త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | రాముడి పేరుతో దోచుకున్నందుకు బీజేపీ క్షమాపణ చెప్పాలి

అయోధ్య రామాలయ విరాళాల్లో అవినీతి జరిగిందని మంత్రి పొన్నం ఆరోపించారు. రాముడి పేరుతో దోపిడీకి పాల్పడిన బీజేపీ దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

J

Karimnagar | Published On Jul 6, 2026, 7.30 pm IST

Ponnam Prabhakar | రాముడి పేరుతో దోచుకున్నందుకు బీజేపీ క్షమాపణ చెప్పాలి
Advertisement
  • అయోధ్య రామమందిర నిర్మాణ విరాళాల్లో భారీగా గోల్‌మాల్ జరిగిందన్న మంత్రి పొన్నం ప్రభాకర్
  • రాముడి పేరుతో విరాళాలు సేకరించి దోచుకున్నందుకు బీజేపీ తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • అవినీతిని పసిగట్టే అయోధ్యలో బీజేపీ ఎంపీని అక్కడి ప్రజలు ఓడించారని సంచలన వ్యాఖ్యలు
  • హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఘాటు విమర్శలు చేసిన మంత్రి

Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా సేకరించిన విరాళాల్లో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాముడి పేరుతో దేశ ప్రజలను మోసం చేసినందుకు బీజేపీ (BJP) తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

భక్తితో డొనేషన్స్ ఇస్తే.. అవినీతి చేస్తారా?

శ్రీరాముడి జన్మభూమిలో ఆలయ నిర్మాణం జరగాలనేది అందరి ఆకాంక్ష అని ఆనాడు శంకుస్థాపనకు రాజీవ్ గాంధీ సైతం అనుమతి ఇచ్చారని పొన్నం గుర్తుచేశారు. మెజారిటీ వర్గమైన హిందువులకు ఈ దేశంలో సెక్యులర్ (Secular) భావనలతో సరైన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హుస్నాబాద్ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు తమ భక్తిశ్రద్ధలతో, స్తోమతకు తగ్గట్లుగా రాముడి అక్షింతల పేరు మీద డొనేషన్స్ (Donations) ఇచ్చారని తెలిపారు. కానీ, ఆ పవిత్రమైన డబ్బులో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని పత్రికల్లో వార్తలు రావడం అత్యంత బాధాకరం అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

అయోధ్య ఓటమే.. బీజేపీకి చెంపపెట్టు

అయోధ్యలో జరిగిన అవినీతి, అక్రమాలను అక్కడి ప్రజలు ముందే పసిగట్టారని పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఎంపీని ప్రజలు అప్రమత్తమై ఓడించారని, ఇది ఆ పార్టీకి ఒక చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. ప్రజల సెంటిమెంట్‌ను వాడుకుని, దేవుడి పేరు మీద వసూళ్లకు పాల్పడిన ఈ వ్యవహారంపై బీజేపీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. జరిగిన తప్పును బహిరంగంగా ఒప్పుకుని, దేశ ప్రజలందరికీ వెంటనే క్షమాపణలు చెప్పాలని పొన్నం స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement