప్ర‌ధానికి తెలియ‌కుండా ఇది అసాధ్యం..

ఈ అక్ర‌మాల గురించి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి తెలియ‌ద‌నే వాద‌న‌ను కేజ్రీవాల్ తోసిపుచ్చారు. పీఎం నాయ‌క‌త్వంలోనే ఆల‌య ట్ర‌స్ట్ ఏర్పాటైంద‌ని, అందులో ఉన్న ప్ర‌తి స‌భ్యుడినీ ప్ర‌ధానే ఎంపిక చేశార‌ని చెప్పారు. ఆయ‌న‌కు తెలియ‌కుండా ఇన్నేళ్లుగా ఇలాంటి అక్ర‌మాలు సాగ‌డం అసాధ్య‌మ‌ని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

భారీ భూ కుంభ‌కోణం..

అదేవిధంగా ఆలయం కోసం జరిగిన భూ కొనుగోళ్లకు సంబంధించిన పాత ఆరోపణలను కూడా కేజ్రీవాల్ ఈ సంద‌ర్భంగా ప్రస్తావించారు. నిమిషాల వ్యవధిలోనే చేతులు మారిన భూములను, ట్రస్ట్ చాలా ఎక్కువ ధరలకు కొనుగోలు చేసిందని చెప్పారు. రూ. 2 కోట్ల విలువైన భూమిని కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఆలయ ట్రస్ట్ రూ.18 కోట్ల‌కు కొనుగోలు చేసింద‌న్నారు. రూ. 3 కోట్ల విలువైన భూమిని రూ. 24 కోట్లకు, రూ. 9 కోట్ల విలువైన భూమిని రూ. 55 కోట్లకు, రూ. 14 కోట్ల విలువైన భూమిని రూ. 95 కోట్లకు కొనుగోలు చేసిన‌ట్లు వివ‌రించారు.

8 నెల‌ల సీసీటీవీ ఫుటేజ్ డిలీట్‌..

కానుకల దొంగతనాలు పలుమార్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయని ఆయన ఆరోపించారు. బయటపడిన దొంగతనాలు కేవలం పైకి కనిపిస్తున్నది గోరంత మాత్రమే అని పేర్కొన్నారు. దాదాపు ఎనిమిది నెలల సీసీటీవీ ఫుటేజీని డిలీట్ చేశారని ఆయ‌న‌ ఆరోపించారు.

బాధ్యుల‌పై ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేదు..

ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (SIT) చట్టపరమైన అధికారం లేదని కేజ్రీ వ్యాఖ్యానించారు. "సిట్‌.. అనుమానితుల‌ను అరెస్ట్ చేయ‌లేదు. రైడ్స్ నిర్వ‌హించ‌లేదు. స‌మ‌న్లు కూడా జారీ చేయ‌లేదు. కింది స్థాయికి చెందిన ఎనిమిది మంది ఉద్యోగుల‌ను అరెస్ట్ చేసి.. రూ.80 ల‌క్ష‌లు రిక‌వ‌రీ చేసింది. కానీ, భారీ స్థాయిలో జ‌రిగిన ఆర్థిక అక్ర‌మాల‌కు బాధ్యులైన వారిపై ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేదు. ఆ డ‌బ్బులు ప్ర‌ధానికి చేరాయ‌ని మేము ఆరోపించ‌డం లేదు. అందుకు మా వ‌ద్ద ఎలాంటి ఆధారాలూ లేవు. కానీ జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే.. ఈ స్కామ్‌లో ఉన్న శ‌క్తిమంత‌మైన వ్య‌క్తుల‌ను కాపాడే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్లు అనిపిస్తోంది" అని కేజ్రీవాల్ ఆరోపించారు.

హిందూ స‌మాజం గ‌ళ‌మెత్తాలి..

ఈ అక్రమాల వల్ల కోట్లాది మంది రామభక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని కేజ్రీవాల్ అన్నారు. ఈ సమస్యపై భక్తులు, హిందూ సమాజ సభ్యులు గళమెత్తాలని ఆప్ అధినేత పిలుపునిచ్చారు.

Also Read..

పాఠశాలల సమీపంలో 'స్టింగ్' ఎనర్జీ డ్రింక్స్‌పై నిషేధం.. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు

గార్మిన్ కొత్త ఫోర్‌రన్నర్ సిరీస్.. ఏఐ ట్రైనింగ్, మ్యూజిక్‌తో మూడు స్మార్ట్‌వాచ్‌లు లాంచ్..

200 మిలియ‌న్ల వ్యూస్ - యూట్యూబ్‌లో నాని ఆయా షేర్ సాంగ్ రికార్డ్ - దుమ్మురేపుతున్న‌ తెలంగాణ పాట‌

Advertisement
Advertisement