త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana SIR Process | “ఒక వ్యక్తికి ఒకే ఓటు” కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని, జులై 24 గడువును పెంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై త్వరలో ఈసీని కలవనున్నట్లు బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.

J

Telangana | Published On Jul 6, 2026, 8.00 pm IST

Telangana SIR Process | “ఒక వ్యక్తికి ఒకే ఓటు” కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
Advertisement
  • తెలంగాణలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) గడువును పొడిగించాలని కేటీఆర్ డిమాండ్
  • ఇప్పటివరకు కేవలం 7 శాతం ఫారాలు మాత్రమే నింపారని, జులై 24లోగా మిగతా 93 శాతం పూర్తికావడం అసాధ్యమని వెల్లడి
  • 'ఒక వ్యక్తికి ఒకే ఓటు' విధానాన్ని అమలు చేయాలని కోరుతూ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందం
  • SIR ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా బీఆర్ఎస్ సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగింత

Telangana SIR Process | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియ గడువును కచ్చితంగా పొడిగించాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. 'ఒక వ్యక్తికి ఒకే ఓటు' విధానాన్ని దేశవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని ఆయన కోరారు. శనివారం తెలంగాణ భవన్‌లో SIR ప్రక్రియపై బీఆర్ఎస్ ప్రత్యేక కమిటీ సభ్యులతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

KTR Demands Extension of SIR Deadline BRS Team to Meet Central EC

7 శాతమే పూర్తయింది.. మిగతాది ఎలా?

క్షేత్రస్థాయిలో SIR ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో ఎన్నికల సంఘం నియమించిన బీఎల్ఓ (BLO)లు చాలా చోట్ల విఫలమవుతున్నారని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. "బీఎల్ఓలు ఇచ్చిన SIR ఫారాలను ఇప్పటివరకు కేవలం 7 శాతం మంది మాత్రమే నింపి ఇచ్చారు. జులై 24వ తేదీతో గడువు ముగుస్తోంది. ఆలోగా మిగతా 93 శాతం ప్రక్రియ పూర్తి కావడం అనుమానమే. కాబట్టి క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా SIR గడువును పొడిగించాల్సిందే" అని ఆయన స్పష్టం చేశారు.

KTR Demands Extension of SIR Deadline BRS Team to Meet Central EC

ఈసీకి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి బీఆర్ఎస్ టీమ్

ఓటర్ల డూప్లికేషన్‌పై (Duplication) ఆందోళన వ్యక్తం చేసిన కేటీఆర్.. ఒకే వ్యక్తి పేరు వివిధ రాష్ట్రాల ఓటర్ల జాబితాల్లో ఉంటున్నా ఈసీ పట్టించుకోవడం లేదన్నారు. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండాలనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి (CEO) వినతిపత్రం ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఇదే అంశంపై త్వరలోనే బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని (Central Election Commission) కలుస్తుందని వెల్లడించారు.

KTR Demands Extension of SIR Deadline BRS Team to Meet Central EC

బీఎల్ఏల పనితీరు భేష్..

బీఆర్ఎస్ తరఫున రాష్ట్రవ్యాప్తంగా నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) చురుకుగా పనిచేస్తున్నారని కేటీఆర్ అభినందించారు. ఇప్పటివరకు 93కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారికి అవగాహన సమావేశాలు నిర్వహించామని, మిగతా చోట్ల కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. అనర్హుల పేర్లను జాబితా నుంచి ఏరివేసేలా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌ల నియామకం

SIR ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా బీఆర్ఎస్ కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించారు.

  • కరీంనగర్: ఎమ్మెల్సీ ఎల్. రమణ
  • నల్లగొండ: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
  • రంగారెడ్డి: మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
  • ఖమ్మం: సోమా భరత్ కుమార్ (పార్టీ ప్రధాన కార్యదర్శి)
  • మెదక్: మన్నె క్రిశాంక్
  • వరంగల్: వై. సతీష్ రెడ్డి
  • మహబూబ్ నగర్: అభిలాష్ రంగినేని
  • ఆదిలాబాద్: ముజీబ్
  • నిజామాబాద్: సుమిత్రానంద్

 

Advertisement
Advertisement