త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Modi New Zealand Visit | వచ్చే వారం న్యూజిలాండ్‌కు మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది..!

Modi New Zealand Visit | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వచ్చే వారం తొలిసారిగా న్యూజిలాండ్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా భారత్-న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ముఖ్యంగా ఇరు దేశాలు ప్ర‌తిష్టాత్మ‌క స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.

P

National | Published On Jul 3, 2026, 3.57 pm IST

Modi New Zealand Visit | వచ్చే వారం న్యూజిలాండ్‌కు మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది..!
Advertisement

Modi New Zealand Visit | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వచ్చే వారం తొలిసారిగా న్యూజిలాండ్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా భారత్-న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ముఖ్యంగా ఇరు దేశాలు ప్ర‌తిష్టాత్మ‌క స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఈ విష‌యాన్ని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ప్ర‌క‌టించారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.

ఆర్థికాభివృద్ధికి ఊతం..

ఈ మేర‌కు 'ఎక్స్' వేదికగా స్పందించిన లక్సన్.. ప్రపంచంలోనే అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని చెప్పారు. భారత్‌తో సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే కీలక ఘట్టంగా ఈ పర్యటన నిలవనుందన్నారు. ఏప్రిల్‌లో కుదిరిన భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశాల భాగస్వామ్యం కొత్త దశలోకి ప్రవేశించిందన్నారు. ఈ ఒప్పందం ద్వారా న్యూజిలాండ్‌లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఎగుమతులు, ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత మార్కెట్‌లో వస్తువులు, సేవల ఎగుమతులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని, తద్వారా న్యూజిలాండ్ ప్రజలకు ఆదాయం, ఉద్యోగాలు, వేతనాలు పెరుగుతాయని లక్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొద్ది నెలల క్రితం క్రిస్టోఫర్ లక్సన్ భారత్‌లో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని ఇచ్చిప్పుకునే విష‌యంపై అప్ప‌ట్లో చ‌ర్చించారు.

ద్వైపాక్షిక సంబంధాలకు ఎఫ్‌టీఏ కీలకం

భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల సంబంధాల్లో కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎఫ్‌టీఏ చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. మార్కెట్ ప్రాప్యత, వ్యవసాయ ఉత్పాదకత, పెట్టుబడులు, నైపుణ్య కలిగిన మానవ వనరుల రాకపోకలు, పర్యాటకం, క్రీడలు, ప్రజల మధ్య పరస్పర సంబంధాల విస్తరణ వంటి అనేక రంగాల్లో ఈ ఒప్పందం సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఈ ఒప్పందంతో తయారీ రంగం, రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, మహిళా పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, నైపుణ్యం కలిగిన నిపుణులకు కొత్త అవకాశాలు లభించే అవ‌కాశాలున్నాయి. మే 6న న్యూజిలాండ్ వాణిజ్య, పెట్టుబడుల మంత్రి టాడ్ మెక్‌క్లే మాట్లాడుతూ.. నాణ్యమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే వచ్చే కొన్నేళ్లలో భారత్-న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెండింతలు పెరిగే అవకాశముందని తెలిపారు. న్యూజిలాండ్ వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు, సేవలు అందించడంతో పాటు భారత మార్కెట్‌లోకి ప్రవేశం మరింత సులభతరమ‌వుతుంద‌ని పేర్కొన్నారు. అలాగే వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో సుమారు 20 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాలని న్యూజిలాండ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

మోదీ పర్యటనపై భారీ అంచనాలు

ప్రధాని మోదీ న్యూజిలాండ్ పర్యటనతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలకు మ‌రింత ఊతం ల‌భించే అవ‌కాశాలున్నాయి. అలాగే రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాలు దృష్టి సారించే అవకాశం ఉంది. పెట్టుబడుల విస్తరణ, వాణిజ్యాభివృద్ధి, నైపుణ్య కలిగిన ఉద్యోగుల రాకపోకలకు మరింత సౌలభ్యం కల్పించడం, పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం వంటి అంశాలు ఈ పర్యటనలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా ఎదుగుతున్న నేపథ్యంలో భారత భాగస్వామ్యాన్ని దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి కీలకంగా న్యూజిలాండ్ భావిస్తోంది.

Advertisement
Advertisement