త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jalalabad Renamed Parshurampuri | జలాలాబాద్ ఇక నుంచి పరశురాంపురి

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. షాజహాన్‌పూర్ జిల్లాలోని 'జలాలాబాద్' పేరును 'పరశురాంపురి'గా మారుస్తూ సీఎం యోగీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

J

National | Published On Jul 6, 2026, 5.23 pm IST

Jalalabad Renamed Parshurampuri | జలాలాబాద్ ఇక నుంచి పరశురాంపురి
Advertisement
  • ఎన్నికల వేళ యోగీ సర్కార్ కీలక నిర్ణయం
  • యూపీలోని జలాలాబాద్ పట్టణం పేరును 'పరశురాంపురి'గా మారుస్తూ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
  • ఈ ప్రాంతం శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడి జన్మస్థలమని స్థానికుల నమ్మకం
  • చాలా కాలంగా ఉన్న ప్రజల డిమాండ్, సాంస్కృతిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ నిర్ణయం
  • రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే యోగీ సర్కార్ కీలక అడుగు

Jalalabad Renamed Parshurampuri | త్రినేత్ర.న్యూస్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. షాజహాన్‌పూర్ జిల్లాలో ఉన్న 'జలాలాబాద్' (Jalalabad) పట్టణం పేరును 'పరశురాంపురి'గా (Parshurampuri) మారుస్తూ సోమవారం జరిగిన యూపీ క్యాబినెట్ మీటింగ్‌లో అధికారికంగా ఆమోదం తెలిపింది. త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పరశురాముడి జన్మస్థలమే కారణం

జలాలాబాద్ ప్రాంతానికి పురాణాలతో విడదీయరాని బంధం ఉంది. శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన భగవాన్ పరశురాముడి జన్మస్థలం ఇదేనని ఇక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తారు. ఈ ఆధ్యాత్మిక చరిత్రను గౌరవిస్తూ.. ఊరి పేరును మార్చాలని స్థానికులు, ప్రజా ప్రతినిధులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. వారి మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తాజా ప్రపోజల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై 'జలాలాబాద్ నగర పాలక పరిషత్' కూడా 'పరశురాంపురి నగర పాలక పరిషత్'గా మారనుంది.

కేంద్రం నుంచి NOC.. క్యాబినెట్ ఓకే

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సురేశ్ ఖన్నా ఈ పేరు మార్పుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. "జలాలాబాద్ పేరు మార్పునకు సంబంధించిన ప్రపోజల్ 2025 ఏప్రిల్ 24న ప్రభుత్వానికి అందింది. దీనిపై కేంద్రం అనుమతి కోసం జూన్ 27న లేఖ పంపాము. ఆగస్టు 19న కేంద్రం నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) వచ్చింది. దీంతో సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీలో ఏకగ్రీవంగా దీనికి ఆమోదం తెలిపాము" అని మంత్రి స్పష్టం చేశారు.

ఎన్నికల ముందు కొత్త వ్యూహం

కల్కి భగవానుడి జన్మస్థలంగా భావిస్తున్న 'సంభాల్' అభివృద్ధిపై ఇప్పటికే ప్రత్యేక ఫోకస్ పెట్టిన యోగీ సర్కార్.. ఇప్పుడు పరశురాముడి జన్మస్థలానికి కొత్త గుర్తింపు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోని హిందూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ఈ కొత్త పేరు అధికారికంగా అమల్లోకి వస్తుంది. తద్వారా ఈ పట్టణానికి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా సరికొత్త గుర్తింపు లభించనుంది.

Advertisement
Advertisement