త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | విదేశీ ప్ర‌యాణాలు, బంగారం కొనుగోళ్లు వ‌ద్దు.. జీడీపీ వృద్ధిపై దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని అభినంద‌న‌లు

PM Modi | దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదు (7.8% GDP growth) కావడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు తెలిపారు. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు కీల‌క పిలుపునిచ్చారు. విహార‌యాత్ర‌ల కోసం విదేశాల‌కు వెళ్ల‌డం మానుకోవాల‌ని, స్వ‌దేశీ వ‌స్తువుల‌కే ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని, బంగారం కొనుగోళ్ల‌ను ఆపేయాల‌ని సూచించారు.

D

National | Published On Sep 1, 2026, 11.19 am IST

PM Modi | విదేశీ ప్ర‌యాణాలు, బంగారం కొనుగోళ్లు వ‌ద్దు.. జీడీపీ వృద్ధిపై దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని అభినంద‌న‌లు
Advertisement
  • 140 కోట్ల మంది ప్రజల సమష్టి కృషి, సంకల్ప బలంతోనే ఇది సాధ్య‌మైంది
  • ప్ర‌పంచ దేశాలు క్లిష్ట ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నా.. భారత్ వేగంగా పురోగమిస్తోంది
  • ఈ వృద్ధి వేగాన్ని ఇలాగే కొనసాగించాలి
  • స్వ‌దేశీ వ‌స్తువుల‌కే ప్రాధ‌న్యాత ఇవ్వాలి
  • అది ఛాత్రోం కీ గూంజ్ కాదు.. ఝూట్‌ కీ గూంజ్‌

PM Modi | త్రినేత్ర‌.న్యూస్ : దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదు కావడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. దేశ ప్రజల సంకల్ప బలం, సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంద‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు ప్ర‌ధాని మంగ‌ళ‌వారం ఉద‌యం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ సెల్ఫీ వీడియోని విడుద‌ల చేశారు. ప్ర‌పంచ దేశాలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్ర‌స్తుత త‌రుణంలో భార‌త్ మాత్రం అసాధార‌ణ ఘ‌న‌త‌ను సాధించింద‌ని చెప్పుకొచ్చారు.

భారత్ వేగంగా పురోగమిస్తోంది

"ప్రపంచమంతా యుద్ధ వాతావరణంలో కూరుకుపోయింది. ఎక్కడ చూసినా యుద్ధ వార్తలే వినిపిస్తున్నాయి. ప్రపంచం సంక్షోభాల మధ్య కొట్టుమిట్టాడుతోంది. సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. 2020 నాటి కొవిడ్ కాలం నుంచి నేటి వరకు ఎక్కడా స్థిరత్వం కనిపించడం లేదు. అనేక దేశాలు ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, ఇతర క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ.. భారత్ వేగంగా పురోగమిస్తోంది. 7.8 శాతం వృద్ధి రేటు నమోదవడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. 140 కోట్ల మంది భారత ప్రజల సమష్టి కృషి, సంకల్ప బలంతోనే ఈ అసాధారణ విజయం సాధ్యమైంది" అని ప్ర‌ధాని చెప్పుకొచ్చారు.

అదో ఝూట్‌ కీ గూంజ్‌

నిరాశ‌తో కూరుకుపోయిన విప‌క్షాలు ప్ర‌భుత్వంపై ఎన్ని అబ‌ద్దాలు ప్ర‌చారం చేసినా భార‌త్ మాత్రం ఆర్థిక వృద్ధిలో దూసుకెళ్తోంద‌న్నారు. మనం ఈ వృద్ధి వేగాన్ని ఇలాగే కొనసాగించాలని, ముందుకు సాగుతూనే ఉండాల‌ని తెలిపారు. ఇందుకోసం ఆత్మనిర్భర్ భారత్‌గా మారడం చాలా అవసరమ‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'ఛాత్రోం కీ గూంజ్' క్యాంపెయిన్‌పై ప్ర‌ధాని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఝూట్‌ కీ గూంజ్‌గా అభివ‌ర్ణించారు.

విదేశీ టూర్లు, బంగారం కొనుగోళ్లు వ‌ద్దు..

ప్ర‌జ‌లు స్వ‌దేశీ మంత్రంతో ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా ప‌శ్చిమాసియా సంక్షోభం స‌మ‌యంలో ఇచ్చిన పిలుపునే మ‌రోసారి గుర్తు చేశారు. విహార‌యాత్ర‌ల కోసం విదేశాల‌కు వెళ్ల‌డం మానుకోవాల‌ని సూచించారు. పెళ్లిళ్లు విదేశాల్లో (No Foreign Weddings) చేసుకోవ‌ద్ద‌న్నారు. 'వెడ్ ఇన్ ఇండియా' (Wed in India) అనే మంత్రాన్ని ఆచరించాలని సూచించారు. అదేవిధంగా అన‌వ‌స‌రంగా బంగారం కూడా కొనుగోలు చేయొద్ద‌ని తెలిపారు.

స్వ‌దేశీ విధానానికి పెద్ద‌పీట

విక‌సిత్ భార‌త్ ల‌క్ష్య సాధ‌న కోసం ప్ర‌తి ఒక్క‌రూ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని పిలుపునిచ్చారు. సుస్థిర అభివృద్ధిలో స్వ‌యం స‌మృద్ధి ముఖ్య‌మైంద‌ని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే స్వ‌దేశీ విధానానికి పెద్ద‌పీట వేయాల‌ని నొక్కి చెప్పారు. ఏదైనా వ‌స్తువు కొనుగోలు చేసేట‌ప్పుడు స్వ‌దేశీ వ‌స్తువుల‌కే ప్రాధ‌న్యాత ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. మ‌నం ఎంత ఎక్కువ‌గా స్థానిక ఉత్ప‌త్తుల‌ను, సేవ‌ల‌ను ఎంచుకుంటే భార‌త్ అంత‌కంత‌కూ అభివృద్ధి చెందుతుంద‌ని అన్నారు. మనం ఆత్మనిర్భరతకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగితే.. అభివృద్ధి చెందిన భార‌త‌దేశాన్ని మ‌న యువ‌త‌కు కానుకగా అందిస్తామనే పూర్తి విశ్వాసం త‌న‌కు ఉంద‌ని ప్ర‌ధాని చెప్పుకొచ్చారు.

అప్పుడు కూడా..

కాగా, ఇరాన్‌-అమెరికా యుద్ధ స‌మ‌యంలోనూ ప్ర‌ధాని దేశ ప్ర‌జ‌ల‌కు ఇలాంటి పిలుపే ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది మేలో హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని ప్ర‌సంగిస్తూ.. సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, పెరుగుతున్న ధరలు, ప్రపంచ అనిశ్చితి నుంచి భారత్ గట్టెక్కేందుకు 'సమిష్టి భాగస్వామ్యం' అవ‌స‌ర‌మ‌ని తెలిపారు. సాధ్య‌మైన చోట వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని, పెట్రోల్‌, డీజిల్ వాడ‌కాన్ని త‌గ్గించాల‌ని సూచించారు. ప్ర‌జా ర‌వాణాను ఉప‌యోగించుకోవాల‌ని, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరారు. విదేశీ మార‌క‌ద్ర‌వ్య నిల్వ‌ల‌పై భారాన్ని త‌గ్గించేందుకు ఏడాదిపాటూ అన‌వ‌స‌ర‌మైన విదేశీ ప్ర‌యాణాలు, విదేశాల్లో పెళ్లిళ్లు, బంగారం కొనుగోళ్ల‌కు దూరంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్ప‌త్తుల‌నే ఎక్కువ‌గా కొనుగోలు చేయాల‌ని దేశ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

భారత్‌ 7.8 శాతం ఆర్థిక వృద్ధి

ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి త్రైమాసికంలో భారత్‌ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. అమెరికా-ఇరాన్‌ యుద్ధం ప్రభావం ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంచనాలు ఉన్నప్పటికీ, తొలి త్రైమాసికంలో వృద్ధి బలంగా నమోదైంది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో నమోదైన 8.6 శాతం వృద్ధితో పోలిస్తే తాజా వృద్ధి 80 బేసిస్‌ పాయింట్లు తగ్గింది.

Also Read..

న‌ష్టాల‌కు బ్రేక్‌.. స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..

నిమ్స్‌లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం కౌంట‌ర్స్ ఎత్తేసిన స‌ర్కార్

అమెరికన్లకు భారీ ఊరట.. త‌గ్గ‌నున్న ఔష‌ధాల ధ‌ర‌లు..

Advertisement
Advertisement