త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయ‌న్న జ‌యంతి, వ‌ర్ధంతి నిర్వ‌హ‌ణ‌

Panduga Sayanna | తెలంగాణ రాబిన్‌వుడ్‌గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పండుగ సాయన్న జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయించింది.

S

Telangana | Published On Aug 20, 2026, 5.19 pm IST

Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయ‌న్న జ‌యంతి, వ‌ర్ధంతి నిర్వ‌హ‌ణ‌
Advertisement

Panduga Sayanna | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాబిన్‌వుడ్‌గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పండుగ సాయన్న జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.

పండుగ సాయన్న జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో ముదిరాజ్‌ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.

జీవో ప్రకారం ఇకపై ప్రతి సంవత్సరం అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతి, డిసెంబర్ 10న పండుగ సాయన్న వర్ధంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది.

సీఎం రేవంత్‌కు వాకిటి ధ‌న్య‌వాదాలు

ఈ నిర్ణయంపై మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పండుగ సాయన్న వంటి వీరుడి పోరాటాన్ని, త్యాగాన్ని ప్రజా ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం బహుజన సమాజానికి గర్వకారణమని అన్నారు.

పండుగ సాయన్న కేవలం ఒక ప్రాంతానికే పరిమితమైన వీరుడు కాదని, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ప్రజా వీరుడని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఆయన జీవితం, పోరాటం, త్యాగం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. పండుగ సాయన్న జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలన్న ముదిరాజ్‌ సమాజం చిరకాల ఆకాంక్ష నెరవేరడం సంతోషకరమని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వానికి బహుజనుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

“ఒక వీరుని పోరాటాన్ని, త్యాగాన్ని ప్రజా ప్రభుత్వం గుర్తించడం బహుజనులందరికీ గర్వకారణం. పండుగ సాయన్న స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయం” అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ నిర్ణయంతో ముదిరాజ్‌ సమాజంతో పాటు పండుగ సాయన్న అభిమానులు, బహుజన వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement