త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiren Rijiju | అమిత్ షా పేరు వింటేనే ఉగ్ర‌వాదుల ఒంట్లో వ‌ణుకు.. ప్ర‌తిప‌క్షాల‌కు కిర‌ణ్ రిజుజు స్ట్రాంగ్ వార్నింగ్‌

Kiren Rijiju | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో (Parliament Monsoon Session) విప‌క్ష ఎంపీల నిర‌స‌న‌ల‌పై కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. అమిత్‌ షా ప్రతిరోజూ సభకు హాజరవుతారని చెప్పారు. ఆయ‌న మాట్లాడిన‌ప్పుడు ఇచ్చే స‌మాధానం విని ప్ర‌తిప‌క్షం త‌ట్టుకోలేద‌ని హెచ్చ‌రించారు. షా పేరు వింటేనే టెర్ర‌రిస్టుల ఒంట్లో వ‌ణుకు పుడుతుంద‌ని వ్యాఖ్యానించారు.

D

National | Published On Aug 7, 2026, 3.50 pm IST

Kiren Rijiju | అమిత్ షా పేరు వింటేనే ఉగ్ర‌వాదుల ఒంట్లో వ‌ణుకు.. ప్ర‌తిప‌క్షాల‌కు కిర‌ణ్ రిజుజు స్ట్రాంగ్ వార్నింగ్‌
Advertisement

Kiren Rijiju | త్రినేత్ర‌.న్యూస్ : పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో (Parliament Monsoon Session) వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతోంది. నీట్ పేప‌ర్ లీక్‌, విద్యార్థుల‌పై లాఠీఛార్జ్‌, పెల్లెట్ గ‌న్స్ ప్ర‌యోగం, అయోధ్య విరాళాల అంశంపై ఇండీ కూట‌మి ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌డుతున్నారు. ముఖ్యంగా జులై 20న సీజేపీ ఆందోళ‌న‌ల‌ సంద‌ర్భంగా విద్యార్థి నిర‌స‌న‌కారుల‌పై పోలీసుల చ‌ర్య‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స‌భ‌కు వ‌చ్చి మాట్లాడాల‌ని, విద్యార్థుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అమిత్ షా వ‌చ్చే వ‌ర‌కూ నిర‌స‌న‌లు కొన‌సాగిస్తామ‌ని తేల్చి చెబుతున్నారు. ఈ అంశంపై పార్ల‌మెంట్ లోప‌లా, బ‌య‌ట త‌మ నిర‌స‌న‌లు కొన‌సాగిస్తున్నారు. విప‌క్షాల ఆందోళ‌నల‌తో నేడు కూడా ఉభ‌య‌స‌భ‌లు సోమ‌వారానికి వాయిదా ప‌డ్డాయి.

షా స‌మాధానం విని మీరు త‌ట్టుకోలేరు

విప‌క్ష ఎంపీల నిర‌స‌న‌ల‌పై పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. అమిత్‌ షా ప్రతిరోజూ సభకు హాజరవుతారని చెప్పారు. ఆయ‌న మాట్లాడిన‌ప్పుడు ఇచ్చే స‌మాధానం విని ప్ర‌తిప‌క్షం త‌ట్టుకోలేద‌ని హెచ్చ‌రించారు. అమిత్ షాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న నినాదాలను రిజుజు తీవ్రంగా తప్పుబట్టారు. అమిత్ షా పేరు వింటేనే ఉగ్ర‌వాదులు, తీవ్ర‌వాదుల ఒంట్లో వ‌ణుకు పుడుతుంద‌ని వ్యాఖ్యానించారు.

"ప్ర‌తిప‌క్షాలు స‌భ‌లో ఏదో ఒక గొడ‌వ సృష్టించి వెళ్లిపోతారు. హోంమంత్రి అమిత్ షా ఉద‌యాన్నే పార్ల‌మెంట్‌కు వ‌చ్చి రాత్రి పొద్దుపోయాక వెళ్లిపోతారు. ఆయ‌న రోజంతా పార్ల‌మెంట్‌లోనే ఉంటున్నారు. సభలో కూడా నేను ఇదే విషయాన్ని చెప్పాను. కానీ ప్ర‌తిప‌క్షాలే ఈ విష‌యంపై అన‌వ‌స‌రంగా రాద్దాంతం చేస్తున్నాయి. ప్ర‌తిప‌క్షాల తీరు స‌రికాదు. స‌భ‌లో చ‌ర్చ ప్రారంభ‌మై అమిత్ షా స‌మాధానం ఇస్తే అది విని మీరు త‌ట్టుకోలేరు. ఆయ‌న పేరు వింటే ఉగ్ర‌వాదులు, తీవ్ర‌వాదులే భ‌య‌ప‌డ‌తారు" అని రిజుజు తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు.

మంత్రి స‌భ‌కు రావ‌డాన్ని మీరు డిసైడ్ చేయ‌లేరు..

అమిత్ షా స‌భ‌కు రావాల‌న్న ప్ర‌తిప‌క్షాల డిమాండ్‌ను రిజుజు తోసిపుచ్చారు. ఏ మంత్రికైనా సంబంధించిన అంశం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆ మంత్రి స‌భ‌కు హాజ‌ర‌వుతార‌ని స్ప‌ష్టం చేశారు. "ఏ మంత్రి సభకు రావాలి, ఒక నిర్దిష్ట అంశంపై ఏ మంత్రి మాట్లాడాలో నిర్ణ‌యించే అధికారం ప్ర‌తిప‌క్షానికి లేదు. ఆ విష‌యాన్ని చైర్మ‌న్‌, ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంది" అని రిజుజు పేర్కొన్నారు.

పార్ల‌మెంట్ కార్య‌క‌లాపాలు సాగుతున్నాయ్‌

అదే స‌మ‌యంలో పార్ల‌మెంట్ స‌మావేశాలు ముందుకు సాగ‌డం లేద‌న్న వాద‌న‌ను రిజుజు తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని స్ప‌ష్టం చేశారు. విప‌క్ష ఎంపీలు స‌భ‌లో నిర‌స‌న‌లు చేస్తూ గంద‌ర‌గోళం సృష్టిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. వారి ఆందోళ‌న కార‌ణంగా చ‌ర్చ‌లు త‌క్కువ‌గా జ‌రుగుతున్న‌ట్లు చెప్పారు. అయితే, శాస‌న‌ప‌ర‌మైన కార్య‌క‌లాపాలు కొన‌సాగుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్డీయే కూట‌మి ఎంపీలంతా చ‌ర్చ‌ల్లో పాల్గొని త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్న‌ట్లు చెప్పారు. బిల్లులకు కూడా ఆమోదం ల‌భిస్తోంద‌న్నారు.

అలాంటి ప్ర‌తిపాద‌న లేదు

ఇక పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల‌పై కూడా రిజుజు స్ప‌ష్ట‌త‌నిచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కూ అలాంటి ప్ర‌తిపాద‌న ప్ర‌భుత్వం వ‌ద్ద లేద‌న్నారు. వ‌ర్షాకాల స‌మావేశాలు ఇప్ప‌టికే జ‌రుగుతున్నాయ‌ని.. ఈ ద‌శ‌లో మ‌రో ప్ర‌త్యేక స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌డం గురించి మాట్లాడ‌టంలో అర్థ‌మే లేద‌న్నారు.

Also Read..

యువ‌తే దేశానికి బ‌ల‌మైన శ‌క్తి.. జెన్‌జీ విష‌యంలో స్వ‌రం మార్చిన కంగ‌న‌

ఈ మూడు తెలంగాణ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు.. హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ‌శాఖ‌..!

విద్యార్థులు, ఉద్యోగులకు హెచ్‌పీ ప్ర‌త్యేక ట్యాబ్‌.. ఉచిత ఏఐ స‌బ్‌స్క్రిప్ష‌న్‌..

Advertisement
Advertisement