త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanjay Malhotra | పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు తప్పదు.. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ కీల‌క హెచ్చ‌రిక‌లు

Sanjay Malhotra | మధ్యప్రాచ్యంలో (Middle East) ఉద్రిక్తతలు మరికొంత కాలం కొనసాగితే.. భార‌త్‌లో పెట్రోల్‌, డీజిల్ పెంపు (petrol, diesel prices) తప్పదని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ (RBI governor) సంజయ్‌ మల్హోత్రా (Sanjay Malhotra) హెచ్చ‌రించారు.

D

Business | Published On May 13, 2026, 2.52 pm IST

Sanjay Malhotra | పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు తప్పదు.. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ కీల‌క హెచ్చ‌రిక‌లు
Advertisement

Sanjay Malhotra | ప‌శ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు భార‌త్‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో పెట్రోల్ వాడ‌కాన్ని త‌గ్గించాలంటూ ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచ‌న‌లు ఈ ఆందోళ‌న‌ల‌ను మ‌రింత పెంచాయి. మోదీ సూచ‌న‌ల‌తో దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారం వేళ ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ (RBI governor) సంజయ్‌ మల్హోత్రా (Sanjay Malhotra) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మధ్యప్రాచ్యంలో (Middle East) ఉద్రిక్తతలు మరికొంత కాలం కొనసాగితే.. భార‌త్‌లో పెట్రోల్‌, డీజిల్ పెంపు (petrol, diesel prices) తప్పదని హెచ్చ‌రించారు.

స్విట్జర్లాండ్‌లో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో సంజ‌య్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఇరాన్‌ యుద్ధం సుదీర్ఘ కాలం కొన‌సాగితే.. ముడి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆ ధ‌ర‌ల భారాన్ని ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌పై వేయ‌క త‌ప్ప‌దు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై విధించే ఎక్సైజ్ సుంకాల‌ను తగ్గించింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు న‌ష్టాల‌ను భ‌రిస్తూ.. ధరలను అదుపులో ఉంచుతున్నాయి. ఈ ప‌రిస్థితి ఎక్కువ కాలం కొన‌సాగ‌డం క‌ష్టం. ముడి చమురు ధరలు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ముఖ్యంగా రవాణా ఖర్చులు పెరగడం వల్ల వస్తువుల ధరలు కూడా అధికమై ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది అని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ముప్పు త‌ప్ప‌దా..?

ఏప్రిల్‌లో భార‌త ద్ర‌వ్యోల్బ‌ణం 3.48 శాతానికి చేరింది. ఇది మార్చిలో 3.40 శాతంగా ఉంది. ప్ర‌భుత్వం చ‌మురు ధ‌ర‌ల భారాన్ని భ‌రించ‌డం వ‌ల్ల ఇది అంచ‌నాల కంటే త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ.. మ‌ధ్య‌ప్రాచ్య సంక్షోభం వ‌ల్ల ఇంధ‌న ధ‌ర‌లు పెరిగితే ముప్పు పొంచి ఉంద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ హెచ్చ‌రించారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో భార‌త్ 6.9% వృద్ధిని నమోదు చేస్తుందని, ద్ర‌వ్యోల్బ‌ణం స‌గ‌టున 4.6% ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. అయితే, యుద్ధం కారణంగా వృద్ధి నెమ్మదించి, ద్రవ్యోల్బణం పెర‌గొచ్చ‌ని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

మ‌రోవైపు ఏప్రిల్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఆర్బీఐ త‌న కీల‌క రెపో రేటును 5.25 శాతం వ‌ద్దే స్థిరంగా ఉంచిన విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో గ‌ణాంకాల‌ను బ‌ట్టి నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. త‌దుప‌రి ద్ర‌వ్య ప‌ర‌ప‌తి స‌మీక్షా స‌మావేశం జూన్ 5న జ‌ర‌గ‌నుంది. అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి వ‌డ్డీ రేట్ల‌పై నిర్ణ‌యం తీసుకోనున్నారు.

విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడానికి దేశ ప్ర‌జ‌లు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని అదేవిధంగా బంగారం కొనుగోళ్లను ఏడాది పాటూ వాయిదా వేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన విష‌యం తెలిసిందే. మోదీ సూచ‌న‌ల నేప‌థ్యంలో ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Also Read..

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుద‌ల‌.. ఉత్తీర్ణ‌త‌లో బాలిక‌ల‌దే పైచేయి

కొండెక్కిన కోడి ధ‌ర‌.. కిలో చికెన్ @ 400

బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన విజ‌య్ ప్ర‌భుత్వం

Advertisement
Advertisement