త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uday Krishna Reddy | ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో స‌మ‌న్యాయం ఎక్క‌డ‌..?

Uday Krishna Reddy | రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డి కేసు ఊహించ‌ని మ‌లుపు తిరిగింది. నిజానికి అత‌ను ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌లేద‌ని వైద్యులు తేల్చారు. ఆహారం తీసుకోకపోవడం, మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల స్పృహ కోల్పోయారని వైద్య ప‌రీక్ష‌ల్లో తేలింది.

D

Telangana | Published On Jul 21, 2026, 1.42 pm IST

Uday Krishna Reddy | ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో స‌మ‌న్యాయం ఎక్క‌డ‌..?
Advertisement
  • కాన్‌స్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు..
  • ఉద‌య్ కృష్ణారెడ్డి జీవితం పేద యువ‌త‌కు స్ఫూర్తి

Uday Krishna Reddy | రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డి కేసు ఊహించ‌ని మ‌లుపు తిరిగింది. తోటి మహిళా అధికారిణి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు, అకాడమీ విచారణ, సస్పెన్షన్ త‌ర్వాత ఉద‌య్ కృష్ణారెడ్డి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, నిజానికి అత‌ను ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌లేద‌ని వైద్యులు తేల్చారు. ఆహారం తీసుకోకపోవడం, మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల స్పృహ కోల్పోయారని వైద్య ప‌రీక్ష‌ల్లో తేలింది. బ్ల‌డ్ శాంపిల్స్ టెస్ట్‌లో కూడా ఆయన శరీరంలో ఎక్కడా పాయిజన్ కంటెంట్ లేద‌ని తేలింది. దీంతో కేసును ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే సూసైడ్ డ్రామా ఆడిన‌ట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక బ‌య‌ట‌ప‌డిన సూసైడ్ నోట్ కూడా మ‌ద్యం మ‌త్తులోనే రాసి ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (NPA)లో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. త‌న‌ను లైంగికంగా వేధించ‌డంతోపాటూ ప్రైవేట్ వీడియోల‌ను త‌న భ‌ర్త‌కు పంపాడంటూ ఉద‌య్ కృష్ణారెడ్డిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. మ‌హిళా అధికారిణి ఫిర్యాదు మేర‌కు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు న‌మోదైంది. దీనిపై ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతోంది. ఈ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కృష్ణారెడ్డిపై హైదరాబాద్ నేషనల్ అకాడమీ చర్యలు తీసుకుంది. కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

నిష్ప‌క్షపాతంగా విచార‌ణ జ‌ర‌గాలి..

ఈ వ్య‌వ‌హారంపై మాజీ సీబీఐ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ నాగేశ్వరరావు స్పందించారు. ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌‌లో పోస్ట్ చేశారు. ప్రేమ సంబంధం విఫలమైతే దానిని క్రిమినల్ కేసుగా మార్చొద్దని సూచించారు. నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలని సూచించారు. ఎఫ్‌ఐఆర్ నమోదైన వెంటనే ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెన్షన్ చేయడం.. ప్రశ్నలు లేవనెత్తేలా ఉందన్నారు.

వ్యక్తిగత సంబంధాలు దెబ్బతిన్నప్పుడు వాటిని కేవలం నేరపూరిత కోణంలోనే చూడటం సరి కాద‌న్నారు. తీవ్ర‌మైన ఆధారాలు ఉంటే చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకుపోవాల్సిందేన‌ని.. కానీ ఇద్ద‌రి అంగీకారంతో సాగిన సంబంధం దెబ్బ‌తిన్నంత మాత్రాన దాన్ని క్రిమిన‌ల్ కేసుగా మార్చ‌డం ఎంత వ‌ర‌కూ న్యాయం అని ప్ర‌శ్నించారు. పరస్పర అంగీకారంతో సంబంధం ఉంటే ఇద్దరికీ సమానంగా క్రమశిక్షణా చర్యలు ఉండాలని అభిప్రాయ‌ప‌డ్డారు. భావోద్వేగపూరిత అంశాలను లేదా వ్యక్తిగత సమస్యలను నేర విచారణగా (Criminal Investigation) మార్చేటప్పుడు దర్యాప్తు సంస్థలు అత్యంత అప్రమత్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. కేవలం వాస్తవాలు, శాస్త్రీయ ఆధారాల (Scientific Evidence) ఆధారంగానే కేసును పరిశీలించాల్సి ఉంటుంద‌న్నారు.

స‌మ‌న్యాయం ఎక్క‌డ‌..?

ఇక ఈ కేసులో ఎఫ్ఐఆర్ న‌మోదైన వెంట‌నే కేంద్ర హోం శాఖ ఉద‌య్ కృష్ణారెడ్డిని స‌స్పెండ్ చేయ‌డంపై కూడా ప్ర‌శ్నించారు. నైతిక నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌, క్ర‌మ‌శిక్ష‌ణారాహిత్యం కింద చ‌ర్య‌లు తీసుకుంటే అది ఇద్ద‌రికీ వర్తిస్తుంద‌న్నారు. ఒక‌రిని మాత్ర‌మే స‌స్పెండ్ చేసి మరొక‌రిపై ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోక‌పోవ‌డం ఏక‌ప‌క్ష నిర్ణ‌యంగా కనిపిస్తోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. రెండు చేతులూ క‌లిస్తేనే చ‌ప్ప‌ట్లు అనే స‌మ‌న్యాయ సూత్రాన్ని గుర్తు చేశారు. ఇరు వ‌ర్గాల‌కూ స‌మాన న్యాయం జ‌రగాల‌ని పేర్కొన్నారు.

భవిష్యత్తు పోలీసు నాయ‌కుల‌ను తీర్చిదిద్దే ఎస్వీపీఎన్‌పీఏ (SVPNPA) వంటి సంస్థలు ఇలాంటి సంక్షోభ సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. పూర్తిస్థాయి విచారణ జరగకుండానే చ‌ర్య‌లు తీసుకోవ‌డం వ‌ల్ల వాళ్ల కెరీర్ నాశ‌న‌మ‌వుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తొలుత అకాడ‌మీ డైరెక్ట‌ర్ ఈ విష‌యాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లి స‌మ‌న్యాయం జ‌రిగేలా చూడాల‌ని కోరారు. అదే స‌మ‌యంలో ఉదయ్ కృష్ణారెడ్డి సస్పెన్షన్‌ను పునఃసమీక్షించాలని కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఉదయ్‌కు శిక్షణ కొనసాగించే అవకాశం ఇవ్వాలన్నారు.

కాన్‌స్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు

ఇదంతా ప‌క్క‌న పెడితే ఉద‌య్ కృష్ణా రెడ్డి జీవితం గ్రామీణ ప్రాంత పేద యువతకు ఒక గొప్ప స్ఫూర్తి. ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత పేద కుటుంబంలో జన్మించిన ఆయన.. చిన్నతనంలోనే తల్లిదండ్రుల‌ను కోల్పోయారు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద బామ్మ వద్ద పెరుగుతూ.. ఎలాంటి సౌకర్యాలూ లేకుండా స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల‌లో విద్యనభ్యసించారు. ఆర్ధిక ఇబ్బందులను దాటుకుని క‌ష్ట‌ప‌డి చ‌దివి.. మొదట ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో కాన్‌స్టేబుల్‌గా చేరారు. అంత‌టితో అత‌ని ప్ర‌యాణం ఆగ‌లేదు.. కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌హిస్తూనే రాత్రింబవళ్లు శ్రమించి యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యారు.

ఎంతోమందికి కలగా మిగిలిపోయే ఐపీఎస్ (IPS) హోదాను స్వయంకృషితో సాధించి వేలాది మంది గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలిచారు. ఓ కానిస్టేబుల్ స్థాయి నుంచి దేశంలోని అత్యున్న‌త స్థాయి అయిన‌ ఐపీఎస్ హోదాను చేరుకోవడం అంటే నిజంగా ప్ర‌శంస‌నీయ‌మైన విష‌యం. అయితే, ఇక్క‌డే అస‌లు ప‌రీక్ష ఉంటుంది. క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి చేరుకున్న‌ప్పుడు.. ఆ హోదాకు త‌గ్గ‌ట్లుగా న‌డుచుకోవ‌డం, ఆ స్థాయిని కాపాడుకోవ‌డం చాలా ముఖ్యం. తాజా ఘ‌ట‌నలో ఈ విషయం ఎంతోమందికి ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది.

మ‌హిళ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన ఉద‌య్ కృష్ణారెడ్డి

ఇక త‌న‌పై వ‌చ్చిన లైంగిక ఆరోప‌ణ‌లను ఉద‌య్ కృష్ణా రెడ్డి ఖండించారు. మ‌హిళా ట్రైనీ ఐపీఎస్‌తో ఏడాదిగా స్నేహం కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ఆమెకు వివాహం జరిగిన తర్వాత కూడా అది కొనసాగిందని ఉదయ్ పేర్కొన్నారు. ఇష్ట‌పూర్వ‌కంగానే త‌న‌తో చాటింగ్ చేసింద‌ని.. చాలా సార్లు త‌న రూమ్‌కి వ‌చ్చింద‌ని చెప్పారు. ఆమె త‌న‌తో వాట్సాప్‌లో చాటింగ్ చేసిన‌ట్లు ఆధారాలు కూడా ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సాక్ష్యంగా రికార్డ్ చేసి ఆమె భర్తకు పంపినట్లు వెల్లడించారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆమె క‌ట్టుక‌థ‌ అల్లి తనపై తప్పుడు కేసు పెట్టిందని.. తన ఫోన్‌లో ఈ కేసుకు సంబంధించిన వీడియో, చాట్ ఆధారాలన్నీ భద్రంగా ఉన్నాయని ఉద‌య్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Also Read..

బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ల్యాణంలో అరుదైన దృశ్యం.. వీడియో

తెలంగాణ కోసం జ‌ర్న‌లిస్టులు జీవితాల‌ను త్యాగం చేశారు : విరాహ‌త్ అలీ

ఆషు రెడ్డి, స్రవంతితో సుధీర్ డబుల్ ధ‌మాకా - కొత్త టైమింగ్స్ తో ఫ్యామిలీ స్టార్స్ 2 - రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే?

Advertisement
Advertisement