త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arvind Kejriwal | ప్ర‌ధాని నివాసం వైపు ఆప్ చేప‌ట్టిన మార్చ్‌ను అడ్డుకున్న పోలీసులు.. మేము టెర్ర‌రిస్ట్‌లం కాదంటూ కేజ్రీవాల్ ఆగ్ర‌హం

Arvind Kejriwal | ఈ20 (E20) పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేప‌ట్టిన మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కేజ్రీవాల్ (Arvind Kejriwal), మ‌నీశ్ సిసోడియా త‌దిత‌రుల‌ను ప్ర‌ధాని నివాసం వైపు వెళ్ల‌కుండా ఫిరోజ్ షా రోడ్డులోనే పోలీసులు అడ్డ‌గించారు. దీంతో వారంతా అక్కడ రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న తెలిపారు.

D

National | Published On Aug 4, 2026, 3.32 pm IST

Arvind Kejriwal | ప్ర‌ధాని నివాసం వైపు ఆప్ చేప‌ట్టిన మార్చ్‌ను అడ్డుకున్న పోలీసులు.. మేము టెర్ర‌రిస్ట్‌లం కాదంటూ కేజ్రీవాల్ ఆగ్ర‌హం
Advertisement

Arvind Kejriwal | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్రం అనుసరిస్తున్న ఈ20 (E20) పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా రెండు లక్షలకు పైగా ప్ర‌జ‌లు సంత‌కాలు చేసిన లేఖ‌ల‌ను అంద‌జేసేందుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) నివాసం వ‌ర‌కూ 100 మందితో మార్చ్‌గా వెళ్తున్న ఆప్ అధినేత అర‌వింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను ఢిల్లీ పోలీసులు మ‌ధ్య‌లోనే అడ్డుకున్నారు. కేజ్రీ స‌హా ప్ర‌ధాని నివాసానికి మార్చ్‌గా వెళ్తున్న ఆప్‌ నేత‌ల‌ను ఫిరోజ్ షా రోడ్డులో అడ్డుకున్నారు. దీంతో వారంతా అక్క‌డే రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న తెలిపారు.

ఈ సంద‌ర్భంగా పోలీసుల తీరుపై కేజ్రీవాల్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తాము ఉగ్ర‌వాదులం కాద‌ని.. ఈ 20 ఇంధ‌న స‌మ‌స్య‌పై ప్ర‌ధాని మోదీని క‌ల‌వాల‌నుకుంటున్న‌ట్లు చెప్పారు. ఇథ‌నాల్ పెట్రోల్‌పై ప్ర‌జ‌ల ఆందోళ‌న‌ల‌ను తెలియ‌జేసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతూ గ‌త నెల‌లో ప్ర‌ధాని మోదీకి లేఖ రాసిన‌ట్లు చెప్పారు. ఆ లేఖ‌కు ఎలాంటి స్పంద‌నా రాక‌పోవ‌డంతో తాను స్వ‌యంగా విన‌తిప‌త్రాల‌ను అంద‌జేసేందుకు వెళ్తున్న‌ట్లు చెప్పారు. ఈ20 నుంచి విముక్తి క‌ల‌గాలంటే వంద మంది స‌రిపోర‌ని వ్యాఖ్యానించారు. పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి రావాల‌ని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండ‌గా.. ఆప్ చేప‌ట్టిన ఈ మార్చ్‌కు అనుమ‌తి లేద‌ని పోలీసులు తెలిపారు. శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య కార‌ణంగా 5, ఫిరోజ్ షా రోడ్డు దాటి ఎవ‌రినీ ముందుకు వెళ్లేందుకు అనుమ‌తించ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అక్క‌డ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో కేజ్రీవాల్‌, మ‌నీశ్ సిసోడియా త‌దిత‌ర ఆప్‌ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న తెలిపారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వంపై కేజ్రీవాల్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఇథ‌నాల్ ఉత్ప‌త్తిదారు అయిన అమెరికాలో స్వ‌దేశీ వినియోగం చాలా త‌క్కువ‌గా ఉంద‌ని.. అందుకే ఈ20 ఇంధ‌నం ద్వారా భార‌తీయుల‌పై ఇథ‌నాల్‌ను రుద్దేలా మోదీ ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెస్తోందని కేజ్రీవాల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ ఒత్తిడిని తిరస్కరించే ధైర్యం మోదీకి లేద‌న్నారు. అందుకే అమెరికా ఒత్తిడికి త‌లొగ్గి ఈ విధానాన్ని ప్ర‌జ‌ల‌పై బ‌ల‌వంతంగా రుద్దుతున్నార‌ని ఆరోపించారు.

పెట్రోల్ బంకుల్లో ఇంధ‌నాన్ని ఆప్ష‌న‌ల్ చేయాలి..

కాగా, ఇథ‌నాల్ కార్య‌క్ర‌మాన్ని కేజ్రీవాల్ ముందు నుంచీ వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై గ‌త నెల ప్ర‌ధాని మోదీకి కేజ్రీ లేఖ కూడా రాశారు. వినియోగదారులపై బలవంతంగా E20 ఇంధనాన్ని (E20 Fuel) రుద్దకుండా, పెట్రోల్ పంపుల్లో E20, E10, E0 వేరియంట్లను విడివిడిగా అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రజలు తమకు నచ్చిన పెట్రోల్‌ను ఎంచుకునే వీలు క‌ల్పించాల‌ని విజ్ఞప్తి చేశారు. "ఎవరికైనా స్వచ్ఛమైన పెట్రోల్​ కావాలంటే వారికి ఆ ఆప్షన్ ఉండాలి. అలాగే ఇథనాల్ కలిపిన పెట్రోల్ కావాలంటే వారికి ఆ ఛాయిస్ ఇవ్వాలి" అని అన్నారు. సాధారణ పెట్రోల్​తో పోలిస్తే, ఇథనాల్​ కలిపిన ఇంధనం (ఈ20) తక్కువ మైలేజీని ఇస్తుందని కేజ్రీ పేర్కొన్నారు. అందువ‌ల్ల E20 పెట్రోల్ ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు.

E20 పెట్రోల్‌తో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌పై తమ అనుభవాలను పంచుకోవాలని పౌరులను కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఆన్‌లైన్ పిటిషన్‌ను కూడా ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా సేక‌రించిన దాదాపు 2.30 ల‌క్ష‌ల పిటిష‌న్ల‌తో ఇవాళ ప్ర‌ధాని నివాసం వైపు మార్చ్‌గా వెళ్లారు. ఈ మార్చ్‌ను పోలీసులు మ‌ధ్య‌లోనే అడ్డుకోవ‌డంతో అక్క‌డ కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Also Read..

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు.. 12 మందికి గాయాలు

రాజీనామా చేస్తే.. క్ష‌ణం ఆలోచించ‌కుండా ఆమోదిస్తా.. అస‌మ్మ‌తి ఎమ్మెల్యేల‌కు డీకే స్ట్రాంగ్ వార్నింగ్‌

రైతుల ప్రయోజనాల‌కే తొలి ప్రాధాన్యం.. ప్రతీ గింజకూ లెక్క చెప్పాల్సిందే : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Advertisement
Advertisement