త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sajjan Kumar | రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు, ఒక్కొక్క‌రికి రూ.100, పోలీసుల‌తో కుమ్మ‌క్కై.. సిక్కు వ్య‌తిరేక అల్ల‌ర్ల వెనుక స‌జ్జ‌న్ పాత్ర ఇదీ

Sajjan Kumar | 1984లో దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన సిక్కు వ్య‌తిరేక అల్ల‌ర్ల (anti Sikh riots) కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభ‌విస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ స‌జ్జ‌న్ కుమార్ (Sajjan Kumar) క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సిక్కు వ్య‌తిరేక అల్ల‌ర్ల వెనుక ఆయ‌న పాత్ర ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

D

National | Published On Aug 20, 2026, 5.44 pm IST

Sajjan Kumar | రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు, ఒక్కొక్క‌రికి రూ.100, పోలీసుల‌తో కుమ్మ‌క్కై.. సిక్కు వ్య‌తిరేక అల్ల‌ర్ల వెనుక స‌జ్జ‌న్ పాత్ర ఇదీ
Advertisement

Sajjan Kumar | త్రినేత్ర‌.న్యూస్ : 1984లో దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన సిక్కు వ్య‌తిరేక అల్ల‌ర్ల (anti Sikh riots) కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభ‌విస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ స‌జ్జ‌న్ కుమార్ (Sajjan Kumar) క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. తీహార్ జైలులో (Tihar jail) తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న్ని ఇవాళ ఉద‌యం జైలు సిబ్బంది ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, అప్ప‌టికే స‌జ్జ‌న్ మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధ‌రించారు. సజ్జన్ మృతికి గల కారణాలు ఇంకా తెలియ‌రాలేదు. ఈ నేప‌థ్యంలో సిక్కు వ్య‌తిరేక అల్ల‌ర్ల వెనుక ఆయ‌న పాత్ర ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇంత‌కీ ఎవ‌రీ స‌జ్జ‌న్ కుమార్

స‌జ్జ‌న్ కుమార్ సెప్టెంబర్ 23, 1945న రఘునాథ్ సింగ్, మీ కౌర్ దంపతులకు జన్మించారు. రాజ‌కీయాల్లోకి రాకముందు ఆయ‌న బేక‌రీ వ్యాపారం నిర్వ‌హించారు. 1977లో ఢిల్లీ కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేసి త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. మొద‌ట ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికైన స‌జ్జ‌న్‌.. ఆ త‌ర్వాత ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

సంజ‌య్ గాంధీకి అత్యంత న‌మ్మ‌క‌స్తుడు

స‌జ్జ‌న్ ఇందిరా గాంధీ కుమారుడు సంజ‌య్ గాంధీకి అత్యంత న‌మ్మ‌క‌మైన అనుచ‌రిడిగా గుర్తింపు పొందారు. 1980లో కాంగ్రెస్ టికెట్‌పై ఔట‌ర్ ఢిల్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఢిల్లీ రాజ‌కీయాల్లో ప్ర‌ముఖ పాత్ర పోషించారు. 1991లోనూ ఎంపీగా గెలుపొందారు. 2004లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఔట‌ర్ ఢిల్లీ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 855,543 ఓట్లతో విజయం సాధించారు.

సిక్కు వ్య‌తిరేక అల్ల‌ర్ల వెనుక స‌జ్జ‌న్‌

1984 అక్టోబర్ 31న మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ త‌న సిక్కు బాడీ గార్డ్స్ సత్వత్ సింగ్, బీంత్ సింగ్ చేతిలో హ‌త్య‌కు గురైన త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్ల‌ర్లు చెల‌రేగాయి. ముఖ్యంగా సాయుధ గుంపులు రాజ‌ధాని ఢిల్లీ వ్యాప్తంగా సిక్కుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని వారి ఇళ్లు, దుకాణాల‌పై దాడి చేశాయి. ఈ దాడిలో 3వేల మందికిపైగా సిక్కులు హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ అల్ల‌ర్ల వెనుక జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య రాజ‌కీయ నాయ‌కుల హ‌స్తం ఉన్న‌ట్లు ద‌ర్యాప్తులో తేలింది. ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో జరిగిన దాడుల నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన ప‌లువురు సాక్షులు ఈ అల్ల‌ర్ల వెనుక స‌జ్జ‌న్ హ‌స్తం ఉంద‌ని ఆరోపించారు. అత‌ను సిక్కులపై దాడి చేయాలని, ఒక్క సిక్కు కూడా ప్రాణాలతో ఉండకూడదంటూ రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేశాడ‌ని, గుంపును సిక్కుల‌పై ఉసిగొల్పిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు వాంగ్మూల‌మిచ్చారు. మారణహోమం సృష్టించిన అల్ల‌రి మూక‌లోని ఒక్కొక్క‌రికి రూ.100, మ‌ద్యం బాటిల్ ఇచ్చాడ‌ని పేర్కొన్నారు.

1984 sikh riots | The Caravan

సీబీఐ ద‌ర్యాప్తులో షాకింగ్ విష‌యాలు

2005కు ముందు ఢిల్లీ పోలీసులు మార‌ణ హోమంలో స‌జ్జ‌న్ కుమార్ పాత్ర‌పై ద‌ర్యాప్తు చేశారు. అయితే ఆ త‌ర్వాత జ‌స్టిస్ జిటి నానావ‌తి క‌మిష‌న్ సిఫార్సు మేర‌కు 2005లో ఈ కేసు ద‌ర్యాప్తును కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్‌కి అప్ప‌గించారు. సీబీఐ ద‌ర్యాప్తులో షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మార‌ణ‌హోమం స‌మ‌యంలో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల నుంచి తన పేరును తొలగించడానికి స‌జ్జ‌న్ కుమార్‌.. పోలీసులతో క‌లిసి కుట్ర పన్నిన‌ట్లు తేలింది. సాక్షుల వాంగ్మూలాల నుంచి కుమార్ పేరును ఓ క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో తొల‌గించిన‌ట్లు సీబీఐ నిర్ధారించింది. సీబీఐ దర్యాప్తు ఫలితంగా 2010లో స‌జ్జ‌న్ కుమార్‌పై హత్య, అల్లర్లు, నేరపూరిత కుట్ర, హింసను ప్రేరేపించడం వంటి అభియోగాలు న‌మోద‌య్యాయి. సజ్జన్ కుమార్ పోలీసులతో కుమ్మక్కై సిక్కులను చంపడానికి గుంపులను ఎలా రెచ్చగొట్టాడో ప్రత్యక్ష సాక్షులు సాక్ష్యం చెప్పారు.

అయితే, ఏప్రిల్ 2013లో ఢిల్లీలోని కర్కర్‌డూమా జిల్లా కోర్టు సజ్జన్ కుమార్‌ను నిర్దోషిగా విడుదల చేసింది. అయితే, జిల్లా కోర్టు నిర్ణ‌యాన్ని సీబీఐ ఢిల్లీ హైకోర్టులో స‌వాల్ చేసింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని స‌జ్జ‌న్ మార‌ణ‌హోమం సృష్టించిన‌ట్లు త‌మ ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయ‌ని సీబీఐ ప్రాసిక్యూటర్ ఢిల్లీ కోర్టుకు తెలిపారు. ఢిల్లీలోని రాజ్‌నగర్ ప్రాంతంలో ఐదుగురు సిక్కులను హత్య చేసి, గురుద్వారాకు నిప్పు పెట్టిన కేసులో 2018 డిసెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు సజ్జన్ కుమార్‌ను దోసిగా తేల్చింది. ఈ మేర‌కు ఆయ‌న‌కు జీవిత ఖైదు విధించింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో ప్ర‌స్తుతం పెండింగులో ఉంది. ఇక, నవంబర్ 1, 1984న సర్దార్‌ జస్వంత్‌ సింగ్‌, ఆయన కుమారుడు తరుణ్‌దీప్‌ సింగ్‌ను చంపిన కేసులోనూ 2025 పిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు ఆయనను దోషిగా తేల్చి జీవితఖైదు విధించింది. ప్ర‌స్తుతం ఆయ‌న తీహార్ జైలులో శిక్ష అనుభ‌విస్తూ ప్రాణాలు కోల్పోయారు.

Also Read..

1971 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేప‌ట్టాలి : డీకే శివ‌కుమార్‌

వందేమాతరం వివాదం: కాంగ్రెస్ ఆ రెండు చరణాలే ఎందుకు పాడుతుంది? మిగతా వాటిల్లో ఏముంది?

తెలంగాణ సర్కార్‌కు ఫిల్మ్ ఛాంబర్ లేఖ: ఆ జీవోతో సింగిల్ స్క్రీన్లకు ముప్పే

Advertisement
Advertisement