త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jitendra Singh | యూపీఏ హ‌యాంలోనే పేప‌ర్ లీక్‌లు.. అప్పుడెందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు..? : జితేంద్ర సింగ్

Jitendra Singh | యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌స‌భ‌లో చ‌ర్చ మొద‌లైంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) ఈ బిల్లుపై చ‌ర్చ ప్రారంభించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లును ఎన్డీయే ప్ర‌భుత్వ‌మే మొద‌ట ప్ర‌వేశ‌పెట్టింద‌ని చెప్పారు. విద్యార్థులు, యువత పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ బిల్లు నిదర్శనం అని అన్నారు. స్వతంత్ర భారతదేశ‌ చరిత్రలోనే ఈ బిల్లు ఒక మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.

D

National | Published On Jul 28, 2026, 3.57 pm IST

Jitendra Singh | యూపీఏ హ‌యాంలోనే పేప‌ర్ లీక్‌లు.. అప్పుడెందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు..? : జితేంద్ర సింగ్
Advertisement

Jitendra Singh | దేశవ్యాప్తంగా జ‌రిగే నీట్‌, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలు (Paper leaks), అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026' (యాంటీ పేపర్ లీక్ బిల్లు)పై లోక్‌స‌భ‌లో చ‌ర్చ మొద‌లైంది. ఈ బిల్లుపై చ‌ర్చ‌కు ప్ర‌భుత్వం 10 గంట‌ల స‌మ‌యం కేటాయించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) ఈ బిల్లుపై చ‌ర్చ ప్రారంభించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లును ఎన్డీయే ప్ర‌భుత్వ‌మే మొద‌ట ప్ర‌వేశ‌పెట్టింద‌ని చెప్పారు. విద్యార్థులు, యువత పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ బిల్లు నిదర్శనం అని అన్నారు. స్వతంత్ర భారతదేశ‌ చరిత్రలోనే ఈ బిల్లు ఒక మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.

ఎన్డీయే అధికారంలోకి రాక‌ముందే దేశంలో పేప‌ర్ లీక్‌లు జ‌రిగాయ‌ని ఈ సంద‌ర్భంగా జితేంద్ర సింగ్ తెలిపారు. "యూపీఏ ప్ర‌భుత్వ‌ హయాంలో ఎన్నోసార్లు పేపర్ లీకేజీలు జరిగాయి. 2009లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, 2010లో యూపీలో బీఈడీ పేపర్ లీకేజీ, 2011లో ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, 2012లో ఎయిమ్స్ (AIIMS) ఢిల్లీ ప్రవేశ పరీక్షా పత్రం, 2012లో తమిళనాడులో పబ్లిక్ సర్వీస్ కమిషన్, బెంగాల్‌లో జాయింట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప‌రీక్ష పేప‌ర్ లీకేజీలు జ‌రిగాయి. పేప‌ర్ లీక్‌ల క‌ట్టడికి 1992, 2010లో ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. ఆ ప్ర‌య‌త్నాలు ఎందుకు పూర్తికాలేదో ఆనాటి పాల‌కులే స‌మాధానం చెప్పాలి" అని జితేంద్ర సింగ్ డిమాండ్ చేశారు.

పేపర్ లీకేజీలు వ్యవస్థాగత నేరాలుగా మారాయన్నారు. వీటిని అరిక‌ట్టేందుకే చ‌ట్టాల్లో కీల‌క మార్పులు చేస్తున్న‌ట్లు చెప్పారు. 2024కి ముందు పేప‌ర్ లీక్‌ల‌పై స‌మ‌గ్ర చ‌ట్టం లేద‌ని తెలిపారు. ఏళ్లుగా సాగుతున్న ఈ స‌మ‌స్యను గుర్తించి ప‌రిష్కారానికి త‌మ‌ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌న్నారు. పరీక్షలను మరింత పారదర్శకంగా మార్చేందుకు, విద్యార్థుల నిజాయితీ, శ్ర‌మ‌కు ప్రతిఫలం దక్కేలా చేయడానికి, వారి భవిష్యత్తును రక్షించడానికి తీసుకొచ్చిన ఈ బిల్లు ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మ‌ని వివ‌రించారు. పేప‌ర్ లీకేజీ ఘ‌ట‌న‌ల్లో క‌ఠిన శిక్ష అమ‌లు చేసేందుకు పేప‌ర్ లీకేజీ నిరోధ‌క బిల్లులో స‌వ‌ర‌ణ చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. దోషుల‌కు శిక్ష‌ను ప‌దేళ్ల‌కు, లీకేజీ గ్యాంగ్‌ల‌కు జ‌రిమానాను రూ.కోటి నుంచి రూ.10 కోట్ల‌కు పెంచిన‌ట్లు చెప్పారు. ముఖ్యంగా కేసుల విచార‌ణ‌కు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిన‌ట్లు జితేంద్ర సింగ్ వివ‌రించారు.

చ‌ట్టంలోని కీల‌క స‌వ‌ర‌ణ‌లు ఇవే..

దేశవ్యాప్తంగా జ‌రిగే నీట్‌, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026' (యాంటీ పేపర్ లీక్ బిల్లు)ను సోమ‌వారం పార్లమెంటు ముందుకు తెచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే అమల్లో ఉన్న 2024 చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ ఈ ముసాయిదాను రూపొందించారు. ఈ బిల్లులో కేంద్రం కీల‌క మార్పులకు ప్ర‌తిపాదించింది. ఈ తరహా కేసులను వేగంగా విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

లీకేజీలు, అవకతవకలకు పాల్పడే వ్యక్తులకు విధించే గరిష్ఠ జైలు శిక్షను ఐదేళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచారు. నిందితులకు విధించే గరిష్ఠ జరిమానాను రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచారు. వ్య‌వ‌స్థీకృత నేరాల‌కు క‌నీసం ఏడేళ్ల జైలు శిక్ష‌, రూ.10 కోట్ల జ‌రిమానా ప‌డుతుంది. అక్రమాలకు పాల్పడే సర్వీస్ ప్రొవైడర్లు లేదా ప్రైవేట్ పరీక్షా ఏజెన్సీలకు రూ. 5 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు ఎనిమిదేళ్ల పాటూ పరీక్షలు నిర్వహించకుండా నిషేధం విధిస్తారు. ఆయా కేసుల్లో ఛార్జిషీట్ దాఖ‌లు చేసిన మూడు నెల‌ల్లోనే విచార‌ణ పూర్తి చేయాల‌ని ప్ర‌తిపాదించారు. ఈ కేసుల విచారణ కోసం అవ‌స‌ర‌మైతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ప్రత్యేక దర్యాప్తు చేపట్టనుంది.

Also Read..

విద్యార్థిని టీచర్ మందలించడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు : రాజ‌స్థాన్ హైకోర్టు

లండ‌న్ వీధుల్లో బోనాల జాత‌ర‌.. ప్ర‌త్యేక్ష ఆక‌ర్ష‌ణ‌గా తొట్టెల ఊరేగింపు

రాష్ట్ర‌మంతా బీజేపీ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది.. నెక్స్ట్‌ అధికారం మాదే

Advertisement
Advertisement