త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ఉగ్ర‌వాదం ఎవ‌రికీ వ్యూహాత్మ‌క సంప‌ద‌గా మార‌కూడ‌దు.. ప్ర‌పంచానికి ప్ర‌ధాని మోదీ గ‌ట్టి సందేశం

PM Modi | ఉగ్రవాదంపై భారత్‌ అనుసరిస్తున్న విధానంలో ఎలాంటి మార్పు లేదని ప్ర‌ధాని మోదీ (PM Modi) మరోసారి స్పష్టం చేశారు. ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన ప్ర‌ధాని.. ఉగ్రవాదంపై ప్ర‌పంచానికి గ‌ట్టి సందేశం ఇచ్చారు.

D

National | Published On Sep 1, 2026, 2.51 pm IST

PM Modi | ఉగ్ర‌వాదం ఎవ‌రికీ వ్యూహాత్మ‌క సంప‌ద‌గా మార‌కూడ‌దు.. ప్ర‌పంచానికి ప్ర‌ధాని మోదీ గ‌ట్టి సందేశం
Advertisement

PM Modi | త్రినేత్ర‌.న్యూస్ : ఉగ్ర‌వాదాన్ని స‌మూలంగా నిర్మూలించాల‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ప్ర‌పంచ దేశాల‌కు పిలుపునిచ్చారు. ఈ అంశంలో ద్వంద్వ ప్ర‌మాణాల‌కు తావుండ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. కిర్గిస్థాన్ (Kyrgyzstan) రాజ‌ధాని బిష్కెక్‌లో జ‌రుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (Shanghai Cooperation Organisation) శిఖరాగ్ర సదస్సులో ప్ర‌ధాని పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై ప్ర‌పంచానికి గ‌ట్టి సందేశం ఇచ్చారు.

ఉగ్రవాదంపై భారత్‌ అనుసరిస్తున్న విధానంలో ఎలాంటి మార్పు లేదని ప్ర‌ధాని మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మలుచుకున్న దేశాలకు స్పష్టమైన, కఠినమైన సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంద‌న్నారు. ఇలాంటి తీవ్రమైన అంశంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండ‌కూడ‌ద‌ని.. అంద‌రిదీ ఒకే మాట ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ఉగ్ర‌వాదాన్ని ఒక విధాన‌ప‌ర‌మైన సాధ‌నంగా వాడుకుంటున్న, ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం, మ‌ద్ద‌తు ఇస్తున్న దేశాల‌కు గ‌ట్టి హెచ్చ‌రిక‌లు పంపాల‌ని పిలుపునిచ్చారు. ఉగ్ర‌వాదం ఎవ‌రికీ వ్యూహాత్మ‌క సంప‌ద‌గా మార‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

భ‌ద్ర‌తా ప‌రిధి మ‌రింత‌ విస్తృత‌మైంది

నేటి అనుసంధానిత ప్రపంచంలో భ‌ద్ర‌తా ప‌రిధి మ‌రింత‌ విస్తృత‌మైంద‌ని ప్ర‌ధాని తెలిపారు. ఇందుకు ప‌శ్చిమాసియా (Middle East) సంక్షోభాన్ని ఒక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పారు. ఆ ప్రాంతంలో మొద‌లైన సంఘ‌ర్ష‌ణ కేవ‌లం ఆ ప్రాంతానికే ప‌రిమితం కాలేద‌ని గుర్తు చేశారు. దాని ప్ర‌భావం ప్ర‌పంచ ఇంధ‌న భ‌ద్ర‌త‌, స‌ముద్ర వాణిజ్యం, స‌ర‌ఫ‌రా గొలుసుల‌న్నింటిపై ప‌డుతోంద‌ని వివ‌రించారు. ఇలాంటి సంఘ‌ర్ష‌ణ‌ల వ‌ల్ల గ్లోబ‌ల్ సౌత్ దేశాలు అత్య‌ధిక మూల్యం చెల్లిస్తున్నాయ‌ని చెప్పారు. అందుకే అన్ని యుద్ధాలు, ఉద్రిక్త‌త‌ల‌ను యుద్ధభూమిలో కాకుండా చ‌ర్చ‌లు, దౌత్యం ద్వారానే ప‌రిష్క‌రించుకోవాల‌న్న‌ భార‌త వైఖ‌రిని పున‌రుద్ఘాటించారు.

యువ‌త‌కు పెను ముప్పు

మాద‌క ద్ర‌వ్యాల అక్ర‌మ ర‌వాణా యువ‌త‌కు, ప్రాంతీయ భ‌ద్ర‌త‌కు పెను ముప్పుగా మారుతోంద‌ని ప్ర‌ధాని హెచ్చ‌రించారు. "మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేవలం ఒక నేరం మాత్రమే కాదు.. ఇది మన యువతరానికి, ప్రాంతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు" అని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు, భద్రతాపరమైన ముప్పులు, సమాచార భద్రత, వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి SCO దేశాల మధ్య బలమైన సహకారం ఉండాలని పిలుపునిచ్చారు.

మోదీ-జిన్‌పింగ్ షేక్‌హ్యాండ్‌

ఈ స‌మావేశంలో పాకిస్థాన్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ స‌హా చైనా అధ్య‌క్షుడు షీ జిన్ పింగ్‌, ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ , ఇరాన్ అధ్య‌క్షుడు మ‌సూద్ పెజెష్కియ‌న్‌, బెలార‌స్ అధ్య‌క్షుడు అలెగ్జాండ‌ర్ లూకాషెంకో, క‌జ‌కిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌, త‌జికిస్థాన్ అధ్య‌క్షులు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఎస్‌సీవో స‌మావేశానికి ముందు స‌భ్య దేశాల నేత‌లు అధికారిక గ్రూప్ ఫొటో దిగారు. ఈ సంద‌ర్భంగా చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌కు మోదీ షేక్‌హ్యాండ్ ఇవ్వ‌డం అంద‌రినీ ఆక‌ర్షించింది. అనంత‌రం మోదీ, జిన్‌పింగ్‌, పుతిన్ ముగ్గురు నేత‌లూ క‌లిసి కాసేపు ముచ్చ‌టించుకున్నారు.

Also Read..

సీఎం ₹11 వేల కోట్లు ఇచ్చామంటే.. ఆర్టీసీ ఎండీ ఏమో ₹2,607 కోట్లు రావాలంటున్నారు: తేలేదెప్పుడు?

ర‌ష్యా సైన్యంలో చేరిన 51 మంది భార‌తీయులు మృతి.. వెల్ల‌డించిన కేంద్రం

కొన్ని న‌గ‌రాల్లో భారీగా హెచ్1ఎన్‌1 కేసులు, కొన్ని చోట్ల స్వ‌ల్పంగా.. ఎందుకీ తేడా..?

Advertisement
Advertisement