త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | క్ష‌మాప‌ణ‌లు చెప్తారా..? చ‌ర్య‌లు ఎదుర్కొంటారా..? మెటాకు కేంద్రం అల్టిమేటం

PM Modi | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) వీడియో తొల‌గింపు ఘ‌ట‌న‌పై మెటాకు కేంద్రం అల్టిమేటం (ultimatum) జారీ చేసింది. సంస్థ సీఈవో మార్క్‌జుక‌ర్ బ‌ర్గ్ (Mark Zuckerberg) మూడు రోజుల్లోగా బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని స్ప‌ష్టం చేసింది. లేదంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది.

D

National | Published On Aug 5, 2026, 11.52 am IST

PM Modi | క్ష‌మాప‌ణ‌లు చెప్తారా..? చ‌ర్య‌లు ఎదుర్కొంటారా..? మెటాకు కేంద్రం అల్టిమేటం
Advertisement

PM Modi | త్రినేత్ర‌.న్యూస్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియోను ఫేస్‌బుక్‌లో కొద్దిసేపు తొలగించిన ఘటనను కేంద్రం సీరియ‌స్‌గా తీసుకుంది. ఈ విష‌యంలో మెటా (Meta) అధికారుల‌కు ఇప్ప‌టికే స‌మ‌న్లు జారీ చేసిన కేంద్ర స‌ర్కార్‌.. ఇప్పుడు ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg)కు కీల‌క హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

ఈ ఘ‌ట‌న‌కు గానూ మూడు రోజుల్లోగా బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మెటా సీఈవోకు అల్టిమేటం (ultimatum) జారీ చేసింది. లేదంటే చ‌ర్య‌లు ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించింది. అంతేకాదు, బాధ్యులైన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది. మూడు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ఫేస్‌బుక్‌కు ప్రస్తుతం ఉన్న ‘సేఫ్ హార్బర్’ రక్షణను తొలగిస్తామ‌ని పార్లమెంట్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ స్ప‌ష్టం చేసింది. జుక‌ర్‌బ‌ర్గ్ బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. లేదంటే ఆయ‌న‌పై కేసు న‌మోద‌వుతుంద‌ని వార్నింగ్ ఇచ్చింది.

సీజేపీ ఆందోళ‌నల స‌మ‌యంలో విద్యార్థి నిర‌స‌న‌కారుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ప్ర‌సంగించిన ఓ వీడియో ఫేస్‌బుక్ (Facebook) నుంచి తొల‌గించ‌డం (Modis selfie video removed) వివాదాస్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఆ వీడియోని మెటా పున‌రుద్ధ‌రించిన‌ప్ప‌టికీ ఈ ఘ‌ట‌న అప్ప‌టికే తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా పరిగ‌ణించిన కేంద్రం వివ‌ర‌ణ కోరుతూ మెటా ప్ర‌తినిధుల‌కు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత మెటా ప్రతినిధులు ప్రభుత్వానికి వివరణ ఇచ్చి, ప్రముఖ ఖాతాలకు అదనపు పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన అసభ్యకర కంటెంట్‌ ప్రకటనల రూపంలో కనిపిస్తున్న వ్యవహారంపైనా కేంద్రం సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకుంది. ఈ విష‌యంలో మెటాకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చింది. ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ మరోసారి హెచ్చరిక జారీ చేసింది.

గూగుల్, యూట్యూబ్, ఎక్స్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ సహా అన్ని సోషల్ మీడియా వేదికలు చిన్నారులపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్‌ను కట్టడి చేసే నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కమిటీ స్పష్టం చేసింది. ఉల్లంఘనలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Also Read..

హ‌రీశ్ రావుపై వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నా..: అద్దంకి ద‌యాక‌ర్‌

ఒక్క రోజులోనే రూ.17వేలు పెరిగిన బంగారం ధ‌ర‌.. బులియ‌న్ మార్కెట్ల‌లో కొనుగోళ్ల జోరు..

కృష్ణాన‌దికి పోటెత్తిన వ‌ర‌ద‌.. సంగ‌మేశ్వ‌ర ఆల‌యం పూర్తిగా జలాధివాసం.. ఫొటోలు

Advertisement
Advertisement