త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telegram | టెలిగ్రామ్‌లో మళ్లీ మెసేజ్ ఎడిట్ ఫీచర్.. పాత త‌ర‌హాలోనే ప‌నిచేస్తుంది..

Telegram | నీట్ రీ ఎగ్జామ్ నేప‌థ్యంలో భార‌త్‌లో ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ను కేంద్రం ఇటీవ‌లే నిషేధించ‌గా, ఎగ్జామ్ అనంత‌రం యాప్ మ‌ళ్లీ అందుబాటులోకి వ‌చ్చింది. అయితే యాప్ లో మెసేజ్ ఎడిటింగ్ ఫీచ‌ర్‌ను మాత్రం జూన్ 30 వ‌ర‌కు నిలిపివేశారు.

S

Technology | Published On Jul 1, 2026, 12.22 pm IST

Telegram | టెలిగ్రామ్‌లో మళ్లీ మెసేజ్ ఎడిట్ ఫీచర్.. పాత త‌ర‌హాలోనే ప‌నిచేస్తుంది..
Advertisement

Telegram | నీట్ రీ ఎగ్జామ్ నేప‌థ్యంలో భార‌త్‌లో ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ను కేంద్రం ఇటీవ‌లే నిషేధించ‌గా, ఎగ్జామ్ అనంత‌రం యాప్ మ‌ళ్లీ అందుబాటులోకి వ‌చ్చింది. అయితే యాప్ లో మెసేజ్ ఎడిటింగ్ ఫీచ‌ర్‌ను మాత్రం జూన్ 30 వ‌ర‌కు నిలిపివేశారు. ఇక ఆ గడువు కూడా ముగియడంతో ప్లాట్‌ఫామ్‌లో మ‌ళ్లీ మెసేజ్ ఎడిటింగ్ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింద‌ని టెలిగ్రామ్ వెల్ల‌డించింది. నీట్ రీ ఎగ్జామ్ వ‌ల్ల యాప్‌పై, మెసేజ్ ఎడిటింగ్‌పై తాత్కాలిక నిషేధం విధించ‌గా, ఇప్పుడు ఆ రెండు నిషేధాల‌ను కేంద్రం తొల‌గించింది. మెసేజ్ పంపిన తర్వాత అందులోని తప్పులను సరిచేయడం లేదా సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి ఉపయోగపడే టెలిగ్రామ్‌లోని మెసేజ్ ఎడిట్ ఫీచర్‌ను, నీట్ రీ-ఎగ్జామినేషన్‌కు ముందు తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్డుకోవడం, లీకైన పరీక్షా ప్రశ్నపత్రాలకు సంబంధించిన కంటెంట్ ప్రసారాన్ని నియంత్రించడం కోసం తాత్కాలికంగా నిలిపివేశారు.

ఫీచ‌ర్‌ను యాక్టివ్ చేసిన టెలిగ్రామ్‌..

ఇప్పుడు పరీక్షలు పూర్తికావడం, విధించిన ఆంక్షలు తొలగించడంతో టెలిగ్రామ్ ఈ ఎడిట్ ఫీచర్‌ను మళ్లీ యాక్టివ్ చేసింది. దీంతో వినియోగదారులు ఇప్పటికే పంపిన మెసేజ్‌లను అవసరమైతే సవరించుకునే అవకాశం లభించింది. విద్యార్థులు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు, విద్యా కమ్యూనిటీల్లో విస్తృతంగా ఉపయోగించే టెలిగ్రామ్‌పై పరీక్షల సమయంలో అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. పరీక్షలకు సంబంధించిన అనధికారిక సమాచారం వేగంగా వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు కొన్ని ఫీచర్లపై తాత్కాలిక పరిమితులు విధించారు. ముఖ్యంగా పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన మెసేజ్‌లను తర్వాత మార్చడం లేదా తారుమారు చేయడం కష్టంగా మారేలా ఈ చర్యలు తీసుకున్నారు. నీట్-యూజీ (NEET-UG) పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఘటన తర్వాత నిర్వహించిన రీ-ఎగ్జామినేషన్ విశ్వసనీయతను కాపాడేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అభ్యర్థన మేరకు జూన్ 16 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

ఎగ్జామ్ త‌రువాత నిషేధం ఎత్తివేత‌..

రీ-ఎగ్జామినేషన్ జూన్ 21న పూర్తయ్యాక, జూన్ 22 నుంచి టెలిగ్రామ్‌పై ఉన్న ప్రధాన నెట్‌వర్క్ బ్లాక్‌ను ఎత్తివేశారు. అయితే మెసేజ్ ఎడిట్ ఫీచర్‌ను మాత్రం నెలాఖరు వరకు తప్పనిసరిగా నిలిపివేయాలని టెలిగ్రామ్‌కు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా ప్రశ్నపత్రాల లీక్ జరిగిందనే తప్పుడు కథనాలను బలపరచడానికి టెలిగ్రామ్ ఎడిట్ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేశారని అధికారులు వెల్లడించారు. పాత పోస్టులను తర్వాత మార్చి తప్పుదారి పట్టించే ప్రయత్నాలను అడ్డుకునేందుకే ఈ ముందుజాగ్రత్త చర్యలు అమలు చేసినట్లు తెలిపారు.

Advertisement
Advertisement