త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్‌ల‌లో వరుసగా నాలుగో సెష‌న్‌లోనూ భారీ జోష్.. కొన‌సాగుతున్న బుల్ ర్యాలీ..

Stock Markets | స్టాక్ మార్కెట్‌లో వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లో కూడా బలమైన ర్యాలీ కొనసాగింది. సోమవారం ట్రేడింగ్‌లో కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 మరోసారి లాభాలతో ముగిశాయి. దేశంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా కదలడం, ఈ నెలలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడం వల్ల ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే ధోరణి పెరిగింది.

S

Business | Published On Jul 6, 2026, 3.56 pm IST

Stock Markets | స్టాక్ మార్కెట్‌ల‌లో వరుసగా నాలుగో సెష‌న్‌లోనూ భారీ జోష్.. కొన‌సాగుతున్న బుల్ ర్యాలీ..
Advertisement

Stock Markets | స్టాక్ మార్కెట్‌ల‌లో వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లో కూడా బలమైన ర్యాలీ కొనసాగింది. సోమవారం ట్రేడింగ్‌లో కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 మరోసారి లాభాలతో ముగిశాయి. దేశంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా కదలడం, ఈ నెలలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడం వల్ల ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే ధోరణి పెరిగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 521 పాయింట్లు (0.67 శాతం) లాభపడి 78,285 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 160 పాయింట్లు (0.66 శాతం) పెరిగి 24,430 వద్ద క్లోజ్ అయింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాలు కూడా మంచి ప్రదర్శన కనబర్చాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.45 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.75 శాతం లాభాలతో ముగిశాయి.

పెట్టుబ‌డిదారుల‌కు రూ.8 ల‌క్ష‌ల కోట్లు లాభం..

ఈ ఒక్క ట్రేడింగ్ సెషన్‌లోనే పెట్టుబడిదారుల సంపద రూ.2 లక్షల కోట్లకు పైగా పెరిగింది. బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లో రూ.480 లక్షల కోట్లుగా ఉండగా, సోమవారం అది రూ.482 లక్షల కోట్లకు చేరుకుంది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 1,800 పాయింట్లకు పైగా (2.4 శాతం) పెరిగింది. అదే సమయంలో నిఫ్టీ 565 పాయింట్లు (2.4 శాతం) ఎగిసింది. ఈ నాలుగు రోజుల్లో పెట్టుబడిదారుల సంపద సుమారు రూ.8 లక్షల కోట్ల మేర పెరిగింది. జూన్ 30 నాటికి బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.474 లక్షల కోట్లుగా ఉంది.

భారీగా తగ్గిన చ‌మురు ధ‌ర‌లు..

మార్కెట్‌లో ఈ ర్యాలీకి పలు అనుకూల అంశాలు బలాన్నిచ్చాయి. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు గణనీయంగా తగ్గడం, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు సుమారు 72 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగడం, అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే బలహీనంగా రావడంతో ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు తగ్గడం వంటి పరిణామాలు మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు మ‌రోమారు భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.73 శాతం మేర త‌గ్గి బ్యారెల్‌కు 71 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.77 శాతం మేర ప‌త‌న‌మై బ్యారెల్‌కు 68 డాల‌ర్ల వ‌ద్ద నిలిచింది. ఫారెక్స్ మార్కెట్‌లో మాత్రం రూపాయి బ‌ల‌హీన‌త‌ను ప్ర‌ద‌ర్శించింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే భార‌త రూపాయి 95.39 వ‌ద్ద ఉండ‌గా, ఒక్క సెష‌న్‌లోనే 20 పైస‌లు న‌ష్ట‌పోయింది.

నెల రోజులు ఉంటుందా..

కాగా దేశంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకోవడం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడి ధోరణిలో మార్పు సంకేతాలు కనిపించడం, 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో కంపెనీల లాభాలు పుంజుకునే అవకాశాలపై ఉన్న అంచనాలు కూడా దీర్ఘకాలిక పెట్టుబడిదారులను మార్కెట్ వైపు ఆకర్షిస్తున్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ నెల రోజులు మార్కెట్ల‌కు చాలా కీల‌క‌మ‌ని, నెల‌రోజుల వ‌రకు ర్యాలీ కొన‌సాగితే మార్కెట్లు మ‌ళ్లీ కొత్త గ‌రిష్టాల‌ను న‌మోదు చేసే అవ‌కాశాలు ఉంటాయ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement