త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TMC MPs | మ‌మ‌తా బెన‌ర్జీకి బిగ్ షాక్‌.. ఎన్డీయేకి మ‌ద్ద‌తిస్తూ స్పీక‌ర్‌కు లేఖ రాసిన 20 మంది టీఎంసీ ఎంపీలు

TMC MPs | ప‌శ్చిమ‌ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి బిగ్ షాక్ తగిలింది. దాదాపు 20 మంది టీఎంసీ లోక్‌స‌భ ఎంపీలు (TMC MPs) బీజేపీతో చేతులు క‌లిపేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు లేఖ స‌మ‌ర్పించారు.

D

National | Published On Jun 8, 2026, 5.03 pm IST

TMC MPs | మ‌మ‌తా బెన‌ర్జీకి బిగ్ షాక్‌.. ఎన్డీయేకి మ‌ద్ద‌తిస్తూ స్పీక‌ర్‌కు లేఖ రాసిన 20 మంది టీఎంసీ ఎంపీలు
Advertisement

TMC MPs | ప‌శ్చిమ‌ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి బిగ్ షాక్ తగిలింది. దీదీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్‌లో భారీ కుదుపు చోటు చేసుకుంది. దాదాపు 20 మంది టీఎంసీ లోక్‌స‌భ ఎంపీలు బీజేపీతో చేతులు క‌లిపేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు (Lok Sabha Speaker Om Birla) లేఖ స‌మ‌ర్పించారు. తాము నేష‌న‌ల్ డెమోక్ర‌టిక్ అల‌య‌న్స్ (ఎన్డీయే)లో చేరాల‌నుకుంటున్న‌ట్లు అందులో పేర్కొన్నారు. ఈ రెబ‌ల్ వ‌ర్గానికి ఎంపీ కాకొలి ఘోష్ దస్తీదార్ (Kakoli Ghosh Dastidar) నాయ‌క‌త్వం వ‌హించారు. వారంతా రాజీనామాల‌కు కూడా సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

అంతకుముందు రెబ‌ల్ ఎంపీలంతా ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లో గ‌ల‌ కేంద్రమంత్రి, బీజేపీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ భూపేంద్ర యాదవ్‌ నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీకి బెంగాల్‌ సీఎం సువేందు అధికారి కూడా హాజ‌ర‌య్యారు. సహచర ఎంపీ అభిషేక్ బెనర్జీ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌ను కూడా ఈ తిరుగుబాటు ఎంపీలు పట్టించుకోలేదని వర్గాలు పేర్కొన్నాయి. ఆ స‌మ‌యంలో వారంతా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్న‌ట్లుగా తెలిసింది. ప్ర‌స్తుతం ఇండీ కూట‌మి స‌మావేశం కోసం దీదీ ఢిల్లీలో ఉన్న స‌మ‌యంలోనే ఈ ప‌రిణామం చోటు చేసుకుంది.

రాజ్య‌స‌భ ఎంపీ సుఖేందు శేఖర్ రాజీనామా..

అంత‌కు ముందు పార్టీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ (Sukhendu Sekhar Ray) టీఎంసీకి గుడ్‌బై చెప్పారు. తృణమూల్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాదు త‌న రాజ్య‌స‌భ ప‌ద‌వికి (Rajya Sabha MP) కూడా ఆయ‌న‌ రాజీనామా చేశారు. ఇవాళ ఉద‌యం పార్ల‌మెంట్‌కు చేరుకుని త‌న రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దీదీ నేతృత్వంలోని తృణమూల్ పాలనలో అడ్డూ అదుపూ లేని అవినీతి జరిగిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. "అడ్డూ అదుపూ లేని అవినీతి. మహిళలపై జరిగిన దారుణాలు.. ఆరోగ్యం, విద్య, పరిశ్రమలు, శాంతిభద్రతలు, ఉపాధి వంటి రంగాల్లో ఘోర వైఫల్యంతో విసిగిపోయిన బెంగాల్ ప్ర‌జ‌లు.. తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల అరాచక పాలనకు స్వస్తి పలికారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా బీజేపీకి అనుకూలంగా భారీ తీర్పును ఇచ్చారు" అని రాయ్ పేర్కొన్నారు. ప్ర‌జ‌లు ఇచ్చిన ఈ చారిత్రాత్మ‌క తీర్పును గౌర‌విస్తూ.. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి, తృణ‌మూల్ కాంగ్రెస్ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా సువేందు అధికారి నేతృత్వంలో కొత్త‌గా ఏర్ప‌డిన బీజేపీ ప్ర‌భుత్వానికి శుభ‌కాంక్ష‌లు తెలిపారు.

అసెంబ్లీలో ఇప్పటికే రెబల్స్ హవా

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం తర్వాత టీఎంసీలో అసమ్మతి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ రెండుగా చీలిపోయింది. ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ (Ritabrata Banerjee) నేతృత్వంలో 60 మంది రెబల్ ఎమ్మెల్యేలు తమదే అసలైన టీఎంసీగా ప్రకటించుకున్నారు. అంతేకాకుండా మమతా బెనర్జీ ఎంపిక చేసిన నేతను కాదని, స్పీకర్ సైతం రితబ్రత బెనర్జీనే ప్రతిపక్ష నేతగా (Leader of Opposition) గుర్తించడం గమనార్హం.

Also Read..

ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాలి.. SIRపై సీజేఐకి లేఖ.. ఇండీ కూట‌మి కీల‌క నిర్ణ‌యాలు

అంత గ్యాప్ ఎందుకు? - రెమ్యూన‌రేష‌న్‌లో వివ‌క్ష‌పై కాజ‌ల్ అగ‌ర్వాల్ కామెంట్స్‌

శ‌ర‌వేగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ అభివృద్ధి ప‌నులు.. ఇప్ప‌టికే 64శాతం పూర్తి

Advertisement
Advertisement