త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Zojila tunnel | జోజిలా టన్నెల్ తుది బ్రేక్‌త్రూ విజ‌య‌వంతం

Zojila tunnel | దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన జోజిలా టన్నెల్ (Zojila tunnel) నిర్మాణం చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. క‌శ్మీర్ లోయ‌ను ల‌డ‌ఖ్‌తో (Kashmir-Ladakh) క‌లిపే జోజిలా సొరంగం నిర్మాణంలో తుది బ్రేక్‌త్రూ (breakthrough) బ్లాస్టింగ్ విజయవంతంగా పూర్తైంది.

D

National | Published On Jun 9, 2026, 6.18 pm IST

Zojila tunnel | జోజిలా టన్నెల్ తుది బ్రేక్‌త్రూ విజ‌య‌వంతం
Advertisement

Zojila tunnel | దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన జోజిలా టన్నెల్ (Zojila tunnel) నిర్మాణం చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. క‌శ్మీర్ లోయ‌ను ల‌డ‌ఖ్‌తో (Kashmir-Ladakh) క‌లిపే జోజిలా సొరంగం నిర్మాణంలో తుది బ్రేక్‌త్రూ (breakthrough) బ్లాస్టింగ్ విజయవంతంగా పూర్తైంది. లడ‌ఖ్‌లోని మినీమార్గ్ (Minimarg) ఈస్ట్ పోర్టల్ వద్ద జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. సొరంగం రెండు వైపులను కలిపే చివరి 2.5 మీటర్ల రాతి పొరను పేల్చేందుకు ట్రిగ్గ‌ర్ నొక్కారు.

ఈ ప్ర‌క్రియ విజ‌య‌వంత‌మైంద‌ని, సొరంగం రెండు అంచులు ఒకదానితో ఒకటి కలిసిపోయాయిన‌ట్లు అధికారులు తెలిపారు. "ఈ సొరంగం అత్యాధునికమైనది. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలతో దీనిని నిర్మించాం. ఇది లేహ్, లడ‌ఖ్ ప్రాంతాలకు అన్ని కాలాల్లోనూ (ఆల్-వెదర్) రవాణా సౌకర్యాన్ని అందిస్తుంది" అని ఈ సంద‌ర్భంగా నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా త‌దిత‌రులు పాల్గొన్నారు.

సాకారం కానున్న ద‌శాబ్దాల క‌ల

మంచు కొండ‌ల్లో క‌ఠిన ప‌రిస్థితుల‌ను ఎదుర్కొని సముద్రమట్టానికి సుమారు 11,578 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఈ జోజిలా టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సింగిల్ ట్యూబ్, ద్విముఖ రహదారి సొరంగంగా గుర్తింపు పొందనుంది. మొత్తం 13.52 కిలోమీటర్ల పొడవున్న ఈ టన్నెల్ కశ్మీర్‌లోని సోన్‌మార్గ్ సమీపంలోని బాల్తాల్ ప్రాంతాన్ని, ల‌డ‌ఖ్‌లోని ద్రాస్- కార్గిల్ సమీపంలోని మినీమార్గ్‌తో అనుసంధానిస్తుంది. జోజిలా పాస్ ప్రాంతంలో ఏటా శీతాకాలంలో భారీ మంచు కురవడం వల్ల రహదారి రవాణా నెలల తరబడి నిలిచిపోతుంది. దీంతో ల‌డ‌ఖ్‌ ప్రాంతం దేశంలోని మిగతా ప్రాంతాలతో సంబంధాలు కోల్పోతోంది.

ఇప్పుడు ఈ సొరంగ మార్గం అందుబాటులోకి వ‌స్తే.. ఆ మార్గంలో నిరంత‌ర ర‌వాణాతో ద‌శాబ్దాల క‌ల సాకారం కానుంది. ఈ టన్నెల్ వ్యూహాత్మకంగా కూడా అత్యంత కీలకమైనది. టన్నెల్ పూర్తయిన తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సైనిక బలగాలకు అవసరమైన సామగ్రి, సిబ్బందిని వేగంగా తరలించే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సైనిక అవసరాలకు ఇది కీలక మౌలిక సదుపాయంగా మారనుంది.

ఇదో ఇంజినీర్ అద్భుతం..

నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NHIDCL) పర్యవేక్షణలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) ఈ ప్రాజెక్టును చేప‌ట్టింది. దీని నిర్మాణంలో ‘న్యూ అస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్’ (NATM) అనే అత్యాధునిక సాంకేతికతను ఉప‌యోగించింది. మైనస్ 20 డిగ్రీల గడ్డకట్టే ఉష్ణోగ్రతల్లో సైతం 1200 మందికి పైగా కార్మికులు ఆధునిక పరికరాలతో రాత్రింబగళ్లు శ్రమించి ఈ సొరంగం నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు 85 శాతం ప‌నులు పూర్తైన‌ట్లు అధికారులు తెలిపారు. 2028 ఫిబ్ర‌వ‌రిలో ఇది ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు పేర్కొన్నారు. టన్నెల్ ప్రారంభమైతే గంట‌న్న‌ర ప‌ట్టే ప్రయాణ సమయం కేవలం 15 నిమిషాలకు తగ్గిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఈ సొరంగం ఇంజినీర్ అద్భుత‌మ‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read..

సంత‌కాల ఫోర్జ‌రీ.. మ‌మ‌తా బెన‌ర్జీ ఇంట్లో సీఐడీ సోదాలు

టీ20 సిరీస్ నుంచి మ‌హ్మ‌ద్ సిరాజ్ ఔట్‌.. ప్రసిద్ కృష్ణ‌కు ఛాన్స్‌..!

మెగా ఫోన్ ప‌ట్ట‌నున్న నిత్యా మీన‌న్ - థ్రిల్ల‌ర్ క‌థ‌తో డెబ్యూ మూవీ

Advertisement
Advertisement