త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Mataram Controversy | వందేమాతరం వివాదం: కాంగ్రెస్ ఆ రెండు చరణాలే ఎందుకు పాడుతుంది? మిగతా వాటిల్లో ఏముంది?

వందేమాతరం గేయంలో మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలని కాంగ్రెస్ ఎందుకు నిర్ణయించింది? మిగతా నాలుగు చరణాల్లో ఏముంది? ఈ వివాదం వెనుక ఉన్న చారిత్రక నిజాలేంటి?

J

National | Published On Aug 20, 2026, 5.07 pm IST

Vande Mataram Controversy | వందేమాతరం వివాదం: కాంగ్రెస్ ఆ రెండు చరణాలే ఎందుకు పాడుతుంది? మిగతా వాటిల్లో ఏముంది?

సంక్షిప్త సారాంశం

పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరం గేయంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) నిర్ణయించింది. 1937లో మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ మద్దతుతో చేసిన తీర్మానాన్నే ఇప్పుడు పాటిస్తున్నట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది. తర్వాతి చరణాల్లో దేశమాతను హిందూ దేవతలతో పోల్చడం వల్ల ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చరిత్ర చెబుతోంది. ఇటీవల 2025 డిసెంబర్‌లో పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ప్రధాని మోదీ, విపక్షాల మధ్య ఈ అంశంపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది.

Advertisement

Vande Mataram Controversy | త్రినేత్ర.న్యూస్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. అలాగే గోవాలో జరిగిన ఒక ఈవెంట్‌లో 'వందేమాతరం' (Vande Mataram) గేయం ఆలపించడంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ ప్రోగ్రామ్స్ అన్నింటిలోనూ వందేమాతరం గేయంలోని 'మొదటి రెండు చరణాలు' మాత్రమే పాడాలని స్పష్టం చేసింది.

స్వాతంత్య్ర పోరాట సమయంలో మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి మహనీయుల మద్దతుతో 1937లో చేసిన తీర్మానాన్నే తాము ఇప్పుడు ఫాలో అవుతున్నామని కాంగ్రెస్ అగ్రనాయకత్వం చెబుతోంది. అసలు 1937లో కాంగ్రెస్ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? మొదటి రెండు చరణాలకు, మిగతా పాటకు ఉన్న తేడా ఏంటి? ఆ మిగతా నాలుగు చరణాల్లో ఏముంది?

1937లో అసలేం జరిగింది?

బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ్ 1875లో సంస్కృత పదాలు కలిసిన బెంగాలీ భాషలో 'వందేమాతరం' గీతాన్ని రచించారు. ఆరేళ్ల తర్వాత దీన్ని ఆయన రాసిన ప్రసిద్ధ నవల 'ఆనందమఠ్' (Anandamath)లో చేర్చారు. 18వ శతాబ్దం చివర్లో బెంగాల్‌లోని ఈస్టిండియా కంపెనీ, ప్రాంతీయ ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా జరిగిన సన్యాసుల తిరుగుబాటు నేపథ్యమే ఈ ఆనందమఠ్ నవల. స్వదేశీ ఉద్యమ (1905–08) కాలంలో వందేమాతరం స్వాతంత్య్ర పోరాటానికి ఒక నినాదంగా మారిపోయింది.

అయితే, ఈ గేయంలోని కొన్ని అంశాలపై అప్పట్లో ముస్లిం లీగ్ (Muslim League) అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశాన్ని తల్లిగా భావించి మొక్కడం ఇస్లాం వ్యతిరేకమని.. అది విగ్రహారాధన కిందకు వస్తుందని వాదించింది. 1938 అక్టోబర్‌లో కరాచీలో జరిగిన మీటింగ్‌లో మహ్మద్ అలీ జిన్నా మాట్లాడుతూ.. వందేమాతరం పాట ముస్లింల పట్ల ద్వేషాన్ని పెంచేలా ఉందని ఆరోపించారు.

నెహ్రూ, ఠాగూర్, గాంధీ ఏమన్నారు?

1937 అక్టోబర్‌లో జవహర్‌లాల్ నెహ్రూ.. సుభాష్ చంద్రబోస్‌కు రాసిన ఒక లేఖలో.. ఆనందమఠ్ నేపథ్యం వల్ల ఈ పాట ముస్లింలను రెచ్చగొట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కానీ, అప్పటికే మతవాదులు ఈ వివాదాన్ని కావాలనే సృష్టించారని ఆయన అన్నారు. ఈ వివాదంపై రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా కోరగా.. ఆయన మొదటి రెండు చరణాలను మిగతా పాటతో వేరు చేసి చూడాలని సూచించారు. మొదటి రెండు చరణాల్లో ఎలాంటి వివాదం లేదని, అవి ఎవరి మనోభావాలను దెబ్బతీయవని ఠాగూర్ స్పష్టం చేశారు.

Why Congress Sings Only First 2 Stanzas of Vande Mataram The Real Story

1937 అక్టోబర్‌లో జరిగిన ఏఐసీసీ (AICC) సమావేశానికి వెళ్తున్న జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్

దీంతో, 1937 అక్టోబర్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) జాతీయ సమావేశాల్లో మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలని ఒక రిజల్యూషన్ పాస్ చేసింది. మహాత్మా గాంధీ కూడా ఈ పాట ప్రాముఖ్యతను సమర్థిస్తూనే, ఎవరి పైనా దీన్ని బలవంతంగా రుద్దకూడదని, ఎవరైనా అబ్జెక్షన్ చెబితే పాడటం ఆపేయాలని 1939లో 'హరిజన్' పత్రికలో రాశారు.

మిగతా చరణాలు ఎందుకు వివాదాస్పదం?

మొదటి రెండు చరణాలు మాతృభూమి అందాన్ని, జలాలను, పచ్చదనాన్ని వర్ణిస్తాయి. 1950లో దేశ తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ రెండు చరణాలకే 'జాతీయ గేయం' (National Song) హోదా కల్పించారు.

Why Congress Sings Only First 2 Stanzas of Vande Mataram The Real Story

1938లో హరిపురాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో మహాత్మా గాంధీ. కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ రిబ్బన్ ధరించి ఉన్నారు. ఆయన వెనుక డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూర్చుని ఉండగా, బోస్‌కు కుడివైపున సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఉన్నారు.

ఇక తర్వాతి చరణాల విషయానికి వస్తే.. మూడో చరణం మాతృభూమిని రక్షించడానికి కోట్లాది చేతులు కత్తులు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని చెబుతుంది. ఐదో చరణం దేశమాతను దుర్గ, లక్ష్మి, సరస్వతి దేవుళ్లతో పోలుస్తుంది. ఒకే దేవుడిని (అల్లాహ్) ఆరాధించాలనేది ఇస్లాం మూల సూత్రం. ఇలా దేశాన్ని హిందూ దేవతలతో పోల్చడం వల్ల ముస్లిం పండితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రకారుల ప్రకారం, ఆనందమఠ్ నవలలో ముస్లింలను శత్రువులుగా చూపించడం కూడా ఈ అభ్యంతరాలకు ఒక కారణం.

పాలిటిక్స్‌లో తాజా దుమారం

2025 డిసెంబర్‌లో వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన చర్చ ఈ పాత వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ముస్లిం లీగ్ ఒత్తిడికి తలొగ్గి నెహ్రూ ఈ పాటను కుదించారని ప్రధాని మోదీ (PM Modi) ఆరోపించారు. దీనికి కౌంటర్‌గా ప్రియాంక గాంధీ.. నెహ్రూ రాసిన లేఖలోని ఇతర అంశాలను చదివి వినిపించారు. మరోవైపు AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, DMK ఎంపీ ఎ. రాజా లాంటి నేతలు.. వందేమాతరాన్ని బలవంతంగా రుద్దడం జాతీయవాదాన్ని మతంగా మార్చడమేనని విమర్శించారు.

వందే మాతరం

పల్లవి

వందే మాతరం వందే మాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం
వందే మాతరం

చరణం 1

శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీమ్
పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం
వందే మాతరం

చరణం 2

కోటి కోటి కంఠ కలకల నినాదకరాలే
కోటి కోటి భుజైర్ద్రుత ఖరకరవాలే
అబలా కే నో మా ఏత బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం
వందే మాతరం

చరణం 3

తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ
త్వం హి ప్రాణాః శరీరే
బహు తే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి
తోమారయి ప్రతిమాగడి మందిరే మందిరే
వందే మాతరం

చరణం 4

త్వంహి దుర్గా దశప్రహరణ ధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ,
నమామి త్వామ్
నమామి కమలాం అమలాం అతులామ్
సుజలాం సుఫలాం మాతరం
వందే మాతరం

చరణం 5

శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం
ధరణీం భరణీం మాతరం

 

Advertisement
Advertisement