త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tihar Jail | తీహార్ జైల్లో పెట్టే ఆహారం తిన‌లేక‌పోతున్నా.. వంట చేసుకునేందుకు అనుమ‌తివ్వండి.. కోర్టును ఆశ్ర‌యించిన ఖైదీ

Tihar Jail | తీహార్ జైల్లో (Tihar Jail) పెట్టే ఆహారం తాను తిన‌లేక‌పోతున్నాన‌ని అమెరికన్ ఖైదీ (American prisoner) మాథ్యూ ఆరన్ వాన్‌డైక్ (Matthew Aaron VanDyke) కోర్టును ఆశ్ర‌యించాడు. జైల్లోనే తాను స్వయంగా వంట చేసుకునేందుకు అనుమతించాలని అభ్య‌ర్థించాడు. పాటియాలా హౌస్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాడు.

D

National | Published On Jul 10, 2026, 1.42 pm IST

Tihar Jail | తీహార్ జైల్లో పెట్టే ఆహారం తిన‌లేక‌పోతున్నా.. వంట చేసుకునేందుకు అనుమ‌తివ్వండి.. కోర్టును ఆశ్ర‌యించిన ఖైదీ
Advertisement

Tihar Jail | తీహార్ జైల్లో (Tihar Jail) పెట్టే ఆహారం తాను తిన‌లేక‌పోతున్నాన‌ని అమెరికన్ ఖైదీ (American prisoner) మాథ్యూ ఆరన్ వాన్‌డైక్ (Matthew Aaron VanDyke) కోర్టును ఆశ్ర‌యించాడు. జైల్లో పెట్టే ఆహారంలో మసాలా, కారం, నూనె ఎక్కువగా ఉన్నాయని తెలిపాడు. ఆ ఆహారం త‌న ఒంటికి ప‌డ‌ట్లేద‌ని పేర్కొన్నాడు. జైల్లోనే తాను స్వయంగా వంట చేసుకునేందుకు అనుమతించాలని అభ్య‌ర్థించాడు. ఈ మేర‌కు పాటియాలా హౌస్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాడు.

కారం, నూనె ఎక్కువ‌గా ఉండే డీఫ్రై చేసిన ఆహారాన్ని తాను తిన‌లేక‌పోతున్నాన‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నాడు. 50 రోజుల‌కుపైగా ఆహారం తిన‌కుండా ప‌స్తులు ఉన్న‌ట్లు చెప్పాడు. అమెరిక‌న్ పౌరుడినైన తాను.. ఇక్క‌డి జైల్లో వ‌డ్డించే సాధార‌ణ భోజ‌నం త‌న‌కు అల‌వాటు లేద‌ని తెలిపాడు. ఈ ఆహారం తిన‌డం వ‌ల్ల ఆరోగ్యం క్షీణించింద‌ని చెప్పుకొచ్చాడు. సరైన పోషకాహారం లేకపోవడం వల్ల తాను దాదాపు 14 కిలోల బ‌రువు త‌గ్గాన‌ని, చూపు కూడా మంద‌గించింద‌ని, శరీరక దారుఢ్యం, రోగ నిరోధక శక్తి సన్నగిల్లాయని పిటిష‌న్‌లో త‌న గోడు వెళ్ల‌బోసుకున్నాడు.

అందుకే జైల్లో త‌న వంట‌ను తానే వండుకునేందుకు అనుమ‌తించాల‌ని కోరాడు. త‌న సొంత ఖ‌ర్చుల‌తో వంట సామ‌గ్రి, ఆహార ప‌దార్థాల‌ను స‌మ‌కూర్చుకుంటాన‌ని చెప్పాడు. పప్పులు, చికెన్, చేపలు, పాస్తా, నూడిల్స్, బియ్యం, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, బీన్స్, మసాలాలు, బ్రెడ్, బటర్, ఆలివ్ ఆయిల్, టోన్డ్ మిల్క్ వంటి ఆహార పదార్థాలను తన వద్ద ఉంచుకోవడానికి అనుమతించాలని వాన్‌డైక్ కోరాడు. వీటితో పాటు, తాను సొంతంగా వంట చేసుకోవడానికి వీలుగా ఒక ఇండక్షన్ స్టవ్, పాత్రలు, గిన్నెలు, ప్లాస్టిక్ చాపర్ అనుమతించాలని అభ్యర్థించాడు.
త‌న అభ్య‌ర్థ‌న‌ను మాన‌వ‌తా దృక్ప‌థంతో ప‌రిశీలించాల‌ని కోరాడు. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన అదనపు సెషన్స్ జడ్జి ప్రశాంత్ శర్మ.. దీనిపై స్పందించాల‌ని తీహార్ జైలు అధికారుల‌ను ఆదేశించారు. అనంత‌రం త‌దుప‌రి విచార‌ణ‌ను జులై 21కి వాయిదా వేశారు.

భార‌త్‌కు వ్య‌తిరేకంగా ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో మ్యాథ్యూని మార్చి 13న కోల్‌క‌తా ఎయిర్‌పోర్టులో జాతీయ ద‌ర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. అత‌డితోపాటూ ఆరుగురు ఉక్రేనియ‌న్ల‌ను కూడా అదుపులోకి తీసుకుంది. నిషేధిత చొరబాటు దారులతో వీరికి సంబంధాలు ఉన్నాయని, వారికి ఆయుధాలు, పరికరాలు సప్లై చేస్తున్నారని అధికారులు తెలిపారు. టూరిస్టు వీసాపై వచ్చిన వీరు తొలుత అస్సాం మీదుగా గువాహటీకి వెళ్లారు. అక్క‌డి నుంచి మిజోరాంకు ప్ర‌యాణించారు. అక్క‌డి నుంచి ఎలాంటి అనుమ‌తులూ లేకుండా మ‌య‌న్మార్‌లోకి ప్ర‌వేశించి.. నిషేధిత మిలిటెంట్ సంస్థలకు శిక్షణ ఇచ్చారని ద‌ర్యాప్తు సంస్థ‌ పేర్కొంది. ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నట్లు విచారణలో నిందితులు అంగీకరించిన‌ట్లు తెలిపింది. దీంతో ఉపా చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు వెల్ల‌డించింది.

Advertisement
Advertisement