త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPG Imports | ఇంధన భద్రతే లక్ష్యం.. అమెరికా నుంచి ఎల్‌పీజీ దిగుమతులను పెంచే యోచనలో భారత్..!

LPG Imports | త‌న ఇంధ‌న స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేసుకునే వ్యూహాత్మ‌క చ‌ర్య‌ల్లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అమెరికా నుంచి ఎల్‌పీజీ (LPG) దిగుమ‌తుల‌ను పెంచేందుకు సిద్ధ‌మైంది.

D

National | Published On Jul 6, 2026, 4.29 pm IST

LPG Imports | ఇంధన భద్రతే లక్ష్యం.. అమెరికా నుంచి ఎల్‌పీజీ దిగుమతులను పెంచే యోచనలో భారత్..!
Advertisement

LPG Imports | త్రినేత్ర‌.న్యూస్ : త‌న ఇంధ‌న స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేసుకునే వ్యూహాత్మ‌క చ‌ర్య‌ల్లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అమెరికా నుంచి ఎల్‌పీజీ (LPG) దిగుమ‌తుల‌ను పెంచేందుకు సిద్ధ‌మైంది. అమెరికా-ఇరాన్ మ‌ధ్య యుద్ధం కార‌ణంగా మ‌ధ్య‌ప్రాచ్యంలో నెల‌కొన్న ఉద్రిక్త స‌మ‌యంలో ఎల్‌పీజీ స‌ర‌ఫ‌రాలో ఎదురైన స‌వాళ్లు, ఇబ్బందుల నుంచి పాఠాలు నేర్చుకున్న భార‌త్‌.. ఇకపై ఒకే ప్రాంతం లేదా ఒకే దేశంపై ఆధారపడకుండా సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే అమెరికా నుంచి వంట‌గ్యాస్ దిగుమ‌తుల‌ను రెట్టింపు చేయాల‌ని యోచిస్తోంది.

వంట‌గ్యాస్ కోసం గ‌ల్ఫ్ దేశాల‌పై ఆధార‌ప‌డ‌టాన్ని త‌గ్గించ‌డంతోపాటూ.. అంతర్జాతీయంగా భౌగోళిక‌-రాజ‌కీయ అనిశ్చితి నెల‌కొన్న స‌మ‌యాల్లో స్థిర‌మైన స‌ర‌ఫ‌రాను నిర్ధ‌రించుకోవ‌డం ఈ నిర్ణ‌యం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ‌మ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ప్రస్తుతం భారత్ తన వార్షిక ఎల్‌పీజీ అవసరాల్లో 2.2 మిలియన్ టన్నులను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. గల్ఫ్ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఈ పరిమాణాన్ని ఏకంగా రెట్టింపు చేయాలని భార‌త్‌కు చెందిన ప్ర‌భుత్వ రంగ చ‌మురు మార్కెటింగ్ సంస్థ‌లు యోచిస్తున్నాయి. అమెరికాతో ఇప్పటికే అమల్లో ఉన్న ఎల్‌పీజీ కొనుగోలు ఒప్పందాన్ని విస్తరించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయని ఈ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న వ‌ర్గాలు తెలిపాయి.

ప్ర‌త్యామ్నాయంగా మ‌రికొన్ని దేశాలు..

అమెరికాతోపాటూ మ‌రికొన్ని దేశాల‌ను కూడా ఎల్‌పీజీ దిగుమ‌తుల‌కు ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయంగా చూస్తోంది. ఆల్జీరియా, అర్జెంటీనా, మ‌లేషియా, నైజీరియా వంటి ప్ర‌త్యామ్నాయ దేశాల‌ను కూడా భార‌త్‌ ప‌రిశీలిస్తోంది. కేవలం ఒకే ప్రాంతంపై ఎక్కువగా ఆధారపడటం వల్ల యుద్ధాలు, సరఫరా అంతరాయాలు ఏర్పడినప్పుడు ఎదురయ్యే ముప్పును త‌గ్గించే ల‌క్ష్యంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

పశ్చిమాసియా సంక్షోభంతో మారిన భారత్ దిగుమతుల వ్యూహం

ప‌శ్చిమాసియా సంక్షోభంతో భార‌త్ త‌న దిగుమ‌తుల వ్యూహాన్ని మార్చింది. వంటగ్యాస్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా గల్ఫ్ దేశాలపై ఆధారపడటాన్ని (Reduce Gulf Dependence) తగ్గించుకుంటూ దిగుమతులను భారీగా వైవిధ్యీకరించింది. గ‌తంలో భార‌త్ త‌న ఎల్‌పీజీ అవ‌స‌రాల్లో దాదాపు 90 శాతం గ‌ల్ఫ్ దేశాల నుంచే దిగుమ‌తి చేసుకునేది. అయితే, అమెరికా-ఇరాన్ యుద్ధంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో దేశీయంగా వంట‌గ్యాస్ స‌ర‌ఫ‌రా దెబ్బ‌తిన‌కుండా ఉండేందుకు భార‌త్ త‌న దిగుమ‌తుల వ్యూహాన్ని మార్చింది.

అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషణ సంస్థ 'కెప్లర్' (Kpler) విడుదల చేసిన గణాంకాల‌ను ప‌రిశీలిస్తే.. 2025లో మొత్తం LPG దిగుమతుల్లో అమెరికా వాటా 8 శాతం కంటే తక్కువగా ఉండేది. అయితే 2026 జనవరిలో అది 12 శాతానికి, ఫిబ్రవరిలో 13 శాతానికి పెరిగింది. యుద్ధం ప్రారంభ‌మై హ‌ర్మూజ్ జ‌ల‌సంధి గుండా ర‌వాణా ఆగిపోవ‌డంతో.. మార్చిలో అమెరికా నుంచి దిగుమ‌తులు ఒక్క‌సారిగా 37 శాతానికి ఎగబాకాయి. ఏప్రిల్‌లో 40 శాతానికి, మేలో 55 శాతానికి, జూన్‌లో 65 శాతానికి పెరిగింది.

అమెరికాతో ఒప్పందం..

గ‌తేడాది న‌వంబ‌ర్‌లో అమెరికాతో ఏడాది కాల‌ప‌రిమితిన నిర్మాణాత్మ‌క ఒప్పందాన్ని కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం 2026 సంవత్సరానికి దేశానికి అవసరమైన మొత్తం LPGలో సుమారు 10 శాతం అమెరికా నుంచే సేకరించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం మ‌ధ్య‌ప్రాచ్యంలో ఉద్రిక్త‌త‌ల స‌మ‌యంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింది. గ‌ల్ఫ్ దేశాల నుంచి ఎల్‌పీజీ ర‌వాణాకు ఆటంకం ఎదురైన స‌మ‌యంలో.. అమెరికా ప్రత్యామ్నాయ సరఫరాదారుగా నిలిచింది. యూఎస్ నుంచి వ‌చ్చిన ఎల్‌పీజీ దేశంలో వంట‌గ్యాస్ లోటును భ‌ర్తీ చేసింది.

Also Read..

బతికుండగానే కూతురికి దహన సంస్కారాలు.. కులాంతర వివాహం చేసుకుందని కన్నవాళ్ల దారుణం

భద్రాచ‌లం కొట్టుకుపోతుంద‌ని రేవంత్ చెప్ప‌మ‌న్న‌డా?

స్టాక్ మార్కెట్‌ల‌లో వరుసగా నాలుగో సెష‌న్‌లోనూ భారీ జోష్.. కొన‌సాగుతున్న బుల్ ర్యాలీ..

Advertisement
Advertisement